పోలవరంపై జగన్ మాటలు నీటి మూటలేనా? ఏం చెప్పారు, ఏం జరిగింది?
Publish Date:May 9, 2024
Advertisement
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతిపై, పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ మాయమాటలు వల్లించారు. అప్పటి నుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనుల్ని శరవేగంతో పరుగెత్తించారు. ప్రతి సోమవారం.. పోలవారం అన్నట్టుగా ఆ ప్రాజెక్టు పనులు గురించి సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. అంత శ్రద్ధగా అధికారులను వెంటపడుతూ పనులు చేయించడం వల్ల ఆ ప్రాజెక్టు 75 శాతం వరకు పూర్తయింది. పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో, ఎన్నికల ప్రచార సభలో కేంద్రమంత్రి గడ్కరీ బయటపెట్టారు. ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రి గడ్కరీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటిదాకా 60 వేల కోట్లు విడుదల చేసినా జగన్ సర్కారు పూర్తిచేయకపోవడం చేతగానితనం అని విమర్శించారు. జగన్ నిర్లక్ష్యం వల్ల ఏటా అనవసరంగా 1300 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని గడ్కరీ చెప్పారు. పోలవరం పూర్తి చేయడంలో జగన్ పూర్తిగా ఫెయిలైయ్యారని, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు.. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని.. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ తోపాటు.. ఛత్తీస్ఘఢ్, ఒడిశా, తెలంగాణలో కూడా విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తారు. ఇది పూర్తయ్యాక.. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాకుండా.. విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు, దాని చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరుస్తుంది. విద్యుదుత్పత్తి, జలరవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి.. చేపల పెంపకానికీ ఉపయోగపడుతుంది. వాస్తవానికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం.. కేంద్రమే అందించాలి. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో చిక్కుకున్న తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందిస్తే ఊళ్లు ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. పునరావాస కాలనీలు పూర్తి చేయాలని అడుగుతున్నారు. దానికి కేంద్రమే నిధులు ఇవ్వాలి. సీఎం జగన్ 2022 లో చింతూరులో చెప్పిన విధంగా జరిగితే ప్లస్ 41 కాంటూరు పరిధిలో అందరికీ పరిహారం అందించాల్సి ఉంది. పునరావాస కాలనీలు పూర్తి చేసి వారిని తరలించాల్సి ఉంది. తమ కోసం నిర్మిస్తున్నట్టు చెప్పిన పునరావాస కాలనీ సిద్ధం కాలేదు. సి.ఎం. జగన్ ఇచ్చిన హామీలు ఆచరణ రూపం దాల్చకపోవడంతో నిర్వాసితులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. "ముఖ్యమంత్రి జగన్ మాటలు మాత్రమే మిగిలాయి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కేంద్రం నాన్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోతోంది. ఫలితంగా నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల నిర్వాసితులు నష్టపోవాల్సి వస్తోంది. - ఎం.కె. ఫజల్
http://www.teluguone.com/news/content/ap-cm-jagan-words-on-polavaram-what-did-he-say-25-175470.html