ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటర్వ్యూ
Publish Date:Dec 9, 2013
Advertisement
డిల్లీలో కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించిన ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీ వాల్ మొన్న మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చాలా ఆసక్తికరమయిన విషయాల గురించి మాట్లాడారు. “నిజానికి ఇది మా పార్టీ విజయం కాదు. ఇది పూర్తిగా డిల్లీ ప్రజల విజయమే. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అవినీతికి, అసమర్ధతకు బలయిపోతూ మౌనంగా ఆక్రోశిస్తున్నసామాన్య ప్రజల ఆవేదన, ఆగ్రహంగా మారి అది ఆమాద్మీపార్టీగా రూపం సంతరించుకొంది. ఆమాద్మీయేకదా(సామాన్యుడే కదా) అని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో వారు నిరూపించారు. మాకు ఆర్.యస్.యస్. అండ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాదు కాదు కార్పోరేట్ సంస్థలు అండగా నిలబడ్డాయని బీజేపీ ఆరోపిస్తుంది. కానీ మావెనుక కేవలం సామాన్య ప్రజలే ఎక్కువమంది ఉన్నారు. ఇది వారందరి స్వంత పార్టీ అనే భావన కలిగించడంలో మేము సఫలమయ్యాము గనుకనే ఈ విజయం సాధ్యమయింది." "మా పార్టీ ఏకైక ఎజెండా రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల నుండి అవినీతిని పారద్రోలడమేనని చెప్పినప్పుడు, మీడియాతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా నవ్వాయి. మా ఎజెండాని వారు అర్ధం చేసుకోలేకపోయినా, నిత్యం ఏదో ఒక రూపాన్నఎదురయ్యే అవినీతికి బాధితులయిన సామాన్య ప్రజలు మాత్రం మా అజెండాను బాగా అర్ధం చేసుకొన్నారు. అందుకే వారు దిగ్గజాల వంటి రాజకీయ నేతలను ఓడించి, తమలోంచి ఉద్భవించిన ఆమాద్మీని గెలిపించుకొన్నారు. ఆ గెలుపు కూడా చాల భారీ మెజార్టీతో ఉండటం గమనిస్తే, ప్రభుత్వం తమ పట్ల కనబరుస్తున్ననిర్లక్ష్యానికి వారిలో ఎంత ఆగ్రహం గూడుకట్టుకొని ఉందో, వారు ప్రస్తుత వ్యవస్తలపై ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్ధమవుతుంది." "అయితే ఈ విజయం అంత సునాయాసంగా వచ్చినది కాదని అందరికీ తెలుసు. ఈ దశకు చేరుకొనే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ మాకు అనేక అగ్ని పరీక్షలు పెట్టాయి. మాపై ఆదాయపన్నుశాఖా దాడులు, సీబీఐ విచారణలు, స్టింగ్ ఆపరేషన్లు, మా పార్టీకొచ్చే విదేశీ విరాళాల గురించి అసత్య ప్రచారాలు, వాటిపై మరే ఇతర పార్టీలకి లేని విచారణలు, మా అనుచరులపై దాడులు, హత్యా ప్రయత్నాలు వంటి చాలా అసాధారణ పరీక్షలే ఎదుర్కొన్నాము. కానీ, సామాన్య ప్రజలు మాత్రం మాపై ఎన్నడూ నమ్మకం కోల్పోలేదు. కారణం, ఇది వారి స్వంత పార్టీయేనని భావన వారిలో బలంగా ఉండటం వలననే. అయితే ఈ పరీక్షల వలన మేము కొంత నష్టపోయామని అంగీకరించవలసి ఉంటుంది. ఈ సమస్యలే లేకుంటే మాకు పూర్తి మెజార్టీ వచ్చి ఉండేదని ఖచ్చితంగా చెప్పగలము." "రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలలో అవినీతిని రూపుమాపాలని అన్నాహజారేతో నేతృత్వంలో మేమందరమూ చాలానే కృషి చేసాము. దానికి వస్తున్న ప్రజాస్పందన చూసి కంగారు పడిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కొన్ని రోజులు హడావుడి చేసారు. కానీ ఉద్యమ వేడి చల్లారగానే వారు కూడా మాట తప్పి ప్రజలను వంచించారు. రెండేళ్ళ తరువాత కూడా నేటికీ జనలోక్ పాల్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందలేదు. ఇందులో సాక్షాత్ ప్రధాని మన్మోహన్ సింగుతో సహా ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ భాగాస్వాములవడం చాలా విచారకరం. తామెన్నుకొన్న ప్రభుత్వమే తమను వంచించిందన్న విషయం ప్రజలు మరిచిపోలేదు. కానీ ప్రభుత్వం మరిచిపోయింది. తత్ఫలితమే కాంగ్రెస్ ఓటమికి దారి తీసిందని చెప్పవచ్చును." "ఈరాజకీయ కల్మషాన్ని కడిగేందుకు మనం ఆ రొంపిలో దిగకూడదని మా గురువు గారు అన్నాహజారే అభిప్రాయ పడ్డారు. కేవలం ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాలను పనిచేసేలా చేయాలని ఆయన భావించారు. కానీ మన ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థలు అటువంటి ఉద్యమాలకు బెదరవని, లొంగేవికావని రుజువయిన తరువాతనే మేము ఈ రాజకీయ రొంపిలో దిగి ప్రక్షాళన చేయాలనుకోన్నాము. బురదలో దిగుతున్నప్పుడు, ఆ బురద మాకు కొంత అంటుకోక తప్పదని కూడా తెలుసు. అయితే అందుకు భయపడి ఎవరూ ఈ ప్రక్షాళన కార్యక్రమానికి పూనుకోకపోతే ఏదో ఒకరోజు మనమందరం ఆ బురదలోనే కూరుకుపోయే ప్రమాదం ఉందని భావించి అందుకు పూనుకొన్నాము. అయితే ఈ విషయంలో అన్నాహజారే గారు మాతో ఏకీభవించలేదు. కానీ ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు కూడా ఉంటాయని ఆశిస్తున్నాము." "ఈ భ్రష్ట రాజకీయాలను తుడిచిపెట్టే ప్రయత్నంలో ఆమాద్మీ పార్టీ పుట్టింది. ఇంతవరకు ఏ పార్టీల అవినీతిని ఎదుర్కోవాలని పోరాడామో, ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం మళ్ళీ అవే పార్టీలతో జత కడితే మాకు ఆ పార్టీలకు మధ్య ఇక ఎటువంటి తేడా ఉండబోదు. మా పోరాటానికి, ఉద్యమానికి కూడా అర్ధం ఉండదు. గనుక, మేము కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఈయము. వాటి నుండి మద్దతు స్వీకరించము కూడా. ప్రతిపక్ష బెంచీలలో కూర్చోనయినా కూర్చొంటాముగానీ ఆ రెండు పార్టీలతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలపబోము. ప్రజలు మాకు పూర్తి మెజార్టీ కట్టబెట్టి అధికారం అప్పజేప్పిననాడే మేము ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆలోచిస్తాము. అవసరమయితే మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా మేము సిద్దమే. ఈ పదేళ్ళ కాంగ్రెస్ హయంలో కొన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. రూ.50-100 కోట్లు ఖర్చుచేసి మళ్ళీ ఎన్నికలు పెట్టుకొని ఒక మంచి ప్రభుత్వాన్నిఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదని మేము భావిస్తున్నాము. శాశ్వితమయిన అవినీతిని భరించడం కంటే ఇదే మేలు కదా!" "సామాన్య ప్రజలు తలచుకొంటే ఏమవుతుందో డిల్లీ ప్రజలు నిరూపించి చూపారు. మరి దేశంలో మిగిలిన రాష్ట్రాలలో ప్రజలు కూడా దీనిని స్పూర్తిగా తీసుకొని పోరాడేందుకు ముందుకు వస్తే, ఇదేవిధమయిన ఫలితాలు వస్తాయి. ప్రజలలో చైతన్యం ఏర్పడిననాడు ఈ ఉద్యమం దశ దిశలా వ్యాపించగలదు," అని కేజ్రీవాల్ అన్నారు.
http://www.teluguone.com/news/content/aravind-kejriwal-interview-37-28230.html