యుద్ధంపై అమెరికా, ఇరాన్ పరస్పర విరుద్ధ ప్రకటనలు.. శాంతి ఎండమావేనా?
Publish Date:Mar 30, 2026
Advertisement
అమెరికాతో చర్చలు జరపడం లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేర జరుగుతున్న యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించిన తరుణంలో చర్చలు సానుకూలంగా ఉన్నాయంటూ వైట్ హౌస్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంప్రదింపులు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఈ మేరకు గత 31 రోజులుగా అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. చర్చల కోసం పాకిస్థాన్ వంటి మధ్యవర్తుల ద్వారా అమెరికా కేవలం కొన్ని ప్రతిపాదనలు మాత్రమే పంపిందని పేర్కొన్నారు. గతంలోని దౌత్యపరమైన చేదు అనుభవాలను, ద్రోహాలను మరిచిపోలేదంటూ.. ప్రస్తుతం దేశ రక్షణపైనే తమ దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నారు. ఇరాన్తో చర్చలు సానుకూల దిశలో ఉన్నాయన్న వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, త్వరలోనే ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. వివాదాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ప్రణాళికను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ట్రంప్ శాంతి ప్రణాళికకు బదులుగా యుద్ధ నష్టపరిహారం, ఆంక్షల ఎత్తివేత సహా ఐదు షరతులను విధించింది. ఇరాన్, అమెరికాల పరస్పర విరుద్ధ ప్రకటనలతో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ఇరాన్ వాదనకు పూర్తి విరుద్ధంగా అమెరికా చేస్తున్న ప్రకటనలతో గందరగోళం ఏర్పడుతోంది.
http://www.teluguone.com/news/content/conflicting-statements-from-us-iran-36-216422.html





