మ్యాచ్ ఆఖరి ఓవర్ మొదలయినట్లేనా..ఏమో
Publish Date:Oct 25, 2013
Advertisement
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ త్వరలో తన ఆఖరి మ్యాచ్ ఆడి రిటైర్ అవ్వబోతున్నట్లు ప్రకటించారు. అందులో సందేహమేమీ లేదు. కానీ సరిగ్గా ఇదే సమయంలో స్టార్ బ్యాట్స్ మ్యాన్ కెప్టెన్ కిరణ్ కుమార్ కూడా లాస్ట్ ఓవర్ ఆడేందుకు సిద్దం పడుతున్నారు. అయితే ఆయన ఈ ఓవర్ తరువాత రిటైర్ అవుతారా లేక ఇంకా ఆట కొనసాగిస్తారా లేక అధిష్టానమే వాలంటరీ రిటైర్ ఇస్తుందా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి పార్టీ అధిష్టానాన్నికాదని నేరుగా ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు వ్రాయడంతో, ఇక పరిస్థితి పార్టీ చేయి దాటిపోయిందనే భావన ఆయన వ్యక్తం చేసినట్లయింది. ఇంతకాలం శాసనసభకు తెలంగాణా బిల్లు తప్పకుండా వస్తుందని ప్రజలకి, తన మంత్రులకి చెపుతూ, దానిని ఓడించేవరకూ పదవులలో కొనసాగుదామని చెపుతున్నముఖ్యమంత్రి, తన ప్రమేయం లేకుండానే అక్కడ డిల్లీలో రాష్ట్ర విభజన కసరత్తు చకచకా జరిగిపోతుండటంతో, విభజన సజావుగా సాగిపోయేందుకే ఆయన ఈనాటకం ఆడుతున్నారని ప్రజలలో కూడా అనుమానాలు మొదలవడంతో, బహుశః ఈ లేఖాస్త్రాలు సందించి ఉండవచ్చును. లేకుంటే మొదటి నుండి చెపుతున్నట్లే శాసనసభకు తెలంగాణా బిల్లో మరొకటో వచ్చేవరకు ఆయన ఆగి ఉండేవారు. ముఖ్యమంత్రి అధికారిక రచ్చబండ కార్యక్రమం తేదీలు ఖరారు చేసుకొన్నతరువాత ఈ లేఖలు వ్రాయడం చూస్తే, అవి ముగిసే వరకు తన పదవికి ఎటువంటి ప్రమాదం లేదని భావిస్తున్నారను కోవచ్చును. ఎందుకంటే ఇంతవరకు ఆయనను పక్కనబెట్టి పనికానిచేస్తున్నకాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకొంటే దానివల్ల వెంటనే ఆయన స్థానంలో మరొకరిని కూర్చోబెట్టవలసి ఉంటుంది. అది ప్రజలలో ఆయన పట్ల మరింత సానుభూతి పెంచి, ఆయన సమైక్యహీరో రేటింగ్స్ పెంచడమే కాక, ఆయన ఆరోపిస్తున్నట్లు రాజ్యాంగానికి, ప్రజల, ప్రజాప్రతినిధుల అభీష్టానికి వ్యతిరేఖంగా విభజన చేస్తునట్లు అంగీకరించినట్లవుతుంది. పైగా ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడే అనేకమంది నేతలని తట్టుకోవడం కూడా కష్టం. అందువల్ల ఏ దిగ్విజయ్ సింగో మరొకరిచేతనో ఈ లేఖలను ఖండిస్తూ ప్రకటనలు ఇప్పించి, ఆయనను డిల్లీకి పిలిపించుకొని కొంచెం హడావుడి చేస్తూ నవంబర్ ఐదువరకు అంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యేవరకు కాలక్షేపం చేసి, సమావేశాలు ముగిసిన తరువాత చూద్దామంటూ ఈ వ్యవహారాన్నిపక్కనపెట్టినా ఆశ్చర్యం లేదు. ఈలోగా అక్కడ విభజన ప్రక్రియ యదాతధంగా కొనసాగుతూ ఉంటుంది. తాజాగా లేఖాస్త్రాలను సందించిన కారణంగా ప్రజలలో అనుమానాలు తగ్గుతాయి. మరోవైపు మీడియాలో ఈ అంశంపై వేడివేడిగా చర్చలు కొనసాగుతుంటే ముఖ్యమంత్రి ఆయన అనుచరులు రచ్చబండ కార్యక్రమంలో తమ సమైక్యగానం వినిపిస్తూ మరికొన్ని రోజులు దొర్లించేయవచ్చు కూడా. ఆనక శాసనసభకు తెలంగాణా ముసాయిదానో మరొకటో రావడం, ముందే అనుకొన్నట్లు ముఖ్యమంత్రి, సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేయడం వగైరా తంతు కూడా యధాతధంగా పూర్తవుతుంది. దీనివల్ల అటు కాంగ్రెస్ అధిష్టానానికి, ఇటు ముఖ్యమంత్రికి ఎవరికీ కూడా నష్టం జరగకుండా “అంతా సవ్యంగా” సాగిపోతుంది.
http://www.teluguone.com/news/content/cm-37-26856.html