కేసీఆర్ కు ఇద్దరు మొనగాళ్ల దెబ్బ.. గులాబీ పార్టీకి ఇక గండాలేనా?
Publish Date:Nov 3, 2021
Advertisement
ఉప ఎన్నికలు.. తెలంగాణ రాష్ట్ర సమితికి అచ్చొచ్చిన అంశం. ఉద్యమ సమయంలో పార్టీ బలోపేతానికి ఉపఎన్నికలనే అస్త్త్రాలుగా మార్చుకున్నారు కేసీఆర్. ఉప ఎన్నికల ద్వారానే కారు పార్టీ జనంలోకి చోచ్చుకుని వెళ్లగలిగింది. వైఎస్సార్ టైమ్ లో కొన్ని ఓడిపోయినా.. బైపోల్స్ మాత్రం టీఆర్ఎస్ కు బూస్ట్ ఇస్తూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర్రం వచ్చాక కూడా ఉప ఎన్నికల్లో సత్తా చాటింది గులాబీ పార్టీ. 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం ఎనిమిది ఉప ఎన్నికలు జరగగా.. ఆరింటిలో టీఆర్ఎస్ పార్టీయే జయకేతనం ఎగురవేసింది. 2014లో మెదక్ లోక్ సభ, 2015లో జరిగిన వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో విజయం సాధించింది కారు పార్టీ. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో 2016లో పాలేరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. 2016లోనే నారాయణ్ ఖేడ్ కు జరిగిన ఉప ఎన్నికలోనూ కారు దూసుకుపోయింది. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతికి షాకిచ్చింది గులాబీ పార్టీ. నోముల నర్సింహయ్య మరణంతో 2021 లో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో రాజకీయ దిగ్గజం జానారెడ్డిని మట్టికరిపించి సత్తా చాటింది అధికార పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. అవి దుబ్బాక, తాజాగా జరిగిన హుజురాబాద్. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు రఘునందన్ రావు. తాజాగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ బంపర్ విక్టరీ కొట్టి కారుకు షాకిచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ ను ఎదురించి నిలిచిన ఇద్దరు మొనగాళ్లుగా రఘునందన్ రావు, ఈటల రాజేందర్ నిలిచారు. కేసీఆర్ వ్యూహాలు, కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టడం వల్లే ఈ ఇద్దరు విజయం సాధించారని చెబుతున్నారు. రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది కేసీఆర్ ఎత్తుగడులను ఊహించి తిప్పికొట్టడమే. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు కాబట్టే అధికార పార్డీని ఓడించగలిగారు ఈ ఇద్దరు నేతలు. ఇందుకు వాళ్లు గతంలో కేసీఆర్ తో పనిచేసిన అనుభవమే సహకరించిందని అంటున్నారు. రఘునందన్ రావు, ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతల్లో రఘునందన్ ఒకరు. కేసీఆర్ కోటరిలో ముఖ్యుడిగా ఉన్నారు. 2001-13 మధ్య టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు రచించండంతో కేసీఆర్ కు రఘునందన్ రావు కీలకంగా ఉన్నారు. 2006, 2008, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కేసీఆర్ తో కలిసి రఘునందన్ రావు వ్యూహాలు రచించారు. 2013లో కేసీఆర్ తో విభేదాలు రావడంతో టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. 2014లో బీజేపీలో చేరారు రఘునందన్ రావు. ఇక ఈటల రాజేందర్ 2003 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కొద్ది కాలంలోనే ఆయన కేసీఆర్ కు దగ్గరయ్యారు. పార్టీలో టాప్ ఫైవ్ లీడర్లలో ఒకరిగా నిలిచారు. హుజురాబాద్ నుంచి వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు ఈటల. 2009లో అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా వ్యవహరించారు. బీసీ లీడర్ గా ఎదిగిన రాజేందర్.. కేసీఆర్ కు కుడిభుజంగా నిలిచారని చెబుతున్నారు. రాజకీయ ఎత్తుగడలను ఈటల ద్వారానే కేసీఆర్ అమలు చేసే వారంటారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యమ సంఘాలు, కుల సంఘాలను చీల్చడంలోఈటలను కేసీఆర్ పావుగా వాడారని చెబుతారు. మందకృష్ణ, ఆర్ కృష్ణయ్యకు పోటీగా కొత్త సంఘాలు ఏర్పాటైంది అందులో భాగాంగానే. కేసీఆర్ ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయో అతి దగ్గరగా చూసిన వ్యక్తి ఈటల రాజేందర్. సిద్దిపేట నుంచి నాగార్జున సాగర్ వరకు.. అన్ని ఉప ఎన్నికల్లో కీలకంగానే వ్యవరించారు ఈటల రాజేందర్. కేసీఆర్ తో సన్నిహితంగా ఉండటం, ఆయన ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టే... దుబ్బాక, హుజురాబాద్ లో వాళ్లిద్దరు అధికార పార్టీని ఎదుర్కొని నిలిచారని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాలకు ధీటుగా తమ ఎత్తుగడలు అమలు చేయడం, సైలెంటుగా పని కానియడం కలిసివచ్చిందనే చర్చ నడుస్తోంది. తాజా విజయంతో అసెంబ్లీలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. ఇకపై సభలో అధికార పార్టీకి చుక్కలు కనిపిస్తాయని, రాజా సింగ్, రఘునందన్ రావు, రాజేందర్ లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఖాయమంటున్నారు. గతంలో ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన అనుభవం రాజేందర్ కు ఉంది. సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలను ఎదురించారు రాజేందర్. ఇకపై కేసీఆర్ ను చీల్చి చెండాడుతారని అంటున్నారు. ఇంతకాలం అసెంబ్లీ ఏకపక్షంగా సాగేదని, ఇకపై కేసీఆర్ కు సమస్యలు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది.
http://www.teluguone.com/news/content/etela-rajender-raghunandan-rao-fight-with-kcr-in-assembly-25-125760.html