టీఆర్ఎస్ పై కమలం రణం! మాటల యుద్ధంతో పెరిగిపోయిన పొలిటికల్ హీట్
Publish Date:Sep 3, 2022
Advertisement
తెలంగాణ ఇప్పుడు జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తోంది. తెలంగాణ గడ్డపై పాగాకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న కొద్దీ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి, వార్ ఆఫ్ వార్డ్స్ తీవ్రతరమైంది. బీజేపీ నిర్దిష్ట లక్ష్యంతో చతురంగ బలాలను యుద్ధ భూమిలో దింపినట్లుగా తెలంగాణ గడ్డపైకివ పార్టీ అగ్రనేతలను దింపుతోంది. యుద్ధంలో సరిహద్దుల్లో సైనిక బలగాలు మోహరిస్తాయి. కానీ తెలంగాణలో బీజేపీ, తెరాస మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో సరిహద్దులు అనేవే లేవు. రాష్ట్రం అంతటా బీజేపీ, తెరాస శ్రేణులు ముఖాముఖీ మోహరించాయా అన్నట్టు వాతావరణం మారిపోయింది. ఒకరి తరువాత ఒకరుగా బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించి, పార్టీ శ్రేణులకు రాజకీయ పోరాటంలో పైచేయి సాధించేలా దిశానిర్దేశం చేసి, ఉత్సాహపరిచి వెళుతున్నారు. ఈ క్రమంలో వారు కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కిసాన్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదు. పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేసీఆర్ ఇచ్చారా..? నిరుద్యోగులు రూ.3వేలు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారు నిజమా కాదా, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు చేశారా?. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా..? హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించేందుకు దళితబంధు పేరుతో రూ.10లక్షలు ఇస్తామన్నారు.. ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు..? ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమంటూ వాగ్ధానం చేశారు.. ఇచ్చారా..? గిరిజనులకు భూములు ఇస్తామన్నారు.. ఇచ్చారా?. యువకులకు ఉపాధి అవకాశాల సంగతి ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించి వెళితే.. ఆ తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారు. జల్జీవన్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,500 కోట్లు కేంద్రం కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ఆసుపత్రి నిర్మాణమంటూ వరంగల్ జైలును కూల్చారు. కాకినాడ తీర్మానం ద్వారా అందరికంటే ముందు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది బీజేపీనే. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారంటూ విమర్శలు గుప్పించి వెళ్లారు. ఆ తరువాత రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను కేసీఆర్ ఇష్టారీతిగా పెంచేశారని విమర్శించారు. రెవెన్యూ మిగులుతో ఆవిర్భవించిన తెలంగాణను అప్పుల కుప్పలా మార్చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో అప్పుడే పుట్టిన శిశువు తలపై కూడా కూడా 1.25లక్షల రూపాయలు అప్పు ఉందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం 20 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. మన వూరు - మన బడి కేంద్ర పథకం అయితే దానిని రాష్ట్ర స్కీమ్గా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రతి 100 మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారని, ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో వుందని గణాంకాలతో సహా చెప్పి కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఇలా వరుసగా పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులూ తరచుగా రాష్ట్ర పర్యటనకు వస్తూ కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. ఇంత కాలం కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తే బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆ తరువాత అగ్ర నేతలు ప్రతి విమర్శలు చేసే వారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నేతలు, అగ్ర నేతలు ఒక వైపు విమర్శలు గుప్పిస్తుంటే.. మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు టీఆర్ఎస్ కీలక నేతలపై నిఘా కన్ను వేశాయి. ఒక విధంగా తెలంగాణపై పట్టు బిగించి, రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఓ వైపు పార్టీ నేతలను రంగంలోకి దింపింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తనిఖీలు చేపడుతున్నాయి. సిఎం కెసిఆర్ లక్ష్యంగా ఒక దాని వెంట ఒకటిగా అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా కేంద్ర మంత్రులను ఒక్కొక్కరిగా రాంగంలోకి దింపింది. పార్టీ నాయకులు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒకరి తరువాత ఒకరుగా రాష్ట్ర పర్యటనలకు వస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఐటి సోదాలు, లిక్కర్ లింకులు, ఇడిల దాడులతో... టిఆర్ఎస్ నాయకత్వంపై ముప్పేట దాడి చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది బిజెపి. ఇక ఈ నెల 17న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ విమోచన దినం ఈ నెల 17న ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నది. వరుసగా పార్టీ సభలు, సమావేశాలు, కార్యక్రమాలను బిజెపి నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకునేందుకు యత్నిస్తోంది. కేంద్ర పథకాలు తెలుపుతూనే, రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ.. నిరంతరం వార్తల్లో ఉండేలా కమలనాధులు వ్యవహరిస్తున్నారు. నిర్మలా సీతారామన్... కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు నేరుగా ప్రజలకు తెలిసేట్టుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. పేదలను ఆకట్టుకునేలా రేషన్ షాపులను సందర్శిస్తూ బియ్యం మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వాటాను, రాష్ట్ర ప్రభుత్వ వాటాను సూటిగా వివరించారు. ఇక కేంద్ర మంత్రి అమిత్ షా అయితే తెలంగాణలో ఆయన క్యాంపు కార్యాలయం తెరిచారా అన్నట్లుగా తరచూ రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హస్తినను వదిలేశారా అనిపించేలా ఇక్కడే మకాం వేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ మహానగరంలోనే నిర్వహించిన బిజెపి ఇప్పుడు తెలంగాణలో వరుసగా పార్టీ సభలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఆగష్టులోనే రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించింది బిజెపి. రాజగోపాల్ రెడ్డి చేరిక సందర్భంగా మునుగోడులో భారీ బహిరంగ సభను, బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మూడోదశ ముగింపు సందర్భంగా హన్మకొండలో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతనొత్సాహాన్ని నింపింది. ఇప్పుడు తెలంగాణ భారతదేశంలోకి చేరిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు షురూ చేసింది .
మేడ్చెల్- మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నిజామాబాద్- కామారెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కేంద్ర మంత్రులు, నాయకులు రంగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెల్లడిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలోని అధికార పార్టీపై విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. ప్రహ్లాద్ జోషి.. నేరుగా లాయర్లు, కుల సంఘాలు, బిల్డర్లను కలిసి వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దేవ్ సింగ్ చౌహాన్.. పార్టీలోని నాయకులు, పార్టీ క్రింది స్థాయి కార్యకర్తల నుంచి పైస్థాని నాయకుల వరకు అభిప్రాయభేధాలు ఉన్నాయా అన్నిది గమనించి, వాటిని సరిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్టు ఎవరికి వచ్చినా.. అందరూ కలిసికట్టుగానే పనిచేసేలా, పార్టీ విజయంలో భాగస్వాములను చేసేలా సూచనలు చేస్తున్నారన్నది సమాచారం.
http://www.teluguone.com/news/content/bjp-declare-war-on-trs-aiming-power-in-telangana-25-143193.html





