ఖమ్మం లోక్ సభ.. పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే!
Publish Date:May 3, 2024
Advertisement
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన నామా నాగేశ్వరరావుకు తీవ్ర ప్రజా వ్యతిరేకత స్వాగతం పలుకుతోంది. అదే సమయంలో నామా గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతారు అన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన మొదటికే మోసం తెచ్చిందని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యలతో బీజేపీతో రహస్య బంధం అన్న ఆరోపణలు వాస్తవమని తేల్చేశారనీ, ఇంతోటి దానికి బీఆర్ఎస్ కు ఓటు వేయడం ఎందుకు అంటూ కారు పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోందని అంటున్నారు. దీంతో ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి ఖారరైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తొలి సారి ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేసి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తాండ్ర వినోదరావు అనూహ్యంగా పుంజుకున్నారు.
ఎప్పుడైతే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డిని అభ్యర్థిగా పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిందో.. ఆ క్షణం నుంచీ ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే రామసహాయం రఘఉరామరెడ్డిని ఎక్కడో ఆకాశం నుంచి తీసుకువచ్చిన అభ్యర్థి కాదు. ఆయనది కాంగ్రెస్ కుటుంబం. ఆయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి నాలుగు సార్లు లోక్ సభ సభ్యుడిగా పని చేశారు. అలా రామసహాయం రఘురామరెడ్డి రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి. అంతే కాకుండా ఆర్ధికంగా కూడా బలమైన అభ్యర్థి. ఇక తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వయానా వియ్యంకుడు, అదే విధంగా ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ కు కూడా ఆయన వియ్యంకుడు. అంటే ఇటు రాజకీయరంగంలోనూ, అటు సీనీ పరిశ్రమలోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతే కాకుండా కాంగ్రెస్ కమ్మ సామాజికవర్గం వారిని దూరం పెట్టిందన్న అపప్రధ కూడా రామసహాయం రాఘురామరెడ్డికి ఖమ్మం లోక్ సభ టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తొలగించుకుంది. ఎందుకంటే ఆయన వెంకటేష్ కు స్వయానా వియ్యంకుడు కావడంతో ఇటు కమ్మ, అటు రెడ్డి సామాజికవర్గాలకు ఆయన బంధువు అయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది. అదే జోష్ ఇంకా ఖమ్మం కాంగ్రెస్ లో అలాగే ఉంది. దీనికి తోడు అభ్యర్థి ఎంపికలో అసంతృప్తి, అసమ్మతికి తావు లేకుండా పార్టీలోని అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యుడైన రఘురామరెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వడంతో ఖమ్మంలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న భావన పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. అయితే ప్రజాసేవకు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చిన వినోదరావు తొలిసారి ఎన్నికల బరిలో దిగినా ప్రచారంలో కాంగ్రెస్ కు దీటుగా దూసుకుపోతున్నారు. ఆయన ప్రచార వేగం చూస్తుంటే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్నారని అనిపించక మానదు.
http://www.teluguone.com/news/content/fight-between-congress-amd-bjp-in-khammam-25-175066.html