అగ్రరాజ్యాధినేత ట్రంప్ పై హత్యాయత్నం.. నిందితుడి కాల్చివేత
Publish Date:Apr 25, 2026
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వద్ద శనివారం (ఏప్రిల్ 25) రాత్రి ఈ ఘటన జరిగింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరుగుతున్న ఈ విందు వేదిక సమీపంలో తుపాకీ శబ్దాలు వినిపించడం ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వేడుకకు హాజరైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్లను అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు హుటాహుటిన అక్కడ నుంచి తరలించి రక్షణ కల్పించారు. విందు జరుగుతున్న హోటల్లోని సెక్యూరిటీ స్క్రీనిం ఏరియా వద్ద ఒక వ్యక్తి తుపాకీతో లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాల్పులు జరగడంతో విందులో ఉన్న వందలాది మంది సెలబ్రిటీలు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో నిందితుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కు తూటా తగిలింది.. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ధ్రువీకరించారు. ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పలువురు క్యాబినెట్ మంత్రులు కూడా ఈ వేడుకలో ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ ఘటనపై ట్రంప్ తన సోషల్ మీడియావేదిక ట్రూత్ సోషల్ లో స్పందిస్తూ.. సీక్రెట్ సర్వీస్, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రశంసించారు. వారు చాలా , ధైర్యంగా, వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రస్తుతానికి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 30 రోజుల్లోగా ఈ విందును తిరిగి నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ ఘటనతో వాషింగ్టన్ నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
http://www.teluguone.com/news/content/attempted-assassination-onus-president-36-218292.html





