సాయంత్రం లోపే ఇంటికెళ్లండి...సైబరాబాద్ పోలీసుల కీలక సూచన
Publish Date:Jun 22, 2026
Advertisement
భాగ్యనగరానికి భారీ వర్షం హెచ్చరిక.. హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దీ, రహదారులపై నీరు నిల్వ ఉండటం, అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నం దున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు సైబరాబాద్ పరిధిలోని అన్ని కంపెనీలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తమ ఉద్యోగులకు జూన్ 22 మధ్యాహ్నం 3:30 గంటల నుంచి దశలవారీగా 'ఎర్లీ లాగ్అవుట్' కల్పించే అంశాన్ని పరిశీలించాలని కోరింది. దీంతో ఉద్యోగులు ఒకేసారి రోడ్లపైకి రాకుండా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు అత్యవసర సేవలు సజావుగా సాగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, నీరు నిలిచిన రహదారుల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ ముందస్తు అడ్వైజరీ జారీ చేసినట్లు వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/heavy-rain-warning-in-hyderabad-36-223787.html





