4 వేల కోట్లకు చేరిన కోలివింగ్ వ్యాపారం!
Publish Date:Jun 24, 2026
Advertisement
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ భారతదేశంలో మెట్రోపాలిటన్ సంస్కృతి శరవేగంగా మారిపోతోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, యువ టెక్కీల జీవన విధానంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు చదువు కోసమో, ఉద్యోగం కోసమో నగరాలకు వస్తే అబ్బాయిలు విడిగా రూములు, అమ్మాయిలు ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో ఉండేవారు. కానీ.. ఇప్పుడు ఆ పాత పద్ధతులకు కాలం చెల్లింది. సమాజంలో సరికొత్తగా దూసుకొచ్చిన కో-లివింగ్ కల్చర్ ఇప్పుడు ఒక పెను సంచలనంగా మారింది. కేవలం ఇదొక జీవన విధానం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా అవతరించిందని ప్రముఖ విశ్లేషకులు భరద్వాజ చెప్పారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో ఈ కో లివింగ్ మార్కెట్ విలువ అక్షరాలా 4,000 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. ఇందులో హైదరాబాద్ వాటానే దాదాపు 750 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. ఈ సరికొత్త కో-లివింగ్ విధానంలో ఆడ, మగ అనే తేడా లేకుండా స్నేహితులు లేదా సహోద్యోగులు కలిసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ మందగమనం వల్ల 80 వేల నుంచి లక్ష ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఐదు, ఆరు బెడ్రూమ్లు ఉండే ఇలాంటి భారీ ఫ్లాట్లను.. పెంట్ హౌస్లను ఐటీ టెక్కీలు గ్రూపులుగా ఏర్పడి అద్దెకు తీసుకుంటున్నారు. సాధారణ పీజీ హాస్టల్స్ కంటే ఇక్కడ అద్దెలు చాలా ఎక్కువ అయినప్పటికీ.. ఐటీ రంగానికి చెందిన యువత ఖర్చుకు వెనుకాడటం లేదు. సొంతంగా వంటమనుషులను పెట్టుకుని, తమకు నచ్చిన ఆహారాన్ని వండించుకుంటూ, వీకెండ్స్ వస్తే హోమ్ థియేటర్లు, మినీ బార్ సెటప్లతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సరికొత్త లైఫ్ స్టైల్కు మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన యువతే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. చిన్న నగరాలు, గ్రామాల నుండి వచ్చి, సినిమాల్లో చూసిన లగ్జరీ జీవితాన్ని ఇక్కడ ఓపెన్గా అనుభవించాలనుకుంటున్నారు. అయితే.. ఈ సంస్కృతి కేవలం ఎంజాయ్మెంట్కే పరిమితం కాలేదు. వివిధ వృత్తులు, విభిన్న రంగాలకు చెందిన టెక్కీలు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఒకే చోట ఉండటం వల్ల నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్ జరుగుతోంది. ఒకరి అనుభవాలు మరొకరు పంచుకుంటూ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ ప్రైవసీని గౌరవిస్తారు. ఒకరి వ్యక్తిగత విషయాల్లోకి మరొకరు అస్సలు జోక్యం చేసుకోరు. విడిపోవాల్సి వస్తే సమాజానికి తెలియజేయడానికి బ్రేకప్ పార్టీలు కూడా చేసుకుంటున్నారు. ఈ జీవన విధానంపై సమాజంలోని సాంప్రదాయవాదులు భిన్నంగా స్పందిస్తున్నప్పటికీ, మార్కెట్ మాత్రం పూర్తి హ్యాపీగా ఉంది. స్విగ్గీ, జొమాటోల ద్వారా నిరంతరం ఫుడ్ ఆర్డర్లు చేయడం, కార్లు, ఈఎంఐల కల్చర్ పెరగడం వల్ల మార్కెట్ ఎకానమీ విపరీతంగా విస్తరిస్తోంది. కోర్టులు కూడా ఇద్దరు వయోజనులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండటాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేయడంతో చట్టపరంగా కూడా వీరికి అండ లభించింది. ఫలితంగా పోలీసులు సైతం ఇటువంటి వ్యవహారాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పాల్సి వస్తోంది. బాధ్యతలను భుజాన వేసుకోవడానికి ఇష్టపడని యువత, సాంప్రదాయ పెళ్లిళ్లకు దూరంగా ఉంటూ ఈ సరికొత్త ఆధునిక జీవన వేదాంతాన్ని అనుసరిస్తున్నారు. మార్కెట్ అవసరాలు, యువత స్వేచ్ఛా కాంక్ష కలిసి ఈ రూ. 4,000 కోట్ల కో-లివింగ్ బిజినెస్ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయని భరద్వాజ వివరించారు.
http://www.teluguone.com/news/content/coliving-business-reaches-4-36-224011.html





