సోమనాథ్ ఆలయంలో డ్రమ్ములు వాయించిన ప్రధాని మోడీ
posted on Jan 12, 2026 8:25AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం (జనవరి 11) గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు సోమనాథ్ ఆలయాన్ని రక్షిస్తూ ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరిస్తూ ఏర్పాటు చేసిన శౌర్య యాత్ర ఉత్సవ ఊరేగింపునకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 గుర్రాలతో ఊరేగింపు జరిగింది. శౌర్య యాత్రలో భాగంగా ఓపెన్ టాప్ వాహనంపై నిల్చుని ప్రధాని మోదీ దారికి ఇరువైపులా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
అంతే కాకుండా ఊరేగింపు సమయంలో ప్రధాని మోదీ డమరుకం వాయించారు. గుజరాత్ ముఖ్య మంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి ప్రధాని మోదీ, ఒక కిలోమీటరు పొడవునా సాగిన యాత్రలో పాల్గొన్నారు. సోమనాథ్ శౌర్యయాత్రలో భాగంగా మోదీ అక్కడి భక్తులతో కలిసి సాంప్రదాయ డ్రమ్ములను వాయించారు.
ఆ తర్వాత ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 'బాల గురువులు' పఠించే మంత్రాలను విన్నారు. అనంతరం ఋషులకు, సాధువులకు, భక్తులకు అభివాదం చేశారు.