షర్మిల విజయంపై కాదు.. మెజారిటీపైనే బెట్టింగులు!
Publish Date:May 20, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం గెలుపు ఓటములపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సారి గెలుపు విషయంలో తెలుగుదేశం కూటమివైపే బెట్టింగు రాయుళ్లు మొగ్గు చూపుతున్న పరిస్థితి. అంటే బెట్టింగు రాయుళ్లు అత్యధికంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తుందని పందేలు కాస్తున్నారు. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన కడప లోక్ సభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తే, వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇరువురిలో గెలుపు ఎవరిదన్న విషయంపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ముఖ్యంగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల విజయం సాధిస్తారంటూ లక్షల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే షర్మిల విజయం సాధిస్తుంది అన్నదానిపై కంటే ఆమె మెజారిటీ ఎంత అన్నదానిపైనే బెట్టింగు రాయుళ్లు పెద్ద మొత్తంలో పందెం ఒడ్డుతున్నారు. అలాగే జగన్ కు కంచుకోట లాంటి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బెట్టింగుల తీరు ఆశ్చర్య పరుస్తోంది. ఇక్కడ జగన్ విజయంపై కంటే ఆయన మెజారిటీ భారీగా తగ్గుతుందన్న దానిపై బెట్టింగు రాయుళ్లు పందెం కాస్తున్నారు. అయితే కడప జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలలో ఫలితం మెజారిటీలపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతుండటం విస్మయం గొలుపుతోంది. అదే సమయంలో జగన్ కడప కోటకు బీటలువారాయన్న విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తున్నది. కడప లోక్ సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలపై కమలాపురం మండలంలోని ఆదినిమ్మాయపల్లి, వల్లూరు గ్రామాల మధ్యన ఉన్న ఒక సూపర్ మార్కెట్ వద్ద ఈబెట్టింగ్ దందా నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఒక ధాన్యం వ్యాపారి పర్యవేక్షణలో ఈ బెట్టింగ్ దందా సాగుతోందని చెబుతున్నారు. ఇక ఆ తరువాత జిల్లాలో అత్యధికంగా రాజంపేట లోక్ సభ స్థానంలో కూటమి అభ్యర్థి విజయంపై పందెం రాయుళ్లు పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాస్తున్నారు. అయితే తెలుగుదేశం కూటమి కి అనుకూలంగా పెద్ద ఎత్తున బెట్టింగ్ కు పందెంరాయుళ్లు ముందుకు వస్తున్నారనీ, వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ కాయడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/heavy-bettings-on-sharmila-majority-in-kadapa-39-176378.html