పేదల ఇళ్లకే బుల్డోజర్లా?..ఒవైసీ కాలేజీపై మౌనం ఎందుకు? : బండి సంజయ్
Publish Date:Jul 10, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ హైడ్రా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయం అనే విధానం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఒవైసీకి చెందిన కాలేజీపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కాలేజీ చెరువు భూమిలో లేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిజంగా ఎలాంటి ఆక్రమణలు లేకపోతే ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని, ఒకవేళ ఆక్రమణలు జరిగి ఉంటే చట్టప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. "చట్టం అనేది వ్యక్తులను బట్టి మారకూడదు. పేదవాడైనా, పెద్దవాడైనా, అధికార పార్టీ నేతైనా, ప్రతిపక్ష నాయకు డైనా ఒకే నిబంధనలు వర్తించాలి. అదే రాజ్యాంగ స్ఫూర్తి" అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడి పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఆక్రమణలు జరిగినా రాజకీయాలు, మతం, వ్యక్తులను పక్కనపెట్టి సమానంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రా చర్యలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి దుమారం రేపుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్ల పైనే బుల్డోజర్లు నడుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంటే, ప్రభావశీలులకు చెందిన నిర్మాణాల విషయం లో మాత్రం ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించారు.
http://www.teluguone.com/news/content/bandi-sanjay-kumar-36-225664.html





