ఫాల్కన్ స్కామ్ కేసులో ఆ సంస్థ ఎండీ అమర్ దీప్ అరెస్టు
Publish Date:Jan 6, 2026
Advertisement
వందల కోట్ల రూపాయల ఫాల్కన్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు, ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్ దీప్ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్లు, మల్టీ నేషనల్ కంపెనీలు, షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అమర్ దీప్ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి ప్రజలను మోసగించిన అమర్ దీప్ దాదాపు 850 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ బయటపడగానే అమర్ దీప్ తన ఛార్టర్డ్ ఫ్లైట్ లో దుబాయ్ పారిపోయాడు. దీంతో తెలంగాణ పోలీసులు అమర్ దీప్ పై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ముంబై వెళ్లి అమర్ దీప్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ సంస్థ సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్ దీప్ అరెస్టుతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా వేలాది మందిని దారుణంగా మోసం చేసిన ఈ కేసులో అమర్ దీప్ అరెస్టు కీలక పరిణామంగా చెప్పవచ్చు. మెస్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా అక్రమ డిపాజిట్లు సేకరించి వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ కుమార్పై తెలంగాణ పోలీసులు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల ఆధారంగా అమర్దీప్ భారత్ కు వచ్చినట్లు తెలుసుకున్న తెలంగాణ పోలీసులు సోమవారం (జనవరి 5) ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ రిమాండ్పై హైదరాబాద్కు తరలించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అమర్దీప్ కుమార్ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ బ్రాండ్ పేరుతో పనిచేస్తున్న మెస్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మోసం, క్రిమినల్ కాన్సిపరసీ కింద కేసులు నమోదు చేశారు. ప్రసిద్ధ బహుళజాతి సంస్థల పేర్లను ఉప యోగిస్తూ నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ డీల్స్ను రూపొందించాడు. ఇందుకోసం మోసపూరిత వెబ్సైట్తో పాటు మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేసి, అధిక స్వల్పకాలిక లాభాలు వస్తాయని హామీలు ఇస్తూ సామాన్య ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టాడు. ఈ స్కామ్లో మొత్తం 7,056 మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్ల అక్రమ డిపాజిట్లను అమర్ దీప్ సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. వీరిలో 4,065 మంది బాధితులు దాదాపు రూ.792 కోట్ల మేర నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా.పెట్టుబడిదారుల ఫిర్యాదుల ఆధారంగా సైబరాబాద్ కేసులు నమోదు చేసి, అనంతరం దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లు, చార్టర్డ్ అకౌంటెంట్తో సహా మొత్తం 11 మంది నిందితు లను అరెస్టు చేసి న్యాయ స్థానం ముందు హాజరు పరచగా, వారంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా 12 ప్లాట్లు, 4 లగ్జరీ కార్లు, రూ.8 లక్షల నగదు, 21 తులాల బంగారం, రూ.20 కోట్ల విలువైన ఆర్డిపి షేర్లు, రూ.8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్లు సహా మొత్తం సుమారు రూ.43 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వాటి అటాచ్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది.
http://www.teluguone.com/news/content/amardeep-arrest-in-falcon-scam-case-36-212089.html





