అప్పుడు 'శక్తి'.. ఇప్పుడు 'కల్కి'..!

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి కెరీర్లలోనూ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో కూడా 'శక్తి' రూపంలో భారీ డిజాస్టర్ ఉంది. అయితే అలాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీతో, ప్రభాస్ రీసెంట్ సెన్సేషన్ 'కల్కి 2898 AD'ని ఒక విషయంలో అభిమానులు పోలుస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

'శక్తి', 'కల్కి' రెండు చిత్రాలనూ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించడం విశేషం. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన 'శక్తి' చిత్రం 2011 ఏప్రిల్ 1న విడుదలైంది. అయితే ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆ మరుసటి రోజు అనగా 2011 ఏప్రిల్ 2న జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు 'కల్కి' విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి' మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలైన రెండు రోజులకు అంటే జూన్ 29న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగగా ఇండియా విజయకేతనం ఎగురవేసింది. 

దీంతో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో.. వైజయంతి మూవీస్ నిర్మించిన సినిమా విడుదలైతే చాలు.. ఇండియా కప్ గెలుస్తుందని కొందరు సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఇంకా కొందరు క్రికెట్ అభిమానులైతే ఒకడుగు ముందుకేసి సోషల్ మీడియా వేదికగా వైజయంతి మూవీస్ ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. "మీరు శక్తి-2 రిలీజ్ చేస్తారో, కల్కి-2 రిలీజ్ చేస్తారో మీ ఇష్టం.. కానీ ఇండియా ఆడే నెక్స్ట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి మాత్రం మీ నిర్మించిన సినిమా ఉండేలా చూసుకోండి." అని వింత కోరిక కోరుతున్నారు. మరి 'శక్తి', 'కల్కి' సెంటిమెంట్ ని నమ్మి.. క్రికెట్ అభిమానుల కోసం వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో వైజయంతి మూవీస్ తమ సినిమాలను విడుదల చేసేలా ప్లాన్ చేస్తుందేమో చూడాలి.