డ్రగ్స్ రాజధానిగా ఏపీ! గంజాయిపై పెమ్మసాని గర్జన
Publish Date:May 4, 2024
Advertisement
పుస్తకాలతో కుస్తీ పడాల్సిన యువత జీవితాలు మత్తులో సుస్తీ అవుతున్నాయి. ఉన్నతంగా ఎదగాల్సిన జీవితాలు, గంజాయి కూపంలో కూరుకుపోతున్నాయి. బిడ్డలపై తల్లిదండ్రుల ఆకాంక్షలు, గుప్పుమనే గంజాయికి నిప్పులా కాలిపోతున్నాయి. బతుకు మార్గం తెలుసుకోవాల్సిన జీవితాలు, గంజాయికి మత్తుకు అర్థంతంగా ముగిసిపోతున్నాయి. ఇవన్నీ కళ్లారా చూసి చలించిపోయారు గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని. గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ ను సీబీఐ పట్టుకుంది. ఈ డ్రగ్స్ కేసు వైసీపీ చుట్టూ తిరుగుతోంది. యువతను టార్గెట్ గా చేసుకుని గంజాయి ముఠాలు ఆంధ్రప్రదేశ్లో రెచ్చిపోతున్నాయి. మైనర్లు కొందరు తమకు తెలియకుండానే ఈ రొంపిలోకి దిగుతున్నారు. అందుకే గంజాయి, కొకైన్ లాంటి మత్తు పదార్థాల రవాణా సులువుగా సాగిపోతోంది. వీరి వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయంటారు పెమ్మసాని. ఏపీకి దిగుమతి అవుతున్న నిషేధిత డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని పెమ్మసాని ఆందోళన వ్యక్తం చేశారు. హెరాయిన్ కేసులో కానీ, విశాఖ భారీ డ్రగ్స్ కేసులోకానీ కింగ్పిన్ ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఏపీలో మద్యాన్ని ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకుంటున్నారు. 60 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ను రూ.200లకు విక్రయిస్తున్నారు. రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మద్యం బ్రాండ్లను జగన్ అమ్ముతున్నారని పెమ్మసాని మండిపడ్డారు. గత దశాబ్దకాలంగా భారతదేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా పెరిగిందని పెమ్మసాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటే వినియోగమూ విపరీతంగానే పెరిగింది. ఏదో ఒక మూలనుంచి మన దేశానికి మాదకద్రవ్యాలు చేరుతూనే ఉన్నాయి. డ్రగ్స్ కు బానిసలవుతున్నవారిలో యువతదే సింహభాగం. తనను గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే, ఈ డ్రగ్స్ మహమ్మారిని దేశం నుంచి తరిమేయడానికి పార్లమెంట్లో పోరాడతానని పెమ్మసాని గ్యారెంటీ ఇస్తున్నారు. - ఎం.కె.ఫజల్
గతంలో ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ మూలాలు, వివిధ రాష్ట్రాలలో పట్టుపడుతున్న గంజాయి సరఫరా మూలాలు అన్నీ ఏపీ వైపే వేలెత్తి చూపుతున్నాయి. గతంలో పట్టుబడిన హెరాయిన్ సరుకు మీద ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీ విజయవాడ అడ్రస్లో నమోదైంది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా దొరికిన హెరాయిన్ విజయవాడ అడ్రస్ తో ఉండడంతో, ఆ సరుకు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చింది కావడంతో, ఇక జీఎస్టీ నెంబర్ కూడా దానికి ఉన్న నేపథ్యంలో ఏపీకి చెందిన అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి.
అలాగే బెంగుళూరులో పట్టుబడిన సింథటిక్ డ్రగ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయని కర్ణాటక పోలీసులు తేల్చారు.
ప్రపంచంలోనే ఓపియం (నల్లమందు)ను అధికంగా సాగు చేసే మయన్మార్, ఆప్ఘనిస్తాన్ దేశాలకు సమీపంలో ఉండటం కూడా భారత్ కు శాపంగా పరిణమించింది. ఆప్ఘన్ లో సాగయ్యే ఓపియంను పాకిస్తాన్ హెరాయిన్ గా మార్చి ఇండియాలోకి అక్రమంగా రవాణా చేస్తోంది. మయన్మార్ లోని షా, కచిన్ రాష్ట్రాలలో తయారయ్యే హెరాయిన్, మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను భారత్ లోకి అక్రమంగా రవాణా చేసేందుకు స్థానిక తిరుగుబాటు ముఠాలను చైనా ప్రోత్సహిస్తోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అంచనాల ప్రకారం భారతదేశానికి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్ లో 70 శాతం అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతం ద్వారా చేరుతున్నాయి.
http://www.teluguone.com/news/content/ap-as-the-capital-of-drugs-pemmasani-roars-on-drugs-25-175133.html