తెలంగాణ అభివృద్ధికి సహకరించండి : సీఎం రేవంత్
Publish Date:May 10, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. అభివృద్ధి ఉత్సవమని సీఎం పేర్కొన్నారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ముందు దేశం.. తర్వాత ప్రజలు.. ఆ తర్వాతే పార్టీ అనే స్పష్టమైన దృక్పథంతో తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. అదే స్ఫూర్తితో ప్రధాని ప్రకటించిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి తాము భాగస్వాములయ్యామని చెప్పారు. తెలంగాణ రైజింగ్కు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలని ప్రయత్నిస్తున్నామని, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల కోసం ప్రధాని వచ్చినట్లు తెలిపారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో మీరు ‘గుజరాత్ మోడల్’ను అభివృద్ధి చేశారని రేవంత్ గుర్తుచేశారు. అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. మన్మోహన్ సింగ్ చూపిన స్ఫూర్తితో మీరు కూడా పూర్తి సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. నాడు మన్మోహన్ సింగ్ ఆశీస్సులు అందించినట్లే, తెలంగాణ ప్రజలకు కూడా మీరు ఆశీస్సులు అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.భారీ ఆర్థిక వృద్ధి మహానగరాల ద్వారానే సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి ఆరు మహానగరాలు దేశ అభివృద్ధికి కేంద్ర బిందువులని అన్నారు. దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించాలంటే ఈ మెట్రో నగరాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆరు మెట్రో నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.“మోదీ గారూ.. నా రాష్ట్రం, నా ప్రజల కోసం నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను పలుమార్లు కలిశాను. తెలంగాణకు సంబంధించిన కొన్ని కీలక ప్రాజెక్టులకు అత్యవసర అనుమతులు అవసరం” అని సీఎం తెలిపారు. మూసీ నది అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-మచిలీపట్నం మధ్య 12 లైన్ల రహదారి వంటి అంశాలపై రెండు గంటల పాటు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ మీకు పెద్ద మనసు ఉందని చెబుతున్నారని.. తెలంగాణ ప్రజలు కూడా అదే నమ్మకంతో ఉన్నారని సీఎం అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, ప్రతిపాదనలకు ఈరోజే ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని పేర్కొన్నారు.“దేశ ప్రయోజనాల విషయంలో మేము ఎప్పుడూ మీతో కలిసి ఉంటాం. మీరు ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు.. మేము కూడా రాష్ట్ర స్థాయిలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ను దానికి అనుసంధానం చేశాం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
http://www.teluguone.com/news/content/contribute-to-the-development-of-telangana-36-219394.html





