కడప జిల్లాలో వైసీపీ నేతల బరి తెగింపు!
posted on Mar 9, 2021 9:47AM
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రచార గడువు ముగిసినా.. వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక అధికారులు, పోలీసుల మద్దతుతో అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీ నేతలు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
జమ్మలమడుగులో అధికారపార్టీ నేతలు ఎన్నికల నిభందనలు ఉల్లంఘించారు. సోమవారంతో ప్రచార ఘట్టం ముగిసినప్పటికీ.. మంగళవారం ఉదయం స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన కార్యకర్తలతో కలసి జమ్మలమడుగు రోడ్లపై తిరుగుతున్నారు. ఓటర్లను కలుస్తూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయమని కోరుతున్నారు. ఎన్నికల యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.