చంద్రబాబు పని మొదలెట్టేశారు!
Publish Date:May 18, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు. రాష్ట్రంలో పల్నాడు ప్రాంతం సహా కొన్ని ప్రాంతాలు ఎన్నికల అనంతరం కూడా హింసాకాండతో అట్టుడుకుతుంటే, తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఉంటే వాటి గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోర్టు అనుమతి తీసుకుని మరీ విదేశాలకు చెక్కేశారు. అలా చెక్కేసే ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తాను చేయకూడని పని కూడా చేశారు. అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందిగా సీఎస్ ను ఆదేశించేశారు. సీఎస్ పరమ వీర విధేయత ప్రదర్శించి ఆ పని చేయడానికి రెడీ అయిపోయారు. ఆ ఆదేశాల అమలు కోసం డీబీటీ నిధులను మళ్లించేయడానికీ సిద్ధమైపోయారు. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్ తన బాధ్యతను విస్మరించారు. కానీ విపక్ష నేత అయిన చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో నెలకొన్నఉద్రిక్త పరిస్థితులు, పల్నాడులో దాడులపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. చంద్రబాబు డిమాండ్ మేరకు ఈసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాలపాటు కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖతో అదే విధంగా ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు. ఇక అమిత్ షా చెప్పిన జోస్యం నిజమై చంద్రబాబు జూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన తాను చేస్తానన్న తొలి సంతకం, రెండో సంతకం విషయాలను పక్కన పెడితే.. గత ఐదేళ్ల పాలనలో అస్తవ్యవస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి మహాయజ్ణం లాంటిదే చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు రాష్ట్రం పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉంది. నాడు రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం జీరో నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఐదేళ్ల జగన్ పాలన తరువాత జీరోకన్నా దిగువ నుంచి అంటే మైనస్ నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ప్రభుత్వ ఖజానా ఖాళీ, రాష్ట్రానికి రాజధాని లేదు. ఇప్పుడూ అదే పరిస్థితి. అప్పట్లో ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెట్టారు. రెవెన్యూలోటుతో ఆరంభమైన విభజిత రాష్ట్రాన్ని తన విజనరీతో సర్ ప్లస్ స్టేట్ గా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్టేట్ గా మార్చారు చంద్రబాబు. అంతేనా ఐదేళ్లలో ఒక్క సారి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారు. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలు కావడంతో రాష్ట్ర ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ హయంలో అమరావతి నిర్వీర్యమైంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు రాష్ట్రం కరెంటు కొరతతో దాదాపు అంధకారబంధురంగా మారింది. ఎప్పుడు వస్తుందో తెలియని విద్యుత్ సరఫరా చేస్తూ జగన్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది. పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం కుదేలయ్యాయి. నిర్మాణ రంగం పడకేసింది. విద్యా వ్యవస్థ కుప్పకూలింది. అమిత్ షా జోస్యం నిజమై చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9న ప్రమాణస్వీకారం చేపడితే ఆయన ముందున్న సమస్యలివి. మళ్లీ తొలి అడుగు నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. జన సంక్షేమ శ్రామికుడిగా, సంపద సృష్టికర్తగా చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆశతోనే, ఆ నమ్మకంతోనే జనం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారని భావించాల్సి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/cbn-started-work-25-176330.html