సౌదీలో భారతీయుల విలవిల
Publish Date:Aug 5, 2016
Advertisement
ఒకవైపు కరువు..పంటలు పండక..చేయడానికి పనిలేక బ్రతుకు తెరువు కోసం అయినవాళ్లనూ, కన్న తల్లి లాంటి ఊళ్లను వదిలి పొట్టచేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు పోయిన భారతీయులకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. సౌదీలోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులను అక్కడి సంస్థలు బయటకు నెట్టడంతో వారంతా దిక్కుతోచక రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు పోయి..వేతనాలు రాక..చేతిలో చిల్లుగవ్వ లేకపోవడం, చివరకు పాస్పోర్ట్లు కూడా కంపెనీల వద్దే ఉండటంతో దాదాపు 10 వేల మంది భారతీయులు ఆకలితో అలమటిస్తున్నారు. బాధితుల్లో ఒకరైన ఇమ్రాన్ ఖోకర్ అనే వ్యక్తి ట్వీట్టర్ ద్వారా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు తమ సమస్యలను తెలియజేశారు. దీనిపై అంతే వేగంగా స్పందించిన సుష్మ, భారతీయులకు ఆహారం అందించాలని సౌదీలోని భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించారు. రంగంలోకి దిగిన ఎంబసీ అధికారులు ఆగమేఘాల మీద భారతీయులకు ఆహారం అందజేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనం కావడంతో ఆయిల్ ఎగుమతులపైనే ఆధారపడ్డ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఇటీవల కొన్నేళ్లుగా సౌదీ అరేబియా, బహ్రైన్, ఒమన్ తదితర దేశాల్లో ఆర్థికలోటు అపారంగా పెరిగింది. ఒక్క సౌదీ విషయమే తీసుకుంటే నిరుడు ఆ దేశ ఆర్థికలోటు 9,800 కోట్ల డాలర్లు. దానికి తోడు సౌదీ ప్రభుత్వం యెమెన్లో సైనిక జోక్యం చేసుకోవడంతో ఆ దేశ పరిస్థితి మరింత క్షీణించింది. దీని ప్రభావంతో అక్కడ కంపెనీలు కాస్ట్ కటింగ్ చర్యలు చేపట్టాయి..సిబ్బందిని తగ్గించుకుని ఉన్నవారిపై పనిభారాన్ని పెంచడం, జీతాలు ఆలస్యం చేయడం, అసలు చెల్లించకపోవడం వంటి చర్యలు పెరిగాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో అతిపెద్ద నిర్మాణ సంస్థ బిన్లాడెన్ గ్రూపు ఈ ఏడాది మొదట్లో 50,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇలా తొలగించిన వారందరికీ ఆ సంస్థ ఎగ్జిట్ వీసాలు మంజూరు చేసినా గల్ఫ్ దేశాల్లో ఉండే కఠిన నిబంధనల కారణంగా దానికి అనుబంధంగా కంపెనీ నుంచి వివిధ రకాల పత్రాలు లేనిదే దేశం నుంచి బయటికెళ్లేందుకు అనుమతించరు. దీని ప్రభావం భారత్పై ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు. అనుకున్నట్లుగానే ఉపద్రవం ముందుకొచ్చింది. గల్ఫ్లో దాదాపు 70 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారని అంచనా. వీరిలో ఒక్క సౌదీలోనే 30 లక్షల మంది వరకూ ఉంటారు. వలసలను అరికట్టడం కోసం, స్థానికులకు ఉపాధి కల్పించడం కోసం మూడేళ్ల క్రితం నిలాఖత్ చట్టం తీసుకురావడం వల్ల సౌదీలో గతంతో పోలిస్తే భారతీయుల వలసలు తగ్గాయి. గల్ఫ్కు వెళ్లేవారిలో అత్యధికులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేసి ఎన్నో వ్యయప్రయాసలకొర్చి అక్కడికి చేరుకున్న వారే. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లేవారు చదువుల కోసమో, కెరీర్లో మరింత ఉన్నతస్థానానికి వెళ్లాలని వలస పోతుంటే..గల్ఫ్ దేశాలకు మాత్రం కేవలం ఆకలి బాధ నుంచి తప్పించుకోవడానికే వెళ్తారు. ఇప్పుడు వారిలో 30 లక్షల మంది భారతీయులు రోడ్లపైకి వచ్చారు. బిన్లాడెన్ గ్రూపు నుంచి తప్పించబడ్డ భారతీయులు కూడా వారికి జత కలిశారు. దీనికి వ్యతిరేకంగా వారు మక్కాకు శాంతి ప్రదర్శన జరిపారు. బిన్లాడెన్ కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. బస్సులను దగ్థం చేశారు. అయినా సౌదీ ప్రభుత్వం వారి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు..భారత ప్రభుత్వం కూడా స్పందించలేదు. సౌదీలోని చమురు కంపెనీలు ఊహించని లాభాలు గడిస్తుండటం, అక్కడి ప్రవాస భారతీయులు భారత్లో పెట్టుబడులు పెడుతుందటంతో మన ప్రభుత్వాలు పండుగ చేసుకుంటున్నాయి. వలస కార్మికులు గల్ఫ్ నుంచి ఇక్కడి తమ వారికి పంపే డబ్బు ఏటా 3,300 కోట్ల డాలర్లు( సుమారు రూ.2,20,000 కోట్లు) ఉంటుందని అంచనా. విదేశీ మారక నిల్వల పేరిట దేశానికి ఇంత సాయం చేస్తున్నా అందుకు ప్రతిఫలంగా వారి బాగోగుల విషయంలో మాత్రం భారత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ చిక్కుకుపోయిన భారతీయ కార్మికులకు ఎగ్జిట్ వీసాలను ఇప్పించి వెనక్కి తీసుకురావటం మినహా భారత ప్రభుత్వం ప్రస్తుతం చేయగలగిందీ ఏమీ లేదు. కొన్ని నెలలుగా రావాల్సిన బకాయిలను తీసుకోకుండా ఖాళీ చేతులతో భారత్కు వెళ్లడం కార్మికులకు ఇష్టం లేదు. అందుకే ఆందోళన బాట పడుతున్నారు. అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి వారి బకాయిలను భారత ప్రభుత్వం ఇప్పించగలిగితే అంతకు మించిన సాయం వారు ఆశించరు.
http://www.teluguone.com/news/content/-indian-workers-in-saudi-arabia-37-64747.html