అర్ధవంతమయిన చర్చలకు ప్రతిపక్షం అడ్డుకట్ట
Publish Date:Jun 24, 2014
Advertisement
రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా సమావేశమయిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, చెప్పట్టవలసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి, కొత్త రాజధాని నిర్మాణం వంటి అంశాలపై లోతయిన చర్చ జరుగుతుందని ప్రజలందరూ భావించారు. కానీ భాద్యతాయుతమయిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడంతో చర్చలు పక్కదారి పట్టి అధికార, ప్రతిపక్షాల సభ్యులు ఒకరిపై మరొకరు నిందారోపణలతో విలువయిన సభాసమయం వృధా అయిపోతోంది. తెలుగుదేశం పార్టీ చేసిన ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిగా ఆలశ్యమయినా తప్పకుండా అమలు చేస్తారని ప్రజలు అభిప్రాయపడుతుంటే, బాధ్యతాయుతమయిన ప్రతిపక్షంగా సభలో వ్యవహరిస్తామని చెపుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ, డ్వాక్రా రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయకుండా కమిటీల పేరుతో తాత్సారం చేస్తూ రైతులను నిరాశ నిస్పృహలకు లోను చేస్తోందని ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రజలు కూడా తప్పుపడుతున్నారు. తెదేపా అధికారం చేప్పట్టి 15రోజులయినా కాక ముందే జగన్ ప్రభుత్వంపై ఈవిధంగా ఒత్తిడి చేయడం కేవలం రాజకీయమేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలెన్నుకొన్న తెదేపా ప్రభుత్వం భూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించడాన్ని కూడా తప్పు పడుతున్నారు. రాష్ట్రంలో విస్తారంగా వనరులున్నప్పటికీ తెదేపా ప్రభుత్వం వాటిని సమర్ధంగా వినియోగించుకోకుండా, రాష్ట్ర పరిస్థితి ఏమీ బాగోలేదని తెదేపా ప్రభుత్వం పదేపదే చెపుతూ ప్రజలను మరింత భయపెట్టడం సరికాదని జగన్ విమర్శించారు. దానిని చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా ఖండించారు. జగన్ ఆవిధంగా మాట్లాడుతూ కేంద్రానికి ఏవిధమయిన సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర పరిస్థితి గురించి తాము కేంద్రానికి వివరించి నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తుంటే, నిర్మాణాత్మకమయిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో తమకు సహకరించకపోగా, రాష్ట్రానికి వచ్చిన సమస్యేమీ లేదన్నట్లు మాట్లాడటాన్ని చంద్రబాబు కూడా తప్పుపట్టారు. తన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ తప్పకుండా అమలు చేస్తుందని, ఆర్ధిక సమస్యలను సమర్ధంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పధంలో నడిపిస్తానని ప్రజలకు సభా ముఖంగా భరోసా ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/chandrababu-37-35156.html