బాబు దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం ఐఎస్ బీ- ద్విదశాబ్ది వేడుకలకు దూరం పెట్టడం దారుణం
Publish Date:May 26, 2022
Advertisement
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ సర్వం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసియాలో ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న యోచనతో ప్రపంచంలోని 500 పరిశ్రమలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చారని తెలిసిన క్షణం నుంచీ దానికి ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలని చంద్రబాబు పడిన తపన, పడిన శ్రమ, చూపిన పట్టుదల, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ తరాల ఉన్నతిని కాంక్షించి చూపిన చొరవ చరిత్ర ఎన్నటికీ విస్మరించదు. కానీ చరిత్ర క్షమించని విధంగా ప్రస్తుత పాలకులు, వారికి తొత్తులుగా మారిన విద్యావంతులు ఆయనను విస్మరించి ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇది దుర్మార్గం. అసలు ఐఎస్ బీ హైదరాబాద్ లో ఏర్పాటు కావడానికి చంద్రబాబు చేసిన కృషి చూపిన చొరవలను ఒక సారి సింహావలోకనం చేసుకుంటే.. అప్పటికే ఐటీ హడ్ గా అమెరికా తరువాత అంతటి గుర్తింపు పొందిన బెంగళూరు (కర్నాటక)ను, భారత వాణిజ్య రాజధాని ముంబై అప్పటి బొంబై ( మహారాష్ట్ర)లను కాదని ఐఎస్ బీని హైదరాబాద్ ( అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని)కు తీసుకువచ్చిన చంద్రబాబు సమర్థత కళ్లకు కడుతుంది. దేశానికే తలమానికంగా, గర్వకారణంగా నిలిచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్ బి) ఆవిర్భవించి నేటికి సరిగ్గా 20 ఏళ్లు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎస్ బి హైదరాబాద్ లో ఏర్పాటు కావడం తెలుగువారందరికీ గర్వకారణం. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొంది నేడు 20వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకొంటోంది. ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కానీ ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు హైదరాబాద్ కు రావడానికి కారణమైన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, దార్శనికుడు నారా చంద్రబాబునాయుడిని విస్మరించడం మాత్రం శోచనీయం. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చిన, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని ఆయన తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే.. చంద్రబాబుకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ రాజకీయ ప్రయోజనాలే తప్ప దేశం, రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచనే లేని కుత్సిత రాజకీయులు ఆయన ప్రాధాన్యతను తగ్గించామనుకుంటూ సంబరపడుతుంటారు. అందుకు ఉదాహరణగా హైదరాబాద్ లో గురువారం జరుగుతున్న ఐఎస్ బీ ద్విదశాబ్ది వేడుకకు ఆయనను దూరం పెట్టడమే. ఆసియాలో ఒక బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని 500 కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన తరుణంలో అనాడు అంటే 1988లో ఇండియన్ బిజినెస్ స్కూల్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటే తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటూ అప్పటికే ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన కర్నాటక సహా పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తొలుత బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం పరిశీలించినది కూడా బెంగళూరునే.. ఏపీలో ఐఎస్ బీ అనే ఉద్దేశమే లేదన బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన నగరం కోసం అన్వేషించేందుకు వచ్చిన ప్రతినిథి బృందానికి. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో ఐటీని వినియోగించుకుంటున్న తీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపానల అందిస్తున్నతీరుపై దేశంలోనే కాదు, ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు గుర్తించారు. అయినా కూడా అప్పటికి ఐఎస్ బీ ప్రమోటర్లు బిజినెస్ స్కూల్ ను బెంగళూరులో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అప్పటికే హైదరాబాద్ బెంగళూరుకు పోటీగా ఐటీ హబ్ గా ఎదుగుతున్న దశ. దక్షిణాదిన ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రమోటర్లు ముందుకు వస్తున్నారన్న సంగతి తెలిసిన వెంటనే చంద్రబాబు స్వయంగా వారిని సంప్రదించారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రమోటర్లతో సంప్రదింపులకు ఆయన వెనుకాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా కంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానే ఎక్కువ కష్టపడ్డారు. అన్ని రంగాలలో ఏపీని అగ్రస్థానంలో ఉంచేందుకు ఆయన రోజుకు 18 గంటలు శ్రమించారు. ఆ చొరవతోనే ఆయన ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రమోటర్లతో స్వయంగా మాట్లాడారు. హైదరాబాద్ ఆలోచనే లేదు..మా తొలి ప్రాధాన్యత బెంగళూరే అంటూ వారు కుండబద్దలు కొట్టినా నిరాశ చెందకుండా వారిని హైదరాబాద్ కు ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారిని ఆయన తేనేటి విందుకు ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్లు అప్పటి వరకూ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. కానీ ఏపీ నుంచి సంప్రదింపుల ప్రతిపాదన ముఖ్యమంత్రి నుంచే రావడం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకూ వారితో సంప్రదింపులకు వచ్చింది అధికారులే. అందుకు భిన్నంగా సీఎం స్వయంగా ఆహ్వానించడంతో వారు కాదనలేక వచ్చారు. అలా రావడానికి వారు హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటుకు గ్యారంటీ గా దీనిని భావించవద్దని షరతు పెట్టారు. అందుకు సరేనన్న బాబు వారు వచ్చినప్పుడు ప్రొటోకాల్ ను సైతం కాదని ఎదురేగి వారిని ఆహ్వానించారు. స్వయంగా వారికి బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. తన నివాసంలోనే ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రం ప్రగతి దారిలో దూసుకుపోతున్న తీరును కళ్లకు కట్టారు. ఐటీని స్మార్ట్ గవర్నెన్స్ కోసం వినియోగించుకుంటున్న తీరునూ సవివరంగా వారికి ఎరుకపరిచారు. చంద్రబాబు వ్యవహార శైలి, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, ఆయన దార్శనికత ఆ బృందాన్ని మెస్మరైజ్ చేశాయి. చంద్రబాబు నివాసంలో తేనీటి విందు తరువాత కొన్ని రోజులకే హైదరాబాద్ లోనే బిజినస్ స్కూల్ ఏర్పాటు కార్యరూపం దాల్చింది. బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకోవడానికి కారణం ఐఎస్ బి బృందం మీడియా సమావేశంలో వివరిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రోచ్, విజన్, అద్భుతం అని ప్రశంసించారు. ఐఎస్బికి హైదరాబాద్ గచ్చిబౌలిలో 260 ఎకరాల స్థలాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. స్టాంపుడ్యూటీ మినహాయింపుతోపాటు కొన్ని రాయితీలు కల్పించింది. దీనిపై నాడు ఏపీలో విపక్షం అయిన కాంగ్రెస్ పలు విమర్శలు చేసింది. ముఖ్యమంత్రిపై ఆరోపణలు గుప్పించింది. కొందరు నాయకులైతే కేసులు పెట్టారు. కానీ న్యాయస్థానం సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఐఎస్ బికి రాయతీలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని విస్పష్టంగా చెప్పింది. రాష్ట్రంలో ఐఎస్ బి ఏర్పాటుకు రాయతీల కల్పనపై ఇక్కడ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలూ గుప్పిస్తే కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు తమ రాష్ట్రానికి ఐఎస్ బీని సాధించలేకపోయినందుకు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఐఎస్ బీని సాధించడం ద్వారా ఏపీకి గొప్ప మేలు చేకూరిందంటూ జాతీయ పత్రికలు సంపాదకీయాలు రాశాయి. ఆయన దార్శనికత దేశానికి అవసరమంటూ ప్రశంసలతో ముంచెత్తాయి. 1999లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఐఎస్బి హైదరాబాద్ క్యాంపస్కు పునాదిరాయి పడింది. 2001లో నాటి ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా, సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎస్బి హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. గురువారం అంటే మే 26.2020న ఐఎస్ బీ హైదరాబాద్ ద్వి దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరౌతున్నారు. రాజకీయాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ వేడకగా దీనిని చూడాల్సి ఉంది. ఐఎస్ బీ హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటుకు కారణమైన అప్పటి సీఎం చంద్రబాబును ఈ వేడుకకు దూరంగా పెట్టడానికి కారణం కుత్సిత రాజకీయం కాదా? దార్శనికత, చొరవ, ఏపీ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో.. సీఎంగా తన హోదాను కూడా పట్టించుకోకుండా ఒక మెట్టు దిగి మరీ రాష్ట్రానికి ఐఎస్ బీ సాధించుకు వచ్చిన చంద్రబాబుకు ద్విశాబ్ది వేడుకలకు ఆహ్వానం కూడా పంపక పోవడం శోచనీయం, దారుణం. అయినా ఐఎస్ బీ డీన్, ఇతర ఉన్నత స్థాయి విద్యావేత్తలు ఈ విషయంలో ఏం చేస్తున్నారు. నేడు ఇంతటి ఘనతకు కారణమైన చంద్రబాబును ఎలా విస్మరించగలిగారు. దేశంలో విద్యావేత్తలు కూడా గల్లీ స్థాయి రాజకీయ నాయకులుగా దిగజారిన దౌర్భాగ్య పరిస్థితికి ఇది నిదర్శనం కాదా? హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటుకు కారణమైన వ్యక్తిని, సంస్థ ఏర్పాటుకు ఇనీషియల్ గా అవిసరమైన నిధులు, స్థలం, మౌలిక సదుపాయాలు సహా అన్ని విధాలుగా మద్దతుగా నిలిచిన నాయకుడిని సమకూర్చిన నాయకుడిని మరచిపోవడం, కనీసం ఆహ్మానం కూడా పంపకుండా విస్మరించడం దుర్మార్గం కాక మరేమిటి?
http://www.teluguone.com/news/content/babu-ignored-isb-20-years-celebrations-25-136454.html





