Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 32


    ఆ గొంతు, ఆ మాటలు వినేసరికి సుజాత కరిగిపోయింది. "చూడండి, నేను యింటిలో అందరికీ యెవరికి కావల్సినవి వారికి వేళవేళలా చూసుకొంటూ వంట అదీకూడా చేసుకోవాలి. అలాంటప్పుడు ఓ పూట పని తొందరలో మరిచిపోవచ్చు. మరి మీరు అడగకపోతే ఎన్నని గుర్తు వుంటాయి నాకు.....మీరిలా తినకుండా ఆకలితో వెళ్ళిపోతే నాకు సంతోషంగా వుంటుందా? ఇందాకటినించి యేదో తప్పు చేసినట్టు బాధపడుతున్నాను."
    "సారీ.....ఇక ముందు యిలాంటి యిబ్బంది మీకు కలిగించను. క్షమించండి, నాదే పొరపాటు" అన్నాడు రామకృష్ణ సుజాత మొహంలో బాధని వింతగా చూస్తూ.
    ఆ రోజునించి కాస్త మొహమాటాన్ని వెనక్కి నెట్టి సుజాతని యేది కావల్సినా అడగడం నేర్చుకొన్నాడు రామకృష్ణ. వంటింటి గుమ్మం దగ్గిర నిలబడి "టిఫిన్ ఇస్తారా కాఫీ ఇస్తారా...." అంటుండే రామకృష్ణని చూస్తే నవ్వు వచ్చేది సుజాతకి. ఆ గుమ్మందగ్గిర యెవరో గిరిగీసి లోపలికి రావడానికి వీలులేదన్నట్టు ఓ అడుగు ముందుకు వెయ్యకుండా నిలబడే అతన్ని చూస్తే తమాషా అనిపించేది సుజాతకి. వయసులో వున్న ఓ అమ్మాయి యింటిలో తిరుగుతూంటే ఆమెపట్ల ఏ మాత్రం ఆసక్తి చూపకుండా బుద్ధిమంతుడిలా తలవంచుకు తిరిగే అతని మంచితనాన్ని మెచ్చుకోవాలో, బుద్దావతారం అని జాలిపడాలో తేల్చుకోలేకపోయింది సుజాత. మొత్తంమీద రామకృష్ణ అంటే మాత్రం చూసిన ముందు రోజునించి సదభిప్రాయంతోపాటు రోజు రోజుకి మరేదో ఆకర్షణకూడా పెరగసాగింది సుజాతలో.
    
                                            20
    
    రంగారావుకి వారంరోజులనించి జ్వరం. మొదటి రెండు రోజులు ఆయన జ్వరం అనికూడా ఇంట్లో ఎవరితో చెప్పలేదు. తనే మందులు మింగాడు. ఇల్లు కదలకుండా ప్రక్కమీద పడుకున్న ఆయన్ని చూసి, ఇంట్లో యింతమంది వున్నా అయన యెవరితో యేం చెప్పకుండ వుండడం, సుజాతకి ఆయనపట్ల యెంత సదభిప్రాయం లేకపోయినా 'అయ్యో' అనిపించింది. మధ్యాహ్నం కల్యాణి రాంగానే ఆ విషయం చెప్పింది.
    కల్యాణి చిన్నగా నిట్టూర్చింది. "కాని.....నేనేం చెయ్యను; నా చేతి మందు ఆయన వేసుకోరు. అసలు ఆ గదిలోకి, ఆయన దగ్గిరకి వెళ్ళడానికి వీలులేదు. ఆయన దగ్గిర యేవో మందులు వుంటాయి. ఆయనా డాక్టర్ గా, నే నిచ్చేది యేముంది? ఆయనే వేసుకుంటారు" అంది కల్యాణి. కాసేపాగి యేదో ఆలోచనతట్టి...." అన్నట్టు రామకృష్ణ వున్నాడుగా యిప్పుడు, ఇంటికి రాగానే అతనితో చెప్పి గదిలోకి తీసికెళ్ళి చూపించు" అంది కల్యాణి.
    రామకృష్ణ రాగానే అతనితో రంగారావు జ్వరం చెప్పి పైకి వచ్చి ఆయన్ని చూడమంది సుజాత, రామకృష్ణ కాస్త ఆశ్చర్యంగా "మేడమ్ ఉన్నారుగా.....ఆమె చూడలేదా, నేనెందుకు" అన్నాడు. సుజాతకి యేం జవాబు చెప్పాలో తెలియదు. "మిమ్మల్ని చూడమని చెప్పరు" అంది అంతకంటే యేం చెప్పలేక.
    రామకృష్ణ అక్కడికి వచ్చి మూడు నెలలయినా అతనా యింటి విషయాల గురించి పట్టించుకున్నది యెప్పుడూ లేదు. తన పని, తన గొడవ తప్ప ఆ యింటిలో యెవరుంటున్నారో, ఏం చేస్తున్నారో, ఆ యజమానికి ఏం పనో, ఆయనెక్కడా యెందుకు కనపడడో అన్న విషయాల గురించి అసలు నెలవరకు ఆలోచించలేదు.
    అసలు రంగారావనే వ్యక్తి ఆ యింటిలో వున్నాడన్న విషయం రామకృష్ణకి తెలియడం చాలా విచిత్రంగా జరిగింది.
    ఆ రోజు డిస్పెన్సరీలో రామకృష్ణకి పని యెక్కువగా వుండటంతో ముందు కంటే భోజనానికి రావడానికి చాలా ఆలస్యం అయింది. కల్యాణి ఆ రోజు ముందు వెళ్ళిపోయింది. చాలా అలిసిపోయిం ఆకలితో, విసుగుతో యింటిలో అడుగుపెట్టిన రామకృష్ణకు ముందు వరండాలో పేము కుర్చీలో కూర్చున్న రంగారావు కనిపించాడు. రాత్రి మత్తు, హాంగోవర్ యింకా వుంది. అదోలా తలవాల్చుకు కూర్చున్నాడు రంగారావు. అతన్ని చూస్తూనే రామకృష్ణ ఒక్కక్షణం ఆగిపోయి చిరాకుగా అతన్ని చూశాడు.
    "ఓహ్!......డామ్.....ఇక్కడొక పేషంటు!....." అంటూ విసుక్కున్నాడు. రంగారావు తెల్లపోయి తలెత్తి విచిత్రంగా చూశాడు రామకృష్ణని. విస్కీ వాసన గుప్పుమని కొట్టింది. ఏహ్యంగా చూస్తూ "ఊ....ఏం రోగం తొందరగా చెప్పండి. ఏమండీ, త్రాగి యింత ఆలస్యంగా యింటికి రాకపోతే, పెందరాదే నర్సింగ్ హోమ్ కి రాకూడదూ-మా ప్రాణాలు యిలా రెండుగంటలవేళ తీయకపోతే....." అన్నాడు విసుగ్గా.
    రంగారావు ఈసారి నిర్ఘాంతపోయాడు. రామకృష్ణ విసుగ్గా చేయి అందుకొని పల్సు చూసి "వంట్లో యేం రోగములేదు, ఈ త్రాగుడు మానేస్తే అన్నీ కుదురుతాయి" అన్నాడు.
    ఆశ్చర్యంగా చూస్తున్న రామగారవుని "ఏం, డాక్టరమ్మగారు చెప్తే తప్ప నమ్మరేమిటి? నేనూ డాక్టరునే వెళ్ళండి, మీకేం రోగం లేదు" అని లోపలికి వెళ్ళబోయాడు. ఈలోగా లోపల్నించి నౌకరు కుర్రాడు వచ్చి రంగారావుని 'అయ్యగారూ, తమకు వడ్డించమంటారా?' అన్నాడు.
    ఈసారి రామకృష్ణ నిర్ఘాంతపోయాడు, "మీరు......మీరు....." అన్నాడు తడబడుతూ.
    "అయ్యగారు, బాబూ" అన్నాడు నౌకరు కుర్రాడు. అంతే! బిక్క చచ్చిపోయాడు రామకృష్ణ. రంగారావు పగలబడి నవ్వాడు. ఆ యింటిలో చాలా రోజుల తర్వాత రంగారావు నవ్వడం అదే!
    "ఇన్నాళ్ళకి యీ యింటిలో నా ఆరోగ్యం గురించి హెచ్చరించే వాళ్ళు కనిపించారన్నమాట. గుడ్, గుడ్" అంటూ లేచి నేనూ డాక్టరునేనబ్బాయ్. ఒక సలహా. త్రాగుడికి అలవాటుపడ్డ వాళ్ళని మానెయ్యమని అడుగు. అందరికీ మానెయ్యమని సలహా యివ్వకు. ఎందుకో తెలుసా! కొందరికి వ్యసనం, కొందరికి మనస్తాపం. మరిచిపోవడానికి వేసుకొనేబురఖా, సోలాంగ్ మై బాయ్" అంటూ ముందుకు నడిచి మళ్ళీ ఆగాడు. "మీ డాక్టరమ్మకి అసిస్టెంట్ ని పెట్టుకొనేటంతటి రాబడి పెరిగిందన్న మాట. బాగుంది. వెరీగుడ్, మరింకేం, మరో అయిదువందలు ఖర్చుపెట్టవచ్చన్న మాట" హుషారుగా నవ్వుతూ, వ్యంగ్యంగా అని లోపలికి వెళ్ళిపోయాడు రంగారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS