సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. వైసీపీ కులం కార్డుకు చంద్రబాబు చెక్
Publish Date:Jun 19, 2026
Advertisement
విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం, అనుమానాస్పద లాకప్ డెత్ ఆరోపణల వ్యవహారంలో వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం కులం కార్డుతో చేసిన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన పరిపాలనా దక్షతతో, సత్వర నిర్ణయాలతో చెక్ పెట్టారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు. ఈ సున్నితమైన ఉదంతంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా బాధితుడి నివాసానికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, సిబిఐకు డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఈ వివాదానికి కుల రంగు అద్దే ప్రయత్నం చేస్తూ సామాజిక వర్గాల నేతలను కూడా రంగంలోకి దించారు. సాధారణంగా ఇలాంటి విషాద సమయాల్లో బాధితులకు మానవత్వంతో అండగా నిలవాలి. అయితే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా, రాజకీయ మైలేజీ కోసం కులం కార్డును తెరపైకి తీసుకువచ్చింది. అంబటిరాంబాబు, తోట త్రిమూర్తులు, కొరసాల కన్నబాబు వంటి వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలను సాయికృష్ణ విషయానికి కులం రంగు అద్ధి విమర్శలు గుప్పించారు. ఈ మొత్తం పరిణామాలు చోటుచేసుకునే సమయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్లో ఉన్నారు. అయినప్పటికీ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ, . ప్రతిపక్షాలు ఈ కేసును సాకుగా చూపి శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించారు. వెంటనే.. ఎక్కడా రాజకీయ లేదా విమర్శలకు పోకుండా.. కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు పరస్పరం సంప్రదించుకుని బాధిత కుటుంబంలో నమ్మకాన్ని నింపేలా కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా ముందుగా స్థానిక కూటమి శాసనసభ్యుడిని సాయికృష్ణ ఇంటికి పంపారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన తక్షణ స్పందన బాధిత కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు. సాయికృష్ణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, ఆయనపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఉన్నత స్థాయి అధికారిని నియమించారు. జగన్ పరామర్శ ముగించుకుని వెళ్లిన మరుసటి రోజే అంటే శుక్రవారం (జూన్ 19) దర్యాప్తు అధికారి దైవప్రసాద్ స్వయంగా బాధిత కుటుంబం వద్దకు వెళ్లి వివరాలను సేకరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సత్వర చర్యల పట్ల సాయికృష్ణ కుటుంబ సభ్యులు పూర్తి సంతృప్తివ్యక్తం చేశారు. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని పేర్కొన్నారు. దీంతో సాయికృష్ణ వ్యవహారంలో పొలిటికల్ మైలేజీ పొందాలన్న వైసీపీ ఆశలు ఆవిరయ్యాయి. ఈ వివాదాన్ని చక్కదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి శాంతిభద్రతల విభాగంపై, ముఖ్యంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, బాధితులకు తక్షణ న్యాయం అందాలన్న స్పష్టమైన సంకేతాలను పంపారు.
http://www.teluguone.com/news/content/cbn-foils-ycp-castecard-39-223561.html




