మరుసటిరోజు పళ్ళూ, హార్లిక్సూ వగైరా తీసుకొని హాస్పిటల్ కు వెళ్ళాను. ఇంకా ఆవిడ రాలేదు. డ్రైవర్ సుబ్బారావు టిఫిన్ తెచ్చి, ఆవిడ్ని తీసుకురావడానికి వెళ్ళాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి, "రేపు ఉదయం ఆపరేషన్ ఏడు గంటలకే చేస్తా"నని చెప్పి వెళ్ళారు.
పదిగంటలు కావస్తోంది. రమణమ్మ గారు ఇంకా రాలేదు. "మీరు రెస్ట్ తీసుకోండి. నేను రాసుకుంటాను" అన్నాను శ్రీ శ్రీ గారితో.
"నువ్వు కూడా రెస్ట్ తీసుకో. అవన్నీ ఎత్తికట్టు. తర్వాత రాసుకుందాం. ఏమైనా మాటలు చెప్పు వింటాను" అన్నారు. నేను కూడా రాసే మూడ్ లో లేను.
"మాట్లాడ్డం కాదుగానీ నాకు కొన్ని సందేహాలున్నాయి....
లిస్టయితే పెద్దదే.
కానీ ఒకటి రెండు అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుదామనుకున్నాను.
ఇప్పుడు అడుగుతాను చేస్తారా"అన్నాను"
"చచ్చుప్రశ్నలు వెయ్యకుండా వుంటే చెప్తాను" అన్నారు.
"మళ్ళీ జన్మ ఉందంటారే! అది నిజమేనా?" అని అడిగాను.
"నేననుకున్నట్టు చచ్చు ప్రశ్నే వేశావు. ఎత్తిన జన్మని వృధా చేసుకొని చచ్చిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తుతామంటే నాకు నమ్మకం లేదు సరోజా! మనిషికి ఒక జన్మ చాలు. దాన్ని సార్ధకం చేసుకోనిద్దూ. ఉన్నదాన్ని వదిలేసుకొని లేనిది ఉందనుకోవడమంత మూర్ఖత్వం మరొకటిలేదు" అన్నారు. కొంతసేపు మౌనంగా వున్నాను.
"ఏవండీ! మీకు నీరసంగా లేదుకదా" అని అడిగాను.
"నా గురించి అనవసరంగా బెంగ పెట్టుకుంటున్నావు. నీకింకా నా సంగతి తెలియదు. నేను మూడుసార్లు మృత్యువుతో పోరాడి గెలిచాను. 1930లో అరవై రోజులు టైఫాయిడ్ తో బాధపడ్డాను. జీవితం మృత్యువుతో ఎలా పోరాడుతుందో తెలుసుకున్నాను. లాభం లేదని నన్ను కిందకి కూడా దించేశారు.
మొదటిసారి నేను పుట్టిన వెంటనే చనిపోవలసిందట. నా నుదుటిమీద ఈ మచ్చ చూశావా? మా బంధువు ఒకాయన చుట్టతో కాల్చి బతికించాడు. మెడ వెనుక, చేతి మణికట్టు మీద చుట్టతో కాల్చారు. గుర్తుగా ఈ మచ్చలున్నాయి.
చిన్నప్పటి నుండి తిరుగుబాటు మనస్తత్వం నాది. మీరంతా దేవుళ్ళని, ఆత్మల్ని నమ్ముతారు. ఈ రెండూ అబద్ధాలే. ఇంతకీ నువ్విప్పుడు నీ సంతోషీ బామ్మని (సంతోషీమాతని), నీనామాలవాడినీ (వెంకటరమణ మూర్తిని) యధావిధిగా పూజించుకునే ఇక్కడికి వచ్చావా?" అని అడుగుతూ నవ్వారు.
ఇంతలో కారు హారన్ మోగింది.
ఏవండీ, మీ ఆవిడ వచ్చారు. ఆవిడచేత చివాట్లు తినీతినీ నా ముఖం వాచిపోతోంది. ఇంక నేను ఇంటికి వెళతాను" అన్నాను.
"ఇవాళ సాయంకాలం నాలుగు గంటలకి కారు పంపుతాను" అన్నారు.
"ఇంకా కదలలేదూ..." అంటూ లోనికి అడుగు పెట్టారావిడ.
"ఎవరో ఒకరుండాలిగా? మీరొచ్చారు నేనిక వెళుతున్నాను" అన్నాను.
"ఆయనేమైనా పసిపిల్లాడా? లేక నాతో ఈసుకి కాపలానా ?" అని అడిగారు.
"ఛీ ఛీ" అన్నాను.
"అంటే నీ ఉద్దేశం ?" అన్నారావిడ.
"మీరెలాగైనా అనుకోండి" అన్నాను.
"పాపం ! ఎందుకలా సరోజమీద విరుచుకుపడతావు" అన్నారు శ్రీశ్రీ గారు.
"మీరు దాన్ని వెనకేసుకొస్తే నాకు ఒళ్ళు మండుతుందండీ" అన్నారావిడ.
"నేను వెళ్ళొస్తానండీ" అని శ్రీశ్రీగారితో చెప్పి బైటకొచ్చేశాను.
* * *
మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి హాస్పిటల్ కి వచ్చాను. "మధ్యాహ్నం భోం చేశారా? బాగా నిద్రపట్టిందా?" ఇలా ఎన్ని ప్రశ్నలడిగినా అన్నిటికీ "ఊఁ ఆఁ" అనే సమాధానమిచ్చారు శ్రీశ్రీ గారు.
"ఈ ఆఁలూ, ఊఁలూ తప్పిస్తే నేనడిగినవాటికి సమాధానాలు చెప్పటానికి వేరే మాటలే లేవా?" అని అడిగాను.
"అబ్బ! నొప్పి ఎక్కువగా వుంది సరోజా! నీతో చెప్తే బెంగపడతావని ఊరుకున్నాను. కానీ నువ్వు వూరుకోనిస్తేనా? నీ ప్రశ్నలతో చంపేస్తున్నావు" అన్నారు.
"సారీ అండీ" అన్నాను.
"మరేం ఫరవాలేదులే. రేపీపాటికి అన్నీ సర్దుకుంటాయి. నువ్వు మాత్రం రేపు ఉదయం ఆరుగంటలయ్యేసరికి ఇక్కడ వుండాలి. సుబ్బారావు అయిదుగంటలకే వచ్చేస్తాడు. నీ ముసలమ్మ పూజలున్నాయిగా? అవన్నీ రేపటికి ఎత్తికట్టేయ్. వీల్లేదంటే మాత్రం త్వరగా ముగించుకొని టైముకి మాత్రం ఇక్కడుండు.
కాలానికెప్పుడూ ముందుగా ఉండడం నేర్చుకో. అది అంత సుళువుగా ఒకరి చెప్పుచేతల్లో నడవదు. ఈ కాలానికి మాత్రం ఒక గుణం వుంది. తన అధికారంలో వున్న వాడ్ని ఎంత అథఃపాతాళానికి అణచేస్తుందో అంతగానూ తనని శాసిస్తున్నవాడికి బానిసైపోతుంది.
ఇది తెలియనందువల్లే తామే కాలానికి బానిసలమని అందరూ అనుకుంటారు అసలు విషయం తెలుసుకోకుండా. ఖర్మ అని, దైవమని, లలాట లిఖితమని అంటూ ఎన్నో విధాల తమను తాము మోసం చేసుకుంటూ, ఇతరుల్ని మోసంచేస్తూ బతికేస్తారు. వాడే నాకు సమస్త సదుపాయాలు చేస్తాడని, కనిపించని భగవంతుడ్ని నమ్ముకొని కూర్చుంటారు. ఇదే అసలైన బానిసత్వం. నాకిదే ఇష్టంలేదు.
"ముప్పయి మూడుకోట్ల దేవతలు కాపాడుతున్నా పరాంకోటి దరిద్రులున్నారు సరోజా! నాకీ దరిద్రమూ వద్దు, దేవతలూ వద్దు. ఇంతసేపూ నేను చెప్పింది ఆ బుర్రలోకేమైనా ఎక్కిందా?" అని అడిగారు.
నేను నవ్వాను.
"నవ్వడంకాదు సరోజా! పొద్దుట ఎన్ని గంటలకి ఇక్కడ వుండాలని చెప్పాను?" అని అడిగారు.
"జ్ఞాపకం వుందండీ. మీరంతగా చెప్పాలా? నాకు తెలీదూ?" అన్నాను. శ్రీశ్రీగారు అలా చిరాకుపడడం చూసి, నొప్పి ఎక్కువగా వుందేమో అనుకుంటూండగా డాక్టరుగారు వచ్చారు. కొన్ని మందులురాసి తెప్పించమని చెప్పారు.
"వారికి నొప్పి ఎక్కువగా వుందిట సార్?" అని చెప్పాను.
నర్సుని పిలిచి ఏదో ఇంజక్షన్ ఇమ్మని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. కారు డ్రైవరు సుబ్బారావు చేత మందులు తెప్పించాను. నర్సు ఇంజక్షన్ చేసి వెళ్ళింది.
అరగంటకి బాగా నొప్పి తగ్గినట్లుంది.
"ఇంతసేపూ ఈ నొప్పితోనే నాకు ఉపన్యాసం ఇచ్చారా?" అనడిగాను.
"దేనిదారి దానిదే సరోజా!" అన్నారు.
"ఏడుగంటలు కావస్తోంది. నేనిక ఇంటికి వెళతాను. రేపు త్వరగా వస్తాన"ని చెప్పి బయలుదేరాను.
* * *
మర్నాడు ఉదయం అనుకున్న ప్రకారం ఆరుగంటలకే హాస్పిటల్ కి వచ్చేశాను. నేను వెళ్ళిన పావుగంట తర్వాత శ్రీశ్రీగారిని లోపలికి తీసుకువెళ్ళారు. ఆయన నవ్వుతూ "భయపడకండ"ని మా అందరికీ చెప్పి మరీ వెళ్ళారు.
శ్రీశ్రీగారికి ఆపరేషన్ చేసి, మళ్ళీ రూమ్ కి తీసుకురావడానికి రెండుగంటలసేపు పట్టింది.
ఇక్కడో ముఖ్యవిషయం వుంది. శ్రీశ్రీగారు ఈ మూలవ్యాధి ఆపరేషన్ 1965వ సంవత్సరంలో అని రాశారు. కానీ ఇది 1958లో జరిగింది. నాకు బాగా జ్ఞాపకం. ఇందులో సందేహంలేదు. అప్పటికి మా పెళ్ళికూడా కాలేదు. శ్రీశ్రీగారి జీవితంలో ఆయనకు జరిగిన ఆపరేషన్ మొదటిదీ ఆఖరిదీ కూడా ఇదే.
పదకొండుగంటల ప్రాంతంలో బాగా మాట్లాడే స్థితికొచ్చారు.
"ఏవండీ ఎలాగుందండీ" అని అడిగాను శ్రీశ్రీ గారిని.
"బాగానేవుంది సరోజా!" అన్నారు.
"మీకు మత్తుమందు ఇచ్చారా?" అని అడిగాను.
"లేదు. నడుంమీద, దిగువభాగానికి మాత్రమే ఇంజక్షన్ ఇచ్చారు. నాకు ఒంటిమీద పూర్తిగా స్పృహవుంది. అయినా నాకు ఆపరేషన్ జరుగుతున్నట్టే అనిపించలేదు. ఆపరేషన్ జరుగుతున్నంతసేపూ నేను డాక్టర్లతో మాట్లాడుతూనే వున్నాను. ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ కృష్ణన్ గారు 'మరో ఇరవై నాలుగ్గంటలసేపు నొప్పిగా ఉంటుంది. అయినా అది మీరు భరించగలరని నాకు తెలుసు అన్నారు" అని శ్రీశ్రీగారు చెప్తూంటే గుండె ఎవరో పిండినట్టు బాధ కలిగింది.
