నానికి ఏమైంది.. ఎందుకిలా చేస్తున్నాడు..?

సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). గతేడాది 'దసరా', 'హాయ్ నాన్న' సినిమాలతో ఆకట్టుకున్న నాని.. ఈ ఏడాది 'సరిపోదా శనివారం' సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 29న విడుదల కానుంది. అయితే ఈ సినిమా తర్వాత చేయనున్న ప్రాజెక్ట్ ల విషయంలో నాని తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

నాని తన 32వ సినిమాని 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించాలని ప్లాన్ చేసింది. కానీ ఏవో కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుస్తోంది. ఇక 'బలగం' ఫేమ్ వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాని సిద్ధమయ్యాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి 'ఎల్లమ్మ' అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా హోల్డ్ లో పడిందని సమాచారం. నాని తన 33వ సినిమాని 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో అనౌన్స్ చేశాడు. అయితే ఇందులో హీరో పాత్ర, వేణు చెప్పిన కథలో హీరో పాత్ర ఒకేలా ఉండటంతోనే 'ఎల్లమ్మ' ప్రాజెక్ట్ పక్కన పెట్టాడని వినికిడి.

సుజీత్, వేణు ప్రాజెక్ట్ లు హోల్డ్ లో పడటంతో.. ఇక నాని 'దసరా' డైరెక్టర్ ప్రాజెక్ట్ ని ముందు సెట్స్ పైకి తీసుకెళ్తాడని భావించారంతా. కానీ నాని మాత్రం అనూహ్యంగా 'హిట్-3'ని తెరపైకి తెచ్చాడని తెలుస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్-1', 'హిట్-2' సినిమాలను నాని నిర్మించిన సంగతి తెలిసిందే. 'హిట్-1'లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, 'హిట్-2'లో అడివి శేష్ హీరోగా నటించాడు. 'హిట్-3'లో నాని హీరోగా నటించాల్సి ఉంది. నిజానికి ఈ మూవీ గతేడాదే మొదలవుతుందని భావించారంతా. కానీ వెనక్కి వెళ్ళిపోయింది. నాని కూడా వరుసగా ఇతర కొత్త ప్రాజెక్ట్ లు ప్రకటించడంతో ఇక ఇప్పట్లో 'హిట్-3' ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అనూహ్యంగా ఇప్పుడు 'హిట్-3' తెరపైకి వచ్చింది. 'సరిపోదా శనివారం' తరువాత 'హిట్-3' చేసే ఆలోచనలో నాని ఉన్నాడట. మొత్తానికి తన కొత్త సినిమాల విషయంలో నాని తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.