ఉత్తరఖండ్ లో కొండచరియలు విరిగి ఇద్దరు హైదరాబాద్ వాసులు మృత్యువాత
posted on Jul 6, 2024 3:24PM
ఒకప్పుడు.యాత్రలు చేయడానికి ఇప్పుడున్నన్ని ప్రయాణ సౌకర్యాలు లేవు. ఎడ్లబండ్లమీదనో, కాలి నడకనో తీర్థ యాత్రలకు వెళ్ళేవారు. తెలుగు రాష్ట్రాలకు కాశి చాల దూర ప్రయాణం. కనుక కాశీకి వెళ్ళడానికి కొన్ని నెలలు పట్టేది. అలా వెళ్ళిన వారు తిరిగి వస్తే రావొచ్చు లేదా అక్కడే కాలం చేయ వచ్చు. పైగా కాశీలో మరణిస్తే పుణ్యమని ప్రజలు బలంగా నమ్మే వారు. కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడు ఒకటే అనే జాతీయం తెలుగునాట పుట్టుకొచ్చింది. ప్రస్తుతం కాశీ ప్రయాణానికి రవాణా సౌకర్యాలు మరింత మెరుగయ్యాయి. కాశీ వెళ్లి శివైక్యం చెందారని మనం అరుదుగా వింటున్నాం. అయితే ఇపుడు ఉత్తరఖండ్ వెళితే చావు మినిమం గ్యారెంటీగా మారింది. ఉత్తర ఖండ్ వెళ్లిన వారు బతికే చాన్స్ తక్కువైంది. ఉత్తరఖండ్ వెళ్లిన వాడు కాటికి వెళ్లిన వాడు ఒకటే అనే కొత్త జాతీయం పుట్టుకొస్తుందేమో మరి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యాత్రికులు మృత్యువాత పడ్డారు. మృతులను నిర్మల్ షాహీ (36), సత్య నారాయణ (50) గా అక్కడి పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో కొండచరియలు వారిపై విరిగి పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా, భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రుద్రప్రయాగ్-కేదార్నాథ్ జాతీయ రహదారిపై కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రుద్రప్రయాగ్లో ముందు జాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలకు శనివారం సెలవు ఇచ్చేశారు.