సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటీనటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్"  2023, హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరిగింది. "కళావేదిక" (R.V.రమణ మూర్తి), " రాఘవి మీడియా"  ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ పాటలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప, మురళి మోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మరియు కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ గారి పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకర విషయం. ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘనవిజయాన్ని అందుకున్న నాయకుడు ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం అదేవిధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్ గారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడటం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను" అన్నారు.

నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చిత్రరంగమైన రాజకీయరంగమైన సంచలనానికి మారుపేరు. సినిమా రంగంలో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ప్రతి నాయకుడు పాత్రతో కూడా మెప్పించారు. అదేవిధంగా రాజకీయ రంగంలో పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో ఘనవిజయాన్ని సాధించారు. పేదల కోసం అదేవిధంగా ఆడవారి హక్కుల కోసం పోరాడి వారి హక్కులను వారికి అందించారు. అలాంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కళావేదిక వారికి అభినందనలు తెలియజేస్తున్నాను" అన్నారు.

అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత,  ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం, ఈ ఈవెంట్ లో నేను కూడా స్పాన్సర్ గా ఉండడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. గతంలో కళావేదిక వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కళావేదిక తో పాటు రాఘవి మీడియా మధు గారు భాగమవడం.. అదేవిధంగా ఈవెంట్ ఇంత ఘనంగా జరిపించడం చాలా మంచి విషయం. కళావేదిక, రాఘవి మీడియా సంయుక్తంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎన్టీఆర్ గారి ఖ్యాతి పెంచాలని, వాటిలో నేను నేను భాగం అవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నందమూరి మోహన్ రూప మాట్లాడుతూ.. "తెలుగు జాతి కోసం పుట్టి తెలుగువారి ఆత్మగౌరవం కోసం బ్రతికిన వ్యక్తి తెలుగువారు దేవుడిగా భావించే నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారు ఒక లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వంగా తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ గారి వల్లే. ఆయన అప్పట్లో చేసినటువంటి మల్లీశ్వరి, పాతాళ భైరవి సినిమాలతోనే ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్టార్. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు పోషించి అఖండ విజయం అందుకున్న సినిమా దానవీరశూరకర్ణ. ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు తనదైన శైలిలో నటిస్తూ ఇటీవల కాలంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోగా నిలబడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కళావేదిక భువన గారు మరియు రాఘవ మీడియా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను" అన్నారు.

కళావేదిక మరియు రాఘవి మీడియా అధినేతలు మాట్లాడుతూ.. "ఈవెంట్ కి  పిలవగానే విచ్చేసిన మురళీమోహన్ గారికి, నందమూరి మోహన్ కృష్ణ గారికి, మోహన్ రూపా గారికి మరియు ఇతర ప్రముఖులకి ధన్యవాదాలు. అదేవిధంగా ఈవెంట్ ఎంత బాగా జరగడానికి మాకు సహకరించిన మా స్పాన్సర్స్ వేగ జువెలర్స్ నవీన్ గారు, మణిదీప్ గారు, కళ్యాణ్ గారు, అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ గణపతి రెడ్డి గారు, క్యాపిటల్ 45 గోల్డెన్ క్రెస్ట్ శోభన్ బాబు గారు, శ్రీని ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీను గారు, పవన్ ఈవెంట్స్ పవన్ గారు, లీడ్ స్పేస్ మరియు డి ఆర్ నెట్ వారికి సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అన్నారు.

ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న విజేతలు - ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్నారు మురళీమోహన్ మరియు నందమూరి మోహన్ కృష్ణ, ఉత్తమ కథానాయకుడిగా బేబీ చిత్రానికి ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడిగా బేబీ చిత్రానికి సాయి రాజేష్, ఉత్తమ నిర్మాతగా భగవంత్ కేసరి చిత్రానికి సాహు గారపాటి, ఉత్తమ విలన్ గా యక్షిని వెబ్ సిరీస్ నుంచి అజయ్, ఉత్తమ నూతన దర్శకుడిగా 'దసరా' చిత్రానికి శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ నూతన నటుడిగా తిరువీర్ ఎన్టీఆర్ ఫిలిం పురస్కారాలను గెలుచుకున్నారు. అదేవిధంగా బెస్ట్ లిరిక్ రైటర్ గా కాసర్ల శ్యామ్, బెస్ట్ రైటర్ గా కళ్యాణ్ చక్రవర్తి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా రఘుకుంచె, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్ గా శరణ్య ప్రదీప్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా హర్షవర్ధన్, బెస్ట్ మేల్ సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా దాశరధి శివేంద్ర, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా నాగేంద్ర, బెస్ట్ కమెడియన్ గా రచ్చ రవి, బెస్ట్ ఎడిటర్ గా చోటా కే ప్రసాద్, బెస్ట్ ఫిమేల్ సింగర్ గా మంగ్లీ, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా విజయ్ పొలాకి, బెస్ట్ డెబ్యు మ్యూజిక్ డైరెక్టర్ గా ధ్రువన్, బెస్ట్ డెబ్యు సపోర్టింగ్ యాక్టర్ గా లక్ష్మణ్ మీసాల, బెస్ట్ నెగటివ్ సపోర్టింగ్ రోల్ లో సాహితీ దాసరి, స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్ గా గౌరీ కృష్ణ, బెస్ట్ డెబ్యూ రైటర్ గా అజ్జు మహకాళి, బెస్ట్ రివ్యూ కమిటీ లక్ష్మణ్ టేకుమూడి, స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ గా త్రినాథ్ ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ని అందుకున్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి మురళీమోహన్ మరియు నందమూరి మోహన్ కృష్ణ చేతుల మీదగా అందజేయడం జరిగింది.