Previous Page Next Page 
పంచభూతాలు పేజి 27

    అపుడు పృద్వీరాజ్ "మన దేశ కావ్యాలలో స్త్రీల ఆకృతిని వర్ణించడంలో ఏదో గొప్పగా వుందనో, వర్తులంగా వుందనో వర్ణించే అవసరం యేర్పడింది. కవులు సునాయాసంగా గంభీరంగా పర్వతాలను, పృద్విని అవతరింపజేస్తారు. దీనికొక కారణంవుంది. అనావిష్కభావానికి దేశంలో పరిణామ విచారణ లేదు. ఎద్దు గంగడోలు కూడా ఎత్తుగా వుంటుంది. కాంచనగంగ శిఖరం కూడా ఎత్తుగా వుంటుంది. అందువల్ల అనావిష్ట శ్రేష్టతను  మాత్రమే తీసుకుంటే ఎద్దు గంగడోలు  కాంచన గంగతో సమానవుతుంది. కాని వర్ణనలలో కాంచనగంగ  ఉపమానం వినేసరికి కల్పనా తీరముతో హిమాలయ పర్వత శిఖరానికి అంకితమవుతుంది. పర్వతం ఎత్తు మాత్రంచూసి సర్వమూ స్పష్టంగా  గోచరిస్తుందనుకోవడం ఇనుప గుగ్గిళ్లు నమలడం లాంటిదే! పవన్ దేవ్! నీ నేటి ప్రసంగం అంతా అర్దమయింది. దానిని నేను ఖండించలేను.  అందుకని విచారిస్తున్నాను" అని అన్నాడు.
    గగన్ దేవ్ అన్నాడు: "నేను దానికి విరుద్దంగా యేమీ మాట్లాడను. పవన్ అభిప్రాయాన్ని కొంచెం సంశోధిత రూపంలో వ్యక్తీకరించడం ఉచితమని భావిస్తున్నాను, మన అంతర్జగత్తులో విహరించే వారమనేది వాస్తవం.  బాహ్యజగత్తు మనకు శక్తిశాలికాదు. మనసులో మనం సృష్టించుకున్న విషయాన్ని బాహ్యజగత్తు ఖండించి దానిని తునియలు చేయలేదు. ఖండించడం యోగ్యంకూడా కాదు. తోకచుక్క ఏదయినా  గ్రహం దోవకు  అడ్డువస్తే దాని తోకకు ఎక్కువగా  హాని కలుగుతుంది.  కాని గ్రహానికి  హాని కలుగదు. అతి నిర్భీతిగా  ముందుకు సాగిపోతూంటుంది. అలాగే బాహ్యజగత్తుతో మన అంతర్జగత్తుకు ఎపుడూ  సంపూర్ణ సంఘాతం జరగదు.  అలా జరిగితే  బాహ్యజగత్తు పరాజయం పొంది వెనుకకు తగ్గుతుంది. ఏనుగ విషయంలో ఏవిధమయిన అస్తిత్వ భ్రమ లేని వారు  గజేంద్ర గమనం ఉపమానం దాని సామర్ద్యాదులను విడిచి కేవలం నడకనే తీసుకోలేరు.  ఏనుగ తన భారీ శరీరాన్ని పెంపొందించుకుని స్థిరభావంతో కావ్యమార్గానికి ఆటంకమవుతుంది. కాని మనకు సమీపంలో గజమూలేదు గజేంద్రమూ లేదు. దాని గమనాన్ని మాత్రమే  తీసుకోవడానికి సంపూర్ణ శరీరమును విస్మరించడం ప్రత్యక్షంగా స్పష్టం కాదు."
     పృద్వీరాజ్" యిందువల్ల యే  మేరుపర్వతమును, ఏ గజేంద్రమును, ఏ మేదినిని మనం అడ్డగించలేం. కావ్యంలో జ్ఞానం రాజ్యంలో కూడా మనం బాహ్యజగత్తును గురించి ఏమీ తెలుసుకోలేం.  ఒక పోలిక జ్ఞాపకం వస్తోంది. మన సంగీతంలోని సప్తస్వరాలూ వివిధ పశుపక్ష్యాదుల కంఠ స్వరాలను  పోలుతున్నాయి. భారతీయ  సంగీత శాస్త్రంలో ఈ ప్రవాహం చిరకాలం నుంచి సాగుతూనే వుంది. నేటి వరకు మన గురువుల మనసులో దీని గురించిన  శంక కూడా కలగలేదు. కాని బాహ్యజగత్తు రాత్రింబవళ్లు దీనిని, ప్రతివాదం చేస్తున్నది. స్వరమాలలోని ప్రథమ స్వరం గాడిదస్వరం నుంచి పుట్టిందనే కల్పన ఏ బుద్దిమంతుని మస్తిష్కంలో ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం మన బుద్దికి మించిన పని,' అని అన్నాడు.
     దానిమీద గగన్ దేవ్, గ్రీసు దేశీయులను బహిర్జగత్తు ఆవిరి ఎండ మావిలాంటిది కాదు. అది దివ్య ప్రకాశమానమయినది. అందువల్ల వారు కఠోరతను ఎదుర్కొన్నారు. వారు తమ దేవీ దేవతల మూర్తులను  నేర్పుగా తయారుచేశారు. కాని వారు అలా చేయకపోతే సంసారిక  దృష్టితో వారి మనోసృష్టికి మిక్కిలి భయంకర సంఘర్షణ జరిగేది. దాని ఫలితంగా మూర్తి పూజలలో వారికి భక్తి ఆనందం  కలిగేది కాదు. మనకు  దాని భయమేమిలేదు.  మనం మన దేవతలకు ఎటువంటి  మూర్తులను  తయారుచేయ దలచామో మన కల్పనలో ఎటువంటి మతభేదం లేదు.  చతుర్బుజ, మూషిక వాహన, ఏకదంత, లంబోదర, గజాననాది మూర్తులను మనం మన మనసులలో తిలకిస్తూంటాం.  బాహ్య జగత్తులో, దాని నలుదిక్కుల స్థూలసత్యంలో  తులతూచము. బాహ్యజగత్తు మన సమీపంలో కఠినం బలిష్టంగా లేదు. అది కాల్పనికమూర్తి. దాని ఉపలక్ష్యంగా తయారుచేసి మనం మన మనోభావాలను భక్తిని జాగ్రత్తపరచుకో గలుగుతున్నాం" అని అన్నాడు.
     అపుడు పవన్, "దేనిని ఉపలక్ష్యంగా అంగీకరించి ప్రేమలేక సాధన చేస్తున్నామో, దానిని సంపూర్ణ, సౌందర్య స్వభావికతతో అలంకరించడానికి మనకు ఆవశ్యకత లేదు. సముఖంలో కరూప, వికృత మూర్తిని చూసి  కూడా మనం దాని సౌందర్యాన్ని అనుభవిస్తున్నాం.
    "మనుష్యుని గాఢ నీలిరంగును మనం  స్వాభావికంగా సుందర మయిందని చెప్పలేము. కాని మనం కృష్ణభగవానుని మూర్తిని గాఢ నీలిరంగులో చూసి సుందరంగా  ఉందని తల పోస్తున్నాం. దాని సౌందర్యం అనుభవించడానికి మనమేమీ చేయడం లేదు. బాహ్య ప్రపంచ ఆదర్శాన్ని ఇచ్చానుసారం మరుగునపరచలేనివారు తమ మనో సౌందర్య భావానికి యే మూర్తి రూపాన్ని తయారుచేయనారంభిస్తాడో వారు ఏదో విధంగా దానిలో అస్వబావికంగా కలగాపులగం చేయలేరు. గ్రీసు దేశస్తుల దృష్టిలో ఈ నీలిరంగు భయంకరమయినది" అని అన్నాడు.
     దానిమీద గగన్ దేవ్, "మనదేశ ప్రకృతి విశేషతకు ఉన్నత తరగతి కళలకు ఆటంకం కలుగుతాయి. ప్రేమ, భక్తి స్నేహం. ఇంత వరకు సౌందర్య భోగంకోసం కూడా మనం బాహ్య ప్రపంచానికి దాసులం కాలేదు, సౌలభ్యం, అవసరాలకోసం ఎదురు చూస్తూ కూర్చోలేదు.  భారతీయ స్త్రీ తన భర్తను  దైవసమానంగా  భావించుకుంటుంది. విధిగా పూజిస్తుంది. కాని ఆమెలో భక్తిభావం జనిపంచేయడానికి భర్తలో దేవతాగుణాలు  వుండనవసరం లేదు. ఇంతవరకు భర్త మూర్ఖుడయినా అతనిని పూజించడం నిర్విఘ్నంగా సాగుతూనే వుంది. స్త్రీ తనకు  ఇష్టం కాకపోయినా భర్తను  వేదభావంతో పూజిస్తుంది. ఒక భావ ప్రబలతతో ఇంకో  నశించిపోదు. మనలోని  ప్రపంచంతో బాహ్య ప్రపంచ సంఘాతం ప్రబలంగా జరగదు" అని అన్నాడు.
     ఇక పవన్ దేవ్, "కేవలం పతియే దేవుడేమిటి? మన  పౌరాణిక దేవీదేవతలను  గురించి కూడా రెండు విభిన్న భావాలున్నాయి. అవి  సౌభ్రాతృత్వంలో ఒకదాని నొకటి దూరంగా తోసివేసుకోలేవు. మన దేవతలను గురించిన పౌరాణిక గాధలను మన ధర్మబుద్ది వాటిని సమర్దించి నంతవరకు మన సాహిత్యం సంగీతాలలో దేవతల నిందిస్తూ  ఉల్లేఖించడం పరిహాసపాత్రమయింది.  అందువల్ల భక్తి లేదనడానికి వీల్లేదు. ఆవు జంతువని మనకు తెలుసు. దాని మహత్తును పూజిస్తాం. కాని పొలంలో పడితే కర్రతీసుకుని తోలివేస్తాం. గోశాలలో పేడలో నిలబెడతాం. భగవతీ అని పూజించే సమయంలో మాత్రం ఈ విషయాలు జ్ఞాపకం రావు" అని అన్నాడు.
    పృద్వీరాజ్ అన్నాడు, ఇంకో గొప్ప విషయం వుంది. మనం యెల్లప్పుడూ శ్రావ్యమయిన కంఠస్వరం లేనివానిని గాడిదతో పోలుస్తుంటాము. గాడిదలో సంగీతశాస్త్రంలోని ప్రధమస్వరం చిక్కుతుందని అంటాం. ఇలా అనేటపుడు మనం పొరబడుతూంటాం. పైగా దాని ధ్యానమే వుండదు.  కాని ఇలా అనవలసిన అవసరమూలేదు. మనలో ఒక విచిత్రశక్తి వుంది. కాని యీ విశేష శక్తి సహాయం తీసుకుని గగన్ దేవ్ తర్కించిన సౌలభ్యం నాకు అర్దంకాలేదు. మనలో కాల్పనిక, సృష్టిని పెంపొందించుకునే శక్తి వుంది. అందువల్ల మనలో జ్ఞానలాబం, అర్దలాభం, సౌందర్యాను భూతులను గురించిన ఉదాశీనతా సూచిక సంతోషభావం లభిస్తుంది. మనం యేవస్తువును విశేషంగా అనుభవించం.  ఐరోపాలోని విద్వాంసులు తమ వైజ్ఞానిక అంచనాలను నిక్కచ్చిగా వేయి సార్లు పరీక్షించినా వారికి అనుమానాలు తీరవు. మనం మనసులో విశేష సంఘటితాబిప్రాయాలను నిలబెట్టుకున్నప్పుడు, వాటి శోభ మనదగ్గరి సర్వమూ కంటే ఎక్కువ ప్రామాణికమయిందని తెలుస్తుంది. మనం దానిని బాహ్య ప్రపంచంలో పరీక్షించడానికి చూసే  ఆవశ్యకత లేదని తేలుతుంది. జ్ఞానవృత్తిలో ఘటించే విషయాలు  హృదయవృత్తిలో కూడా  ఘటిస్తాయి. సౌందర్యరస చర్చ చేయాలనే అభిలాష వుంటుంది. కాని యీ ఉద్దేశ్యంలో యత్నించడంతో పాటు మనసు ఆదర్శాన్ని బయటి ప్రపంచంలో సృష్టించి యేకరూపం గోచరింపజేయడానికి అవసరం లేదనే భావిస్తారు. మంచి చెడ్డలను సిద్దించడంలో మనం మనుష్యుల మవుతాం.  దేవతలం కావడానికి, సౌందర్యాదర్శాన్ని సరిగా సృష్టించడానికి ప్రయత్నించం. భక్తిరస చర్చచేయాలని అభిలషిస్తాం. కాని యదార్దభక్తి పాత్రను వెదకి  వెలికి దీయడానికి యత్నించడం. దాని అవసరాన్ని తెలుసుకోము"
    పవన్ దేవ్, "ఆంగ్ల శిక్షణ ప్రభావం వల్ల మనం ఈ నియమాలను భంగపరుస్తున్నాం. బంకించంద్రుని  కృష్ణచరిత్ర దానికి మంచి ఉదాహరణ.  బంకిం కృష్ణపూజ చేయడానికి  దానిని ప్రచారం చేయడానికి ముందుగానే దానిని స్వచ్చంగా, సుందరంగా సృష్టించడానికి యత్నించాడు. ఇంతవరకు కృష్ణచరిత్రలోని అప్రాకృతిక విషయాలెన్నున్నాయో వాటన్నింటినీ యిచ్చాడు.  వాటిని సమర్దించలేదు. దేవతలకు దోషం అంటదు.  తేజస్వికి సర్వదోషాలు పరిహారమవుతాయి. వారు ఒక నూతన అసంతోష రచన చేశారు. పూజచేయడానికి ముందుగా దేవతలను పరిశీలించారు. ఎదుట లభించిన విషయాలను తీసుకుని తలవంచి  పూజించలేదు" అని అన్నాడు.
    పృధ్వీరాజ్ అన్నాడు,"అసంతోష అభావంలో చిరకాలం నుంచి మన సమాజంలో పూజ్యులు ఉన్నతి చెందడానికి, దేవతలు దేవతలు కావడానికి మూర్తి బావానికి అనురూప పరివర్తనానికి ఆవశ్యకం కలుగలేదు. బ్రాహ్మణున్ని  కన్నుమూసుకుని దేవతగా భావిస్తాం. అందువల్ల అతను ఏపనీ చేయకపోయినా పూజలందుకుంటున్నాడు. అనాయాసంగానే మనకు భక్తివృత్తి చరితార్దమవుతుంది. సౌందర్యాన్ని అనుభవించడానికి సుందరమయిన వస్తువులు అవసరంలేదు. ఆ విధమయిన అతి సంతోషస్థితిని మనం సులభంగా అర్దం చేసుకోలేం. ఇందువల్ల సమాజానికి మాత్రమే శ్రీహీనత, దీనత, అవనతికి ఆశ్రయం  లబిస్తుంది. కాని బాహ్య జగత్తును ఉత్తరోత్తరా మరుగుపరచడానికి  మనో ప్రపంచానికి  అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యం యిస్తే అజ్ఞానత అనిపించుకుంటుంది. కూర్చున్న చెట్టుకొమ్మను నరికినట్లవుతుంది."                          


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS