ప్రియుడి కోసం పాముతో కరిపించి భర్తను హతమార్చిన భార్య..!
Publish Date:Jul 19, 2026
Advertisement
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..! ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో మానవ సంబంధాలను మంటగలిపేలా ఒక భయంకరమైన హత్య వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే కక్షతో ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మృతుడిని హస్తినాపూర్ పరిధిలో నివసించే అతుల్ పన్వార్గా పోలీసులు గుర్తించారు. అతడు తన భార్య దామినితో కలిసి ఒక ప్లే స్కూల్ను నిర్వహిస్తున్నాడు. అయితే, ఇదే స్కూల్లో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న తుషార్ అనే వ్యక్తితో దామినికి వివాహేతర సంబంధం ఏర్పడటమే ఈ ఘాతుకానికి దారితీసింది. తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో పాటు, అతుల్ పేరుపై ఉన్న రూ. 20 లక్షల బీమా సొమ్మును సొంతం చేసుకోవాలని వీరిద్దరూ పథకం వేశారు. మొదట అతడిని రోడ్డు ప్రమాదం రూపంలో చంపాలని ప్రయత్నించినప్పటికీ, ఆ ప్లాన్ ఫలించలేదు. దీంతో వారు మరింత భయంకరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. పథకం ప్రకారం గురువారం రాత్రి దామిని తన భర్త తాగే పాలలో నిద్రమాత్రలను కలిపి ఇచ్చింది. ఆ పాలు తాగిన అతుల్ తీవ్రమైన నిద్రలోకి జారుకున్నాడు. ఆ వెంటనే ఆమె తన ప్రియుడు తుషార్ సహాయంతో ముందే సిద్ధం చేసుకున్న ఒక విషసర్పాన్ని బెడ్పైకి వదిలి, అతుల్ను కరిపించి కడతేర్చింది. మరుసటి రోజు ఉదయం అతుల్ ఎంతకీ లేవకపోవడంతో, అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఒంటిపై పాముకాటు గుర్తులు ఉండటంతో ఇదొక సాధారణ ప్రమాదంగా అంతా భావించినప్పటికీ, పోలీసులకు మాత్రం కొన్ని అనుమానాలు వచ్చాయి. రూరల్ ఎస్పీ అభిజీత్ కుమార్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. నిందితులైన దామిని, తుషార్ల మొబైల్ ఫోన్ కాల్ డేటా మరియు లొకేషన్ వివరాలను పరిశీలించగా పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. హత్య జరిగిన సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు తేలింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితులు ఇద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. తుషార్కు కూడా ఇదివరకే వివాహమైందని, భార్యకు విడాకులు ఇచ్చి దామినితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘోరంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కోర్టు ద్వారా కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి నేరాలు సమాజానికి ప్రమాదకరమని ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. Meerut Crime News, Wife Killed Husband With Snake, Uttar Pradesh Crime, Extramarital Affair Murder, Insurance Fraud Murder Case.
http://www.teluguone.com/news/content/-meerut-crime-news-36-226450.html





