ఈటలకు ఝలక్.. బీజీపీ తెలంగాణ పగ్గాలు బండికేనా?
Publish Date:Sep 6, 2024
Advertisement
తెలంగాణలో బీజేపీలో కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కృత నిశ్చయానికి ఆ పార్టీ హైకమాండ్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యం అంటూ బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న కొన్ని చర్యలు, నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. దీంతో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేక చతికిల పడింది. అధికారం సంగతి అటుంచి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు కూడా సంపాదించలేకపోయింది. ఎప్పటిలాగే సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అవి కొంత మేర ఫలించి కాంగ్రెస్ తో సమానంగా రాష్ట్రంలో లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోవడం వల్లనే బీజేపీ ఆ మాత్రం లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగిందని కమలనాథులకు అర్ధమైంది. ఇప్పుడు ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఉద్వాసన పలికిన బండి సంజయ్ కే మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిందని రాష్ట్ర బీజేపీ శ్రేణులలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.వాస్తవానికి గత కొన్ని రోజులుగా పార్టీ రాష్ట్ర పగ్గాలు మల్కజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు కట్టబెట్టనున్నారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఈటలకు పార్టీ రాష్ట్రపగ్గాలు అప్పగించే విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు తీవ్ర వ్యతిరేకత కనబరిచారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే విషయంలో బీజేపీ వెనకడుగు వేసింది. కిషన్ రెడ్డినే కొనసాగించింది. అయితే కిషన్ రెడ్డి ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని సార్వత్రిక ఎన్నికల తరువాత నుంచీ పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్న విషయంలోనే తేల్చుకోలేకపోతోంది. పార్టీ అధ్యక్ష పగ్గాలు ఈటలకు అప్పగి స్తారన్నది దాదాపుగా ఖరారైందని కూడా అంతా భావించారు. అయితే అనూహ్యంగా బండి సంజయ్ రేసులోకి రావడం, ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో బీజేపీ హైకమాండ్ వెనక్కు తగ్గింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు బండి చేతుల్లో ఉన్న కాలంలో బీజేపీకి రాష్ట్రంలో మంచి మైలేజీ ఉందని, ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తరువాతనే పార్టీలో కుమ్ములాటలు, గ్రూపులు ఎక్కువయ్యాయన్న భావనలో పార్టీ హైకమాండ్ ఉంది. దీంతో ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబట్టడాన్ని బండి వ్యతిరేకించడంతో పార్టీ అధిష్ఠానం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. అసలు వాళ్లూ వీళ్లూ అని వెతకడం ఎందుకు బండినే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే పోలా అన్న అభిప్రాయం ఇప్పుడు హైకమాండ్ లో వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఖమ్మంను అతలాకుతలం చేసిన భారీ వరదల సమయంలో కేంద్ర మంత్రి హోదాలో ఆయన వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం, ఆయనకు పోటీగా ఈటల మరో బృందంతో పర్యటనకు రెడీ కావడం ఇద్దరి మధ్యా విభేదాలను ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూర్చింది. హై కమాండ్ అనుమతి లేకుండా బండి వరద ప్రాంతాలలో పర్యటించే అవకాశం ఉండదని అంటున్నారు. పార్టీ హైకమాండ్ బండినే ప్రోత్సహిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని చెబున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-telangana-president-bandi-39-184392.html