రెండేళ్లల్లోనే రెట్టింపు.. ఏపీ సాఫ్ట్ వేర్ ఎగుమతులు.!
Publish Date:Aug 13, 2026
Advertisement
వైఎస్ జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనవాలు కూడా లేని పరిస్థితి ఉండేది. జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి. జగన్ సర్కార్ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రంలోకి పెట్టుబడులు, పరిశ్రమల సంగతి అటుంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయిన పరిస్థితి. ఇక కొత్తగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి మాట్లాడకుండా ఉండడమే ఉత్తమమన్నట్లుగా అప్పట్లో పరిస్థితులు ఉండేవి. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు నాయుడు హయాంలో ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురానికి వచ్చింది. చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి, విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జగన్ రెడ్డి పాలనలో సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే కాకుండా జగన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏపీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని కుండబద్దలు కొట్టేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన అమర రాజా కంపెనీ జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించేసింది. ఇలా చెప్పాలంటే జాబితా చాలా చాలా పెద్దగానే ఉంటుంది. మొత్తం మీద ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు రావు ..ఉన్న పెట్టుబడులు నిలవవు అన్నట్లుగా ఆయన హయాంలో పరిస్థితి మారిపోయింది. అటువంటి పరిస్థితి 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత పూర్తిగా మారిపోయింది. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలూ క్యూడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక ఐటీ రంగం విషయానికి వస్తే.. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరి ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి.. అయితే 2019లో రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అవన్నీ ఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది. జగన్ నిర్వాకం వలన అప్పట్లో ఐటి ఎగుమతులలో దేశంలో అట్టడుగు స్థాయికి ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువల ఐటి ఎగుమతులు జరిగితే వాటిలో ఆంధ్రప్రదేశ్ వంతు కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే! అలాంటిది 2024లో రాష్ట్రంలో చంద్రబాబునాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది! జగన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం మందగమనంతో సాగిన సాఫ్ట్వేర్ ఎగుమతులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండంటే రెండేళ్లలో రెండు రెట్లకు పైగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా రూపుదిద్దుకున్న పారిశ్రామిక విధానాలు, ఐటీ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలలో పెరిగిన మౌలిక సదుపాయాలు ఈ విప్లవాత్మక వృద్ధికి కారణాలు. గతంలో నామమాత్రపు స్థాయిలోనే పరిమితమైన ఎగుమతులు, ఇప్పుడు వేల కోట్ల రూపాయల రాబడిని తెచ్చిపెడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహకాలు, పెట్టుబడుల ఆకర్షణ విధానం, ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోత్సహించే ఎకోసిస్టమ్ కారణంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ను తమ డెస్టినేషన్గా భావిస్తున్నారు. ఐటీ దిగ్గజాలు తమ ద్వితీయ, తృతీయ స్థాయి కార్యాలయాలను ఏపీ ప్రధాన నగరాల్లో నెలకొల్పడానికి ఉత్సాహం చూపుతున్నారు.ఇదే రీతిలో సాఫ్ట్వేర్ ఎగుమతులు వృద్ధి కొనసాగితే.. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి ఐటీ హబ్ల జాబితాలో నిలవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. AP Software exports growth, Andhra Pradesh IT exports, Vizag IT hub, , Andhra Pradesh tech sector, TeluguOne
http://www.teluguone.com/news/content/ap-software-exports-growth-25-228860.html





