ఏపీ అసెంబ్లీలో ఉపాధ్యాయ బదలీల క్రమబద్ధీకరణ బిల్లు.. ప్రవేశపెట్టిన లోకేష్
posted on Mar 19, 2025 2:46PM

ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదలీల క్రమబద్ధీకరణ బిల్లును మంత్రి నారా లోకేష్ బుధవారం (మార్చి 19) అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ హయాంలో ఉపాధ్యాయ బదలీలు అడ్డగోలుగా జరిగాయనీ, ఓ పద్ధతీ పాడూ లేకుండా ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల బదలీలు చేశారనీ విమర్శించారు. ప్రస్తుతం కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకమని ఆయన అన్నారు.
చంద్రబాబు పాలనలో అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయుల బదలీలు ఉండేవనీ లోకేష్ గుర్తు చేశారు. అందుకు భిన్నగంగా జగన్ హయాంలో అరాచకం రాజ్యమేలిందన్నారు. ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ బదలీలు చేశారనీ, కోర్టు మొట్టికాయలతో ఈ ట్రాన్స్ ఫర్ లను అప్పట్లో రద్దు చేశారని గుర్తు చేశారు. అందుకే ఉపాధ్యాయ బదలీలు పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయ బదలీల క్రమబద్ధీకరణ బిల్లు తీసుకువచ్చామన్నారు.
గతంలో ఉపాధ్యాయ బదలీల మార్గదర్శకాలు చాలా బలహీనంగా ఉండేవనీ, ప్రస్తుతం తమ పరభుత్వం తీసుకువచ్చే చట్టం ద్వారా బదలీల్లో పారదర్శకత, జవాబుదారీ తనం ఉంటాయని లోకేష్ చెప్పారు. ఈ బిల్లు ఏదో ఏకపక్షంగా ఆమోదింప చేసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదన్న లోకేష్, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఈ విషయంపై చర్చించామనీ, వారిచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా సమగ్ర బిల్లు రూపొందించామనీ లోకేష్ చెప్పారు.