ఇరాన్తో యుద్దం ముగిసిందా? .. సెనెట్ను వైట్హౌస్ మభ్యపెడుతోందా?
Publish Date:May 2, 2026
Advertisement
ఇరాన్తో యుద్దం ముగిసిందని వైెట్ హౌస్ ప్రకటించింది. దాంతో ఇరాన్తో యుద్దానికి యూఎస్ కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా ట్రంప్ సర్కారు జాగ్రత్త పడింది. ఇప్పటికే సెనెట్లో విచారణకు హాజరైన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో, అమెరికాకు సంబంధించిన ఒక కీలక చట్టం గురించి చర్చ మొదలైంది. అదే 1973 నాటి వార్ పవర్ చట్టం . ఈ చట్టం ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకుండా అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం వాస్తవంగా ఎంతవరకు అమలవుతోంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. యుద్ధంపై తుది నిర్ణయం ఒక్క అధ్యక్షుడి చేతిలోనే కాకుండా, ప్రజల ప్రతినిధులైన కాంగ్రెస్ చేతుల్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం అమెరికా అధ్యక్షుడు సైనిక చర్యలు ప్రారంభించిన 48 గంటల్లో కాంగ్రెస్కు సమాచారం ఇవ్వాలి. కాంగ్రెస్ అనుమతి లేకుండా గరిష్ఠంగా 60 రోజుల వరకు మాత్రమే యుద్ధాన్ని కొనసాగించవచ్చు. ఆ తర్వాత సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి మరో 30 రోజుల గడువు తీసుకోవచ్చు. అంటే మొత్తం మీద 90 రోజుల్లో యుద్ధాన్ని ముగించాలి లేదా కాంగ్రెస్ నుంచి అధికారిక అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం ఇరాన్తో అమెరికా యుద్ధం ప్రారంభమై 60 రోజులు దాటింది. ఈ యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి లేదు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం యుద్దం ముగిసినట్లు కీలక వాదనను ముందుకు తెచ్చింది. ఆ క్రమంలో ఇరాన్తో యుద్దం నిజంగా ముగిసిందా? .. అనుమతి తీసుకోవడం ఇష్టం లేక సెనెట్ను వైట్హౌస్ మభ్యపెడుతోందా? అన్న చర్చ మొదలైంది.
http://www.teluguone.com/news/content/has-the-war-with-iran-ended-36-218838.html





