బండి పని మొదలెట్టేశారా!?
Publish Date:Jul 6, 2022
Advertisement
తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి చరిత్రను బయటపెడతామంటూ జాతీయ కార్యవర్గ సమావేశాల ముంగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ దిశగా పని మొదలెట్టేశారా అంటే ఔననే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఎలుకను పడతారో లేదో తెలియదు కానీ కొండను తవ్వే పని మాత్రం ప్రారంభించేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇంత కాలం చెబుతూ వచ్చిన బండి సంజయ్ ఇప్పుడు వాటిని బయట పెట్టడం సంగతి అటుంచి సమాచారం కావాలంటూ ఆర్టీఐకి దరఖాస్తులు చేశారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ బండి సంజయ్ ఆర్టీఐకి దాదాపు 80 దరఖాస్తులు చేశారు. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరుతూ ఈ దరఖాస్తులు చేశారు. ప్రజా కోర్టులో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆర్టీఐ ద్వారా సమాచార సేకరణ ఏంత వరకూ పనికొస్తుందని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి సమాచారం ఆర్టీఐ దరఖాస్తులతో బయటకు వస్తుందని భావించడమే సరికాదని అంటున్నారు. అయినా అవీనితిపై ఆధారాలున్నాయంటూ ఇంత కాలం చెబుతూవచ్చిన బండి సంజయ్ ఇప్పుడు కొత్తగా ఆర్టీఐ దరఖాస్తుల పేరుతో హడావుడి చేయడమే ఆయన వద్ద ఎటువంటి ఆధారాలూ, సమాచారమూ లేదనడానికి నిదర్శనమని పరిశీలకులు సైతం సెటైర్లు వేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ దేశ వ్యాప్తంగా తమ రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ విషయంలో మాత్రం అటువంటి హడావుడి చేయకపోవడం, కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని బట్టయబలు చేస్తాం... ఆధారాలున్నాయి అంటూ ప్రసంగాలతో చెలరేగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు సమాచారం కోరుతూ ఆర్టీఐని ఆశ్రయించడం చూస్తుంటే.. బీజేపీ, టీఆర్ఎస్ లు పరస్పర విమర్శలూ, ఆరోపణలూ ఏదో రాజకీయ డ్రామాగానే కనిపిస్తున్నాయని శిశ్లేషకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/did-bandi-started-digging-government-corruption-25-139220.html