పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు..33 వేల కోట్ల వ్యయం.. 33 ఎకరాలకు కూడా నీరందలేదు!
Publish Date:May 8, 2026
Advertisement
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని, కమీషన్ల కోసం ప్రాజెక్టును బలిపెట్టాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శించారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్-చౌదరిగూడలో శుక్రవారం నిర్వహించిన 'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ'లో మాట్లాడిన కవిత.. ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేసినా.. కనీసం 33 ఎకరాలకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీరు అందించలేకపోయిందన్న ఆమె.. ఓ గుంటనక్క కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టు డిజైన్ మార్చిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జూరాల నుంచి శ్రీశైలానికి సోర్స్ పాయింట్ మార్చడం క్షమించరాని నేరమనీ, ఈ మార్పు వల్లనే ఆంధ్రప్రదేశ్తో వివాదాలు తలెత్తుతున్నాయని కవిత అన్నారు. అలాగే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఆమె విమర్శలు గుప్పించారు. నల్లమల పులి బిడ్డ నని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని విమర్శించారు. ప్రాజెక్టు పేరుతో రూ.6 వేల కోట్ల బిల్లులు చెల్లించి రేవంత్ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. దసరాలోపు పనులు ప్రారంభించకపోతే పాదయాత్ర చేసి కాంగ్రెస్ను ఎండగడతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. నీటి పారుదలపై వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
http://www.teluguone.com/news/content/expenditure-of-33thousand-crore-25-219272.html





