జావో జగన్.. ఆవో బాబు..!
Publish Date:May 12, 2022
Advertisement
2024 ఎన్నికలు. ఏపీ ఎలా జరగబోతున్నాయి..? గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జగన్ పార్టీ వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఏపీ జనాలు ఎలాంటి సీన్ చూపించబోతున్నారు..? జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడేం చేయబోతున్నారు? కొన్ని మెట్లు దిగి అయినా పొత్తులతో మళ్లీ జయపతాకం ఎగరేస్తారా? గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా ప్రజా సమస్యలపై స్పందిస్తూ జనాల్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏం చేయబోతున్నారు..? ఏపీలో ఎప్పుడూ గుర్తింపు పొందని జాతీయ పార్టీ బీజేపీ మద్దతు ఎవరికి..? ఏపీలో వైసీపీకి గానీ.. సీఎం జగన్ కి గాని 2019 నాటి క్రేజ్ ఇప్పుడు లేదనేందుకు అనేక అంశాలు, సంఘటనలూ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మూడేళ్లకుపైగా అధికారంలో ఉన్న జగన్ పాలనతో ఆయన సత్తా ఏంటో.. వైసీపీ రంగేంటో జనానికి బాగా తెలిసింది. జగన్ వల్ల అభివృద్ధి శూన్యమని.. ధరలు పెరిగిపోయని సామాన్యులు, మధ్యతరగతి జన జీవనం దుర్భరంగా మారినా పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలున్నాయి. జగన్ అనుభవ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనంత దుర్భరం అయింది. కొత్త ప్రాజెక్టులు రావు.. ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావు.. ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలియని అయోమయం. జగన్ సీఎం అయినప్పటి నుంచీ ఏపీ రాజధానిపై గందరగోళం కొనసాగుతోంది. ఉన్న జిల్లాలతో పాలన సరిగా లేకపోయినా కొత్త జిల్లాలు ఏర్పాటు ఎందుకో అంటున్నారు. మంత్రివర్గ పునర్నిర్మాణం.. కొత్త కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చూస్తే ‘అసలు తక్కువ.. హంగామా ఎక్కువ’ అన్నట్లు ఉందంటున్నారు. జగన్ ఇచ్చే ఉచితాలు లబ్ధిదారులకు కూడా వెగటు కలిగిస్తున్నాయట. జగన్ రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాలో సొమ్ములు నిండుకున్నాయి. ధరల పెరుగుదల జనం నెత్తిన పిడుగులా మారింది. విద్యుత్ సంక్షోభం.. క్షీణించిన శాంతి భద్రతలు.. మహిళలకు రక్షణ లేకపోవడం.. ఫలితాలివ్వని సచివాలయ వ్యవస్థ.. చెత్త పన్ను.. ఎమ్మెల్యేలు.. వైసీపీ నేతల ఆగడాలు లాంటి ఎన్నో మైనస్ లతో.. పూర్ ట్రాక్ తో వైసీపీ ఎన్నికల్ని ఫేస్ చేయాల్సి ఉంది. అధికారంలోకి రాక ముందు ఓదార్పు యాత్రతో జనాల్లో తిరిగిన జగన్ దర్శనం సీఎం అయ్యాక కరవైపోయింది. కరోనా.. తుపాను లాంటి అత్యవసర సందర్భాల్లో కూడా జనానికి జగన్ అందుబాటులో ఉన్న సందర్భాలే లేవు. ఇలాంటి ధోరణుల వల్లే జనానికి- జగన్ కి మధ్య దూరం పెరిగిపోయిందనేది వాస్తవం. జగన్ ఏలుబడి పట్ల, వైసీపీ పాలన పట్ల జనానికి ముఖం మొత్తేసిందటున్నారు. మొన్నటికి మొన్న తిరుపతిలో జగన్ సభకు బలవంతంగా తీసుకువచ్చిన డ్వాక్రా మహిళలు సహా అనేక మంది సభా ప్రాంగణం ఫెన్సింగ్ దూకి మరీ పారిపోవడం లాంటి దృశ్యాలు ఇందుకు ఉదాహరణ. 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో టీడీపీ అధినేత జనం మధ్యలోనే తిరుగుతున్నారు. వైసీపీ సర్కార్ తప్పుల్ని ఎత్తిచూపడంలో, సమస్య వచ్చినప్పుడు తానే రంగంలోకి దిగడం, పార్టీని నడిపిస్తున్న తీరు ఏపీలో మళ్లీ టీడీపీకి పూర్వపు వైభవం వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. వయసు పైబడినా.. సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి చంద్రబాబు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఏపీలో విద్యుత్ సమస్యలపై పోరాడినా.. ఆర్థిక సమస్యల గురించి మాట్లాడినా.. ప్రాజెక్టులపై గళమెత్తినా.. శాంతి భద్రతలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై స్పందించినా.. రహదారుల దుస్థితిపై నినదించినా.. ఆయన ఎక్స్ పీరియన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు తాజాగా చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి జనం నుంచి భారీ స్పందన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనం ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో స్పష్టం అవుతోందంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ కు జనంలో విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్ మాటలు జనాన్ని ఆకట్టుకుంటాయి. సమస్యలపై పోరాటాలూ చేస్తారు. ఇవి పవన్ కళ్యాణ్ ప్లస్ పాయింట్లు. 2019లో తనను జనం ఆమోదించకపోయినా వచ్చే ఎన్నికలకు షాట్ రెడీ చేసుకుంటున్నారు పవన్. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ పిలుపు వచ్చే ఎన్నికల్లో కీలకం అంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుందనుకున్నా పొత్తు కుదుర్చుకుంటే బీజేపీతో జగన్ వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ జగన్ తో చేతులు కలిపే సంకేతాలు బీజేపీ నుంచి లేవు. పవన్ మాటలతో టీడీపీ- జనసేన పొత్తుపై కొత్త ఆశలు కలుగుతున్నాయి. జనసేనతో ఇప్పటికే పొత్తున్న బీజేపీ రేపు చంద్రబాబుకు పవన్ దగ్గరైతే ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే జరిగితే బాబుతో బీజేపీ మరోసారి దోస్తీకి సిద్ధపడినట్టే. అప్పుడు వైసీపీ అధినేతకు దబిడి దిబిడి తప్పదంటున్నారు విశ్లేషకులు.
http://www.teluguone.com/news/content/go-away-jagan-welcome-to-chandrababu-39-135775.html





