అటువంటి "మహామనిషి" తనకి సన్మానం చేస్తున్నారంటే - కాస్తకూడా - ఆనందాన్ని కన్పించనీయని కరుణాదేవిని విస్తుపోయి చూశారందరూ -
కరుణాదేవి అతిశయంగా వెనుకకు వాలింది.
"... రాగశ్రీగారు మీ అభిమానరచియతేమో - క్షమించాలి. ఒక్కనిజం చెపుతున్నాను...ఆయన... లోసరుకు లేకపోయినా - కేవలం - అందరికాళ్లు పట్టుకుని - పేరుకోసం.... అడ్డమైన గడ్డీతిని - రికమండేషన్స్ వల్ల - సినిమాల్లో స్థానం సంపాదించి.... వెన్నెముక లేకుండా - అడ్డమైన వెధవకీ దాసోహం అంటూ... ఇప్పుడీస్థితికి చేరుకున్న వ్యక్తి... నాకు బాగా తెల్సు అటువంటివాడికి బ్రహ్మరథం పడతారెందుకో ఈపిచ్చి అభిమానులు....."
కరుణాదేవి స్పీచ్... కృష్ణాఎక్స్ ప్రెస్ వేగాన్ని మించి సాగిపోతూనే వుంది....
ఆగుతూ... ఆయాసపడుతూనే వుంది... అందరూ ఆత్రంగా వింటున్నా.... యోగిలా కళ్లు మూసుకుని నిద్రలోకి జారిపోయి్నట్టుంది మటుకు రామ్మూర్తి అనే సామాన్యుడు.
ఇదీ రచయిత్రికి కష్టం కల్గించకపోలేదు... గంటల తరబడి సాహిత్య చర్చ జరుగుతుండగానే - సికింద్రాబాద్ స్టేషన్ లో నిర్లిప్తంగా ఆగింది కృష్ణా ఎక్స్ ప్రెస్.
పూలమాలలతో అబిమానులగుంపు - కంపార్ట్ మెంట్సు వెతుక్కుంటూ - కరుణాదేవి వున్న కిటికీ దగ్గర ఆగిపోయారు.
గర్వంగా ఠీవిగా - లేచినిలబడి - చేతులు జాడించి - పూలమాలలకోసం - తల ముందుకు వంచిన కరుణాదేవి- శిలాప్రతిమలా నిలబడిపోయింది.
ఆగుంపులో అధికభాగం - రామ్మూర్తి అనబడే వ్యక్తి దగ్గరకు వచ్చి - పోటీలమీద పూలమాలలు ఆయన మెళ్లో వెయ్యటం మొదలుపెట్టారు.
ఒకరిద్దరు లేడీస్ -కరుణాదేవి మెడలోవేసి... ఆప్యాయంగా చెయ్యి అందుకున్నారు.
"సార్... మీరు మీరూ ఇదే ట్రైన్లో వచ్చారా? ఏదోటైములో వస్తానంటే - ఏట్రైన్ కో అర్దంకాక బుఱ్ఱలు బ్రద్దలు కొట్టుకుంటున్నాం... మొత్తానికి అందరూ కల్సేవచ్చారన్నమాట - మేడమ్ - వీరు... విశ్వవిఖ్యాత రచయిత "రాగశ్రీ" గారు -" పరిచయం పూర్తవకుండానే రామ్మూర్తి చిరునవ్వు నవ్వాడు.
"వీరు ..... -"
కరుణాదేవిని పరిచయం చెయ్యబోతుంటే - మరింత విచిత్రంగా నవ్వాడు.
"నేను చూద్దామనుకున్నదీ - సన్మానం ద్వారా - ఆశీస్సులు అందిద్దామనుకున్నదీ " కరుణాదేవి" పేరుతో -కధలు వ్రాసే విశ్వాన్ని. పెళ్లాంపేరు కథలికి పెట్టుకుంటానంటే సరే నన్నానేగానీ - రచనల్లో ఇంతగా ఎదిగిన మనిషి - గాజులుతొడుక్కుని స్టేషన్లోనే నన్నుచూసి పారిపోతాడనుకోలేదుి - తెల్లబోయి చూస్తున్న వెంకట్రావ్ భుజాన్ని తడుతూ ఏదోలా నవ్వారు రాగశ్రీ.
"నువ్వు పెళ్లాం పేరుమీదే వ్రాస్తున్నావనుకుంటా.... మిమ్మల్ని తప్పుపట్టాను.... కానీ.... కరుణాదేవిలాంటి నకిలీరచయిత్రులకి సన్మానం చెయ్యమని - నా అమూల్యకాలాన్ని - వ్యర్దం చేసిన మిమ్మల్నేం చేసినా పాపంలేదనిపిస్తూంది - ఆవిడ్ని కల్సుకోటం ఇవాళ కాకతాళీయమే ...ఐనా - విశ్వంలాంటి వెన్నెముక లేనివాళ్లను తల్చుకుంటూ నేను పడేబాధను మాత్రం - మీరు ఊహించలేరు - ఇటువంటి వాళ్లకి సన్మానం చేసేటంత నీచస్థితికి దిగజారలేదు నేనింకా - ఇంకా - మీకది అవసరమనిపిస్తే - అమాయకులైన అభిమానులూ- వేదిక నెక్కాలని తహతహలాడేవాళ్లు - మీకు దొరక్కపోరు.
"అమ్మా -నమస్కారం -"
విసురుగా వెడుతున్న రాగశ్రీని ఆపగల ధైర్యంలేని అభిమానులందరూ -శిలాప్రతిమలై పోయారు......
మరి మహారచయిత్రి కరుణాదేవి !!!
*
