పారదర్శక పాలనకు డిజిటల్ గవర్నెన్స్.. సీఎం రేవంత్.!
Publish Date:Jul 8, 2026
Advertisement
పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలన్నారు. ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (జులై 7) సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సూచించారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్నారు. రాష్ట్రంలో రమారమి 4వేల 800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా.. ఇందులో 4వేల 300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటి నుంచి 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి, పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయాలనీ, ఇందుకు వివిధ విభాగాల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీ 100 రోజుల్లో ఈ అంశాన్ని కొలిక్కి తీసుకు రావాలని ఆదేశించారు. transparent administration, Telangana CM, Revanth Reddy, MCRHRD, Outsource, Employees
http://www.teluguone.com/news/content/digital-governance-for-transparent-administration-36-225360.html





