తెలంగాణలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..మూడు రోజుల పాటు వానలు
Publish Date:Mar 31, 2025
Advertisement
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. భూ ఉపరితలం వేడెక్కడం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం (ఏప్రిల్ 1) నుంచి గురువారం (ఏప్రిల్3) వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకూ తగ్గుతాయని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మొదక్, కామారెడ్డి, జోగులాంబ, వనపర్తి, వికారాబాద్, గద్వాల్ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది.
http://www.teluguone.com/news/content/cool-telangana-39-195340.html





