Previous Page Next Page 
ఎండమావులు పేజి 31


    పువ్వు పుట్టంగానే పరిమళిస్తుందన్న చందాన జానకిరాం ప్రతి క్లాసులోనూ ఫస్టు మార్కు తెచ్చుకుంటూ అందరి ఆదరాభిమానాలనూ చూరగొంతూ స్కూలు ఫైనలులో యూనివర్ సిటీలో ప్రథమ శ్రేణి మార్కులు తెచ్చుకున్నాడు. గోపాలశాస్త్రి మనస్సు ఆనందంతో పరవళ్ళు తొక్కింది. వీడు ఐ.ఏయస్ ఆఫీసరవుతాడని అందరితో అనేవారు. అందరిచేతా అనిపించుకుని ఆ మాటలు విని తన అభిప్రాయాలకు పందిళ్ళు వేయించుకునే వాడు. పూర్తి స్కాలర్ షిప్ తో అనర్సులో చేర్పించాడు. ఆ రోజున ఆయన ఆనందం ఆకాశవీధిలో విహరించింది. జానకిరాం కూడా ప్రతి ఏడూ ప్రథమ శ్రేణిలో వస్తూ అనర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయాడు. కృష్ణమూర్తితో మరుగుపడిన శాస్త్రిగారి పరువం మళ్ళా చిగిర్చి సువాసనలను వెదజల్లింది. పెద్ద కొడుకుతో పెళ్ళి ముచ్చట్లు తీరకపోయినా చిన్నకొడుకు పెళ్ళిలో ఆయన నిఖారుసైన వియంకుడిగా నిలబడ్డాడు. ఈ కొడుకు పెళ్ళి ఆయన హుందాత్వానికి వింజామరలు వీచింది. జానకిరాం తెలివితేటలకీ, చదువుకూ అంతా హారతులిచ్చారు. పెళ్ళిపీటల మీద కూర్చున్న జానకిరాంను ఆనంద భాష్పాల మధ్య అరమోడ్పు కన్నులతో చూస్తుంటే నిజంగా ఐ.ఏ.యస్ అధికారిలానే కనబడ్డాడు శాస్త్రిగారికి. కోడలు గౌతమికూడా అపర సరస్వతీ దేవిలానే కనిపించిందా సమయంలో.
    గౌతమి కాపురానికి వచ్చింది. విద్య విజ్ఞానం కోసమేగాని సంపాదనకు కాదన్నాడు జానకిరాం. డొక్కలో తన్నినట్లయింది శాస్త్రిగారికి. నేను ఉద్యోగం చేసి సంపాదించకపోతే పొట్ట గడవదా అన్నాడు జానకిరాం. చెంపమీద చెళ్ళున కొట్టి నట్లయింది ఆ వృద్దునికి. ఉద్యోగం చెయ్యటం కోసమే నన్ను ఇంత వరకూ చదివించారా నాన్నా అన్నాడు జానకిరాం. ముసలాయన గుండెల్లో బాకు దిగినట్లయి ఆయన విలవిల్లాడాడు. ఉద్యోగం చెయ్యకపోతే నాకీ ఇంట్లో స్థానంలేదా అమ్మా అన్నాడు జానకిరాం. కన్న తండ్రి ప్రాణం ఎగిరి పోయింది. కన్న తల్లి హృదయంలో ఏ ఆశా, ఏ కోరికా, ఏ విషయమూ మిగల్లేదు. సూన్య హృదయురాలుగానే జీవిస్తున్న దావిడ. క్రమేపీ కొడుకు ఉద్యోగం విషయం మాట్లాట్టమే మానేశారు శాస్త్రిగారు. ఒకానొక సమయంలో భార్యతో అన్నారాయన "పురిటిలోనే సంధె కొట్టి పోయినవాడు కృష్ణమూర్తి. ఎల్లకాలం మన కళ్ళముందు తిరుగుతూ ఉండే పసివాడు జానకిరాం."

 

                      
    అలాంటి కొడుకులు ఉద్యోగాలు చెయ్యక పోవటంవల్ల శాస్త్రిగారి ఉద్యోగపు కాంక్ష కోడళ్ళు తీరుస్తున్నారు. గౌతమి కూడా ఉద్యోగంలో చేరిందని వినగానే భార్యను చూసి ఆయన పేలవంగా నవ్వి కళ్ళు తుడ్చుకుని "పోనీలే కోడళ్ళ సంపాదనతో నైనా మన ప్రబుద్దులు బ్రతుకుతారు వాళ్ళు చెయ్యలేని ఉద్యోగాలు వీళ్ళు చేస్తున్నారు. అదీ ఒక చెప్పుకో తగిన విషయమే" అని అన్నారు.

                                  23

    శలవలకు మురహరి వచ్చిన ఈ వారం రోజుల్లోనూ జ్యోతి ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు. జ్యోతికి మాట్లాడాలని ఉన్నా ఆ సమయానికి సిగ్గు అడ్డుగా నిల్చేది. ఆ సిగ్గును వెనక్కు నెట్టి ఏదో ఒక మిషతో బావను పలకరించాలని అనుకున్నా జ్యోతి తల్లి అడ్డుగా వచ్చేది. మురహరి వచ్చినప్పట్నుంచి ఆమె ఎప్పుడూ కూతుర్ని కనిపెట్టుకునే ఉండేది. వాళ్ళిద్దరూ మాట్లాడుకో టానికి అవకాశాన్ని కలుగనిచ్చేది కాదు. ఇష్టా గోష్ఠి కబుర్లుగా మేనమామతో మాట్లాడే వాడు గాని, జ్యోతితో మాట్లాడాలనే అభిలాష ఎప్పుడూ మురహరికీ కలగలేదు.
    ఆ రోజున ఆర్. డి. ఓ గారింట్లో పేరంటమైతే జ్యోతి తల్లి, చెల్లెళ్ళూ వెళ్ళారు. జ్యోతికి మొదటినుంచీ పేరంటాలకు వెళ్ళే అలవాటు లేదు. కారణం ఒక్కటే. తెల్సినవాళ్ళంతా జ్యోతికి మేనరికమే చేస్తారా అని అనటం, తల్లి ఏవో సాకులు చెప్పి మేనరికం చెయ్యమని చెప్పటం పరిపాటయింది. అందువల్ల జ్యోతి పేరంటాలకు వెళ్ళటమే మానింది. కూతురికి తోడుగా పదేళ్ళ వాడిని కొడుకుని ఇంట్లో ఉండమని చెప్పి, వాడితో రహస్యంగా అక్కయ్యని బావతో మాట్లాడనివ్వ ద్దని పదే పదే హెచ్చరించి తన హెచ్చరికను పాటించటానికిగాను వాడికి కొనుక్కు తినటానికి పావలా కాసు యిచ్చి ఆవిడ పేరంటానికి వెళ్ళింది. అదే సామాన్యుల యిల్లయితే ఈ పరిస్థితులో ఆవిడా వెళ్ళడం మానేసేది. కాని, తమకన్న గొప్ప వారి ఇల్లు, తమ పై అధికారిగారిల్లు. పైగా ఆవిడ కారు పంపించింది. అంచేత వెళ్ళక తప్పింది కాదు. ఆవిడ వెళ్ళే సమయంలో మురహరి కూడా ఇంట్లో లేడు కనుక ఆవిడా ధైర్యంగానే వెళ్ళింది.
    జ్యోతి తన గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నది. తల్లి ఆజ్ఞ ప్రకారం హరనాధ్ కూడా అక్కడే ఉన్నాడు. తాసిల్దారుగారు క్యాంపు వెళ్లారు.
    "అక్కయ్యా, బావతో నువ్వు మాట్లాడకూడదా" అన్నాడు హరనాధ్.
    "ఎందుకు మాట్లాడకూడదు. మన అత్తయ్య కొడుకేగా. ఎవరన్నారు మాట్లాడగూడదని" అన్నది జ్యోతి.
    "అమ్మ చెప్పింది."
    "అట్లాగా. అమ్మకు బావంటే కోపం. వాళ్ళకు మనంత ఆస్తి, డబ్బూ లేవు. అందుకని అమ్మకు కోపం."
    "ఓస్, అదా సంగతి" అన్నాడు హరనాద్ అంతా తెలిసినవాడిలా.
    "మరెందు కనుకున్నావు."
    "నాకేం తెలుసు." అంటూ పావలా కాసు చూపించాడు.
    "అమ్మ ఇచ్చిందా."
    "అవును."
    "ఎందుకూ"
    "నువ్వు బావతో మాట్లాడకుండా చూట్టానికి."
    కన్నతల్లి అని చెప్పుకోటానిక్కూడా సిగ్గుచేటు అనుకుంది మనస్సులో జ్యోతి.
    "అందుకా నువ్వు ఇంట్లో ఉంది. లేకపోతే ఈపాటికి నువ్వు రోజూ ఇంట్లో ఉంటున్నావూ. అయినా బావ ఇంట్లో లేడుకదా, అమ్మకూ, నీకూ మతి లేకపోతే సరి." అన్నది నవ్వుతూ జ్యోతి, వాడి తలమీద చిన్నగా ఒక మొట్టికాయ వేసి.
    వాడూ నెట్టి గోక్కుంటూ "నిజమే. బావ ఉంటే కాపలా గాని, బావ లేకపోతే కాపలా ఏముంది. అట్లా వెళ్ళి ఒక రౌండు కొట్టొస్తాను" అంటూ ఉడాయించాడు. వాడి తెలివి తేటలకు నవ్వుకుని, తల్లి ఆతీరుగా ఉన్నందుకు మనస్సులో బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చుంది జ్యోతి.
    "ఈ సమయంలో బావ వస్తే బావుండును." అనుకుంది జ్యోతి మనస్సులో. తన గదిలోనుంచి వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చుంది. అయిదు నిమిషాల్లో మురహరి వచ్చాడు. వస్తూనే జ్యోతిని చూసి తలొంచుకుని తన గదిలోకి వెళ్ళాడు. ఏదో పుస్తకం తీసుకుని వెంటనే వచ్చేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళబోయాడు జ్యోతి లేచి నిల్చుంది.
    "ఎక్కడికి బావా అంతా హడావుడిగా వచ్చి వెళ్ళిపోతున్నావ్" అన్నది జ్యోతి ప్రాణాలు బిగపట్టుకుని. ఈ మాట మాట్లాడినందుకు గుండెలు దడదడలాడినయ్యి.
    "ఈ వూళ్ళో ఉన్న స్నేహితుడు ఏదో పుస్తకం కావాలంటేను తీసుకెళుతున్నా, ఇంట్లో ఎవ్వరూ లేరా."
    చెప్పింది జ్యోతి.
    "కాసేపు కూర్చుని మాట్లాడి పోతే అరిగి పోతావా." ధైర్యంగా అనేసింది.
    "ఏంలేదు జ్యోతీ, స్నేహితుడు కనిపెట్టుకు నుంటాడు. అందుకని నువ్వు మాట్లాడమంటే తప్పక మాట్లాడుతాను ఆ ఏం మాట్లాడమంటావు." ముళ్ళమీద నిల్చున్నట్లుంది మురహరికి.
    "మనస్సులో మాట్లాడాలని ఉంటే కబుర్లే దొరకవా బావా! మేనత్త, మేనమామ బిడ్డలము. కొత్తవాళ్ళం కాదుగదా, నేనంటే అంత తప్పుకు తిరుగుతావేం."
    సూటిగా, మనస్పూర్తిగా అడిగేశాననుకుంది. ఆప్యాయతా, సంతోషమూ ఆమె మాటల్లో తొణికిసలాడినయ్యి.
    "ఏం కబుర్లుంటయ్యి జ్యోతీ, కాకపోయినా నేను బీదవాడినని అత్తయ్యకు తెల్సుగా. నాతో మాట్లాడినందువల్ల ఆవిడ మనస్సు క్షోభిల్లుతుంది."
    కుండ పగలగొట్టి మాట్లాడా ననుకున్నాడు. జ్యోతి స్థానంలో జయలక్ష్మి కనిపించిందతనికళ్ళకి.
    ఇంక సంభాషణ సాగలేదు మురహరికి.
    "అమ్మను చూసి ఆవిడ ఏమైనా అనుకుంటుందనేగాని లేకపోతే మాట్లాడుదామనే అనుకుంటున్నావా బావా."
    ఈ ప్రశ్నతో బైట పడతా డనుకుంది జ్యోతి. సమాధానం చిరునవ్వుతోనో ఇచ్చి వెళ్ళిపోయాడు మురహరి. ఖిన్నురాలయింది జ్యోతి.
    మనస్సు దుఃఖంతో నిండిపోయింది. ఎంత సంతోషంతో మురహరిని పలకరించిందో అంత నిరాశతో కుప్పున కూలిపోయినట్లయింది. బావకు నేనంటే ఇష్టం లేనట్టేనా? లేక ఎవరినయినా ప్రేమించాడా? ఎంత ఆలోచించినా జ్యోతి మనస్సుకు ఏ సమాధానం దొరకలేదు.
    "ఏం చేస్తున్నావు జ్యోతీ" అంటూ వచ్చిన జయలక్ష్మిని చూసేసరికి ఈ ప్రపంచంలో పడ్డట్లయింది. జయలక్ష్మి ముఖంవైపు చూడకుండానే ఇదుగో ఒక్క నిముషంలో వచ్చేస్తా కూర్చోండి" అంటూనే వెళ్ళిపోయింది. ఏమీ అర్ధంకాక అక్కడే సోఫాలో కూర్చుంది జయలక్ష్మి. జ్యోతి సబ్బుతో ముఖం కడుక్కుని మళ్ళీ టాయిలెట్ అయి వచ్చింది. ఇప్పుడు నవ్వుతూ పలకరించింది జయ లక్ష్మిని. తన ముఖంలోని విచార రేఖలను ఎక్కడ పసికడుతుందో నని జ్యోతి భయం. అట్లా విచారంగా ఉన్నావేం జ్యోతీ అంటే తను ఏం సమాధానం చెప్పాలి. అందుకని అట్లా చేసింది.
    "ఏం జ్యోతీ ఒక్కదానివే ఏం చేస్తున్నావ్, మీ అమ్మగారు లేరా, సినిమాకు వెళదామను కున్నాను. నువ్వు కూడా వస్తావా, ఇద్దరం కలిసి స్వాతి వదినెను తీసుకుని వెళదాం" అన్నది జయ లక్ష్మి.
    "అమ్మ పేరంటానికి వెళ్ళింది. మరోసారి వెళదాంలే. ఏమిటి కబుర్లు" అన్నది జ్యోతి.
    "ఏమున్నయ్యి? శలవల్లో ఏం తోచదు. మా ఇంట్లో మా పెత్తల్లి, పెదనాన్న, జానకిరాం అన్నయ్యా ఉన్నారంటే వాళ్ళతో ఏం మాట్లాడతాను. అంతా పెద్దవాళ్ళు, పూర్వాచార పరాయణులు. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా అనిపిస్తుంది."
    "స్వాతి వదినె, కృష్ణమూర్తి అన్నయ్యా ఆ యింటికి ఎప్పుడూ వెళ్ళరేం. తల్లిదండ్రులతో పోట్లాడివచ్చేశాడా అన్నయ్య."
    జయలక్ష్మి మనస్సు ఆశ్చర్యంతో నిండిపోయింది. అసలు విషయం జ్యోతికి తెలియదు కామాలనుకుంది. తెలిస్తే అట్లా అడుగుతుందా?
    "ఆ దంపతుల సంగతి నీ కేమీ తెలీదా జ్యోతీ."
    "నా కేమీ తెలీదు. స్వాతి వదినె స్కూల్లో టీచరు. మా తమ్ముడికీ, చిన్న చెల్లెళ్ళిద్దరికీ ట్యూషను చెపుతుంది. నెలకు పాతిక రూపాయలిస్తాము. ఆవిడ మంచితనానికి, సరళ స్వభావానికి నేను లొంగిపోయినట్లుగా భావించాను. ఎందుకో వదినా అని పిలవా లనిపించింది. పిలుస్తున్నాను. అంతేగాని, వాళ్ళ చరిత్ర నాకు తెలీదు" అన్నది జ్యోతి నవ్వుతూ.
    పచ్చి వెలక్కాయ సామెతయింది జయ లక్ష్మికి. కులగోత్రాల సంగతి చెప్పితే జ్యోతి ఏమనుకుంటుందో? అకారణంగా తానీ సంగతులు చెప్పి వారి స్నేహాన్ని కలుషితం చెయ్యటం ఏం బావుంటుంది? దానివల్ల వాళ్ళ మనస్సులను పాడుచెయ్యటం తప్ప మరేమీ లేదు. అనుకుంది జయలక్ష్మి.
    "ఆలోచిస్తున్నావేం జయా, అంత చెప్పరాని రహస్యమా, అయితే చెప్పొద్దులే, పోనీ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారా? అంతే అయుంటుంది. బహుశా అన్నయ్య కట్నం లేకుండా ప్రేమించి పెళ్ళి చేసుకునుంటాడు. కట్నం పోయిందే అని పెద్దవాళ్ళ దిగులు. ఈ కలతలవల్ల విడిగా కాపురం పెట్టి, ఉంటున్నారు. అయినా స్వాతి వదినెలో ఏ లోపం చూసి మీ పెదనాన్న, పెద్దమ్మలు కోడల్ని దూరం చేసుకున్నారు" అన్నది జ్యోతి.
    "అమ్మయ్యా" అనుకుంది జయలక్ష్మి. కుల గోత్రాల ప్రమేయమే లేకుండా ఈ సమస్యను జ్యోతి తేల్చివేసినందుకు తృప్తి చెందింది. ఇట్లా చెప్పుకున్నందువల్ల తను వారి స్నేహాన్ని పాడుచేసినట్టు కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS