మూడూ, నాలుగూ లాభంలేదన్న పీకే సొంత పార్టీతో రెండు సాధిస్తారా?
Publish Date:May 2, 2022
Advertisement
దేశంలో అత్యంత సక్సెస్ ఫుల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తేశాడు. దేశంలో బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యమని ప్రకటించి ఆ దిశగా వివిధ ప్రయత్నాలు చేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు స్వయంగా తానే ఓ రాజకీయ పార్టీని స్థాపించేశారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి, ఏపీలో జగన్ కు, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించారు, అందిస్తున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ కు కూడా ఎన్నికల వ్యూహాలను రచించేందుకు ముందుకు వచ్చారు. ఒక దశలో ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం దాదాఫు ఖరారేనని కూడా అంతా భావించారు. చివరకు సోనియా ఆహ్వానించినా కూడా కాంగ్రెస్ లో చేరడానికి నిరాకరించారు. తొలుత ఆయన తన స్వంత రాష్ట్రం బీహార్ లో జేడీయూలో చేరారు. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ విజయం సాధించడం వెనుక పీకే వ్యూహాలు ఉన్నాయన్నది జగద్వితితం. అయితే ఆ తరువాత నితీష్ ఎన్డీయే పంచన చేరడంతో జేడీయూ నుంచి బయటకు వచ్చేసి, తనకు అచ్చొచ్చిన ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగారు. వచ్చే ఎన్నికలలో బీజేపీకి అధికారం అందకుండా చేయాలంటే దేశంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్న ప్రతిపాదనతో బీజేపీయేతర పార్టీలన్నిటితో మంతనాలు జరిపారు. మూడో ఫ్రంటూ, నాలుగో ఫ్రంట్ లతో లాభం లేదనీ, కాంగ్రెస్ సహా బీజేపీయేతర శక్తులన్నీ కలిస్తేనే జాతీయ స్థాయిలో కమల నాథులకు కాషాయం రుచి చూపించే అవకాశం ఉంటుందనీ, అందుకే రెండో ఫ్రంటే సరైనా మార్గమనీ వాదించిన పీకే చివరికి ఎవరూ కలిసి రాక సొంత కుంపటి వైపు మొగ్గు చూపారు. సొంత పార్టీతోనైనా బీజేపీయేతర శక్తులన్నిటినీ కూడగట్టి రెండు సాధిస్తారా? అలా సాధించేందుకు పీకేతో కలిసి వచ్చే పార్టీ లేమిటి? మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రేలు కలిసి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే బీహార్ నుంచి ఆర్జేడీ కూడా పీకే ప్రతిపాదించే రెండో ఫ్రంట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఒకింత అగమ్య గోచరంగానే ఉంది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా అధికార పార్టీలకు పీకేయే ఎన్నికల వ్యూహకర్త. మరి ఈ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకు పీకే కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు అంగీకరింప చేయగలుగుతారా? ఒక వేళ అది సాధ్యం కాకపోతే..వాటికి ఎన్నికల వ్యూహాలను అందించడం మానేస్తారా? ముఖ్యంగా తెలంగాణలో ఆయన కార్యాచరణ ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. బీజేపీ బీ టీమ్ గా ముద్ర పడ్డ తెరాస పీకే వ్యూహాల కోసం కాంగ్రెస్ తో చేతులు కలుపుతుందా? ఆ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మొత్తం మీద పీకే రాజకీయ పార్టీ దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో చూడాల్సి ఉంది. ఇంత కాలం వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన పీకే.. సొంత పార్టీ కోసం ఎటువంటి వ్యూహాలు రచించుకుంటారో చూడాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/can-pk-own-party-unite-non-bjp-parties-25-135335.html