యువతి దారుణ హత్య
posted on Jan 12, 2026 8:44AM
.webp)
హైదరాబాద్ నగరంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన బోరబండ ప్రాంతంలో కలకలం రేపింది. తనతో మాట్లాడటం లేదన్న కోపంతోనే ఆ యువకుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలు గతంలో బంజారా హిల్స్లోని ఓ పబ్లో పనిచేస్తున్న సమయంలో నిందితుడి తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ఆమె అక్కడి ఉద్యోగాన్ని వదిలి ఊర్వశీ బార్కు షిఫ్ట్ కావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
అప్పటి నుంచి యువతి తనతో సరిగా మాట్లాడటం లేదనీ, తనను అవాయిడ్ చేస్తోందనీ అనుమానం పెంచుకున్న యువకుడు ఆమెను మాట్లాడుకుందాం రమ్మని బోరబండ ప్రాంతానికి పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉన్మాదంగా మారిన నిందితుడు ఒక్కసారిగా యువతి పై దాడి చేసి హత్య చేశాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బోరబండ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.