తిరుమలకు చంద్రబాబు దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలకు వెళ్ళారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం జరిగే ధ్వజారోహణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మాఢవీధుల్లో జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి పద్మావతి అతిథిగృహంలో బసచేస్తారు. శనివారం ఉదయం 7.35 గంటలకు పాంచజన్యం వెనుక నిర్మించిన వకుళమాత నూతన కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు. అనంతరం 9 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తారు.