ఏపీ టీ షర్టులకు యమాక్రేజ్
posted on May 25, 2015 3:00PM

ఇప్పుడు అందరి దృష్టీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ మీదే. ఒకవేళ ఆ ‘దృష్టి’లో ఏవైనా దోషాలు వుంటే తొలగిపోవుగాక. ఏపీ రాజధానికి సంబంధించిన కొన్ని విషయాలు ఒక్కొక్కటి వెల్లడి అవుతుంటే, తెలుగువారి కళ్ళు జిగేల్మంటున్నాయి. రాజధాని తీరు తెన్నులు, ప్లానింగ్, రాజధాని ఎలా వుండబోతుందన్న విషయాలు దేశవ్యాప్తంగా ‘అమరావతి’ మీద ఆసక్తి పెరుగుతోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదల కూడా ఇప్పుడు అమరావతి అందరి దృష్టినీ ఆకర్షించడానికి ప్రధాన కారణమైంది.
ఈ నేపథ్యంలో అమెరికాకి చెందిన ఓ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భాగంగా వున్న విజయవాడ, గుంటూరు పేర్లతోపాటు ఆంధ్రప్రదేశ్ మ్యాప్, ఆంధ్రప్రదేశ్ లోగో ముద్రించిన టీ షర్టులను రూపొందించి అమెరికాలో విక్రయించడం ప్రారంభించింది. ఈ టీ షర్టులకు అమెరికాలోని తెలుగువారి నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ టీ షర్టులను రూపొందించిన సంస్థ వీటిని ఒక ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లో వీటిని అమ్మకానికి వుంచింది. 22 డాలర్ల నుంచి 39 డాలర్ల వరకు వీటిని ధరను నిర్ణయించింది. ఈ టీ షర్టులకు ఆన్లైన్లో అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలోని తెలుగువారు మాత్రమే కాకుండా... ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారు ఈ టీ షర్ట్లను మక్కువతో కొనుగోలు చేస్తున్నారట. వీటిని కొనుగోలు చేసిన వారు ఆ విషయాన్ని ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాలో ఆ విషయాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నారు.