వల్లభనేని వంశీకి మరో షాక్
Publish Date:Apr 1, 2025
Advertisement
రోజుల తరబడి రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు స్వరూపం, అదేనండి ఒరిజనల్ రూపం బయటపడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తెల్ల జుట్టుతో, దీన వదనంతో విజయవాడ సబ్జైలు నుంచి కోర్టులకు తిరుగుతున్న వంశీకి వరుస కేసులు, కోర్టు ఉత్తర్వులు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. తాజాగా ఆయనకి మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు మంగళవారం (మార్చి 1) రిమాండ్ పొడిగించింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసుస్టేషన్లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది. ఈ నెల 15 వరకు వంశీకి రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు, ఏ1 నిందితుడు మోహన్ రంగాను సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు విచారించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిన మోహన్ రంగాను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
http://www.teluguone.com/news/content/another-shock-to-vallabaneni-vamshi-39-195418.html





