Previous Page Next Page 
పంచభూతాలు పేజి 25

  పురుష సభ్యమండలి ఈ నవ్వుచూసి ఆశ్చర్యపోయారు. కాని పవన్ దేవ్ గంభీరంగా, "గగన్ మహారాజా! చాలారోజులు గడిచాయి. ఇక యిపుడు ఈ విలాస నాగబపంధనం విప్పితే ఆరోగ్యానికేమీ హానిరాదు"అని అన్నాడు.
     పృద్వీరాజ్, గగన్ దేవ్ లాఠీ తీసుకుని చాలాసేపు దానికేసి తేరిపార జూస్తూ, "గగన్! నీ లాఠీ సుఖాంత విషయమా: లేక దుఃఖాంత సాధనమా?" అని అడిగాడు.

                       కౌతుక హాస్య పరిణామం

  ఆనాటి డైరీలో  మా కౌతుక హాస్య విషయ సమాలోచన చదివి ప్రకాశవతి ఇలా వ్రాసింది: "ఒకరోజు ప్రాతః కాలంలో నేనూ, నిర్ఘరిణి కలసి పక పకా నవ్వసాగాం. ఆ ప్రాతఃకాలమే మనోహరం. మా ఇద్దరి నవ్వు అధ్బుతం! ఆదికాలం నుంచి నేటివరకు చంచలత అనేక మంది స్త్రీలలో వెల్లడయింది. ఇతిహాసంలో దాని మంచి చెడ్డ ఫలితాలు అనేక రూపాలలో స్థాయిని పొందాయి. స్త్రీ నవ్వు అకారణం కావచ్చు. కాని దాని నుంచి మందాక్రాంత శార్దూల విక్రీడత, త్రిపది, చతుష్పది, చతుర్దశపది మొదలయిన అనేక ఛందస్సులు ఉత్పన్నమైనాయి. దీనికి అనేక ప్రమాణాలు లబిస్తాయి. స్త్రీ సరళ స్వభావ కారణాన అనాయాసంగా నవ్వుతుంది.  దానినిచూచి అనేకమంది పురుషులు దుఃకిస్తారు. అనేక మంది పురుషులు మెడలో రాయికట్టుకుని నీటిలో మునిగి చస్తారు. మరి కొందరు పదాలు రచించడానికి పూనుకుంటారు. ఈసారి నాకొక కొత్త అనుభవమయింది. దార్శినికుల మస్తిష్కం నుంచి దర్శనాలు పొంగి పొర్లుతాయి. కాని నిజం చెప్పాలంటే తత్వ నిర్ణయంకంటె త్రివిధావస్థలే మంచివి" ఇంతవరకు వ్రాసి ప్రకాశవతి ఆ రోజున మా హాస్య విషయక సిద్దాంతాన్ని యుక్తిహీన అప్రమాణికమని నిర్దరించింది.
    నా మొదటి మాట ఏమంటే - ఆ రోజున మావాదన తత్వంలో యుక్తి ప్రాబల్యం లేదు. అందుకని ప్రకాశవతి కుపితురాలవడం తధ్యం. నారీ హాస్యంతో ధరణిమీద ఎన్నో అనర్దకాలు దాపరిస్తాయి. బుద్ది మంతులకు బుద్ది భ్రంశన కలుగుతుంది. ఏ దశలో నా దర్శన ప్రలాపం చేరుకుంటుందో ఆ దశలో నేను కావాలంటే కవిత వ్రాస్తూ కూర్చోగలను. మెడకు వురిపోసుకుని చావడం అసంభవమూ కాదు.  రెండవది గ్రహిస్తే దాని కల్పన చేసేవారు కాదు. తత్వాలోచన నుంచి యుక్తిని వెదకి బయటకు తీసే పనిచేసేవారు కాదు.
     ఆజన్మ తత్వాన్వేషణ చేసిన తరువాత న్యూటన్ అన్నాడు: "నేను జ్ఞానరూప సముద్ర తీరాన కేవలం కంకర రాళ్ళను పోగు పెట్టాను. మేం నలుగురు బుద్దిమంతులం కలిసి క్షణకాలం సంభాషణలో కంకరరాళ్లు కుప్పపెట్టే ఆశ కూడా పెట్టుకోలేదు. మేము కేవలం యిసక గూడు కట్టుకోదలచాం.  దీనిని కట్టడానికి జ్ఞానరూప సముద్ర  తీరానికి వెళ్లి సముద్ర వాయువును సేవించి వస్తాం, అంతే. ఇదే మా తత్వాలోచన ఉద్దేశం. రత్నాలు తెచ్చుకోవడానికి కాదు, స్వాస్థ్యం కోసం వెళ్ళడం. దీనిని మించి మేము ఎన్నడూ ఈ విషయం ఆలోచించలేదు. ఇసుక గూడు వుండినా ఊడినా, నష్టం లేదు.
     రత్నాలకంటె స్వాస్త్యం తక్కువ విలువయినదని  నేను అంగీకరించను. అనేక సమయాలలో రత్నాలు నకిలీవని రుజువవుతుంది. కాని స్వాస్థ్యమును స్వాస్థ్యమనక తప్పదు. మేము పాంచ బౌతిక సభలో పంచ సదస్యులమూకలిసి నేటివరకు మామూలు సిద్దాంతానికి చేరుకున్నామా అని సందేహిస్తున్నాను. మేము మాసభలో కూర్చన్నన్ని  పర్యాయాలూ మా చేతన సక్తీ, మనోవృత్తి చంచలించాయి. కాని వాటి వల్ల మాకు ఆనందం ఆరామం లబించాయనడంలో సందేహం లేదు. ఈ ఆనంద కారణం వల్ల శూన్యహస్తాలతో యింటికి తిరిగి వెళుతున్నామనే విచారం ఒక్కసారిగా దూరమయేది.
     కోట మైదానంలో గిద్దెడు ధాన్యం పండదు. అయినప్పటికీ భూమి నిరర్దకం కాదు. మా పాంఛభౌతిక సభ కూడా అయిదుగురి కోట మైదానం. అక్కడకు మేము సత్యసస్యం పండించడానికి వెళ్ళడం లేదు. కానిసత్యానందం అనుభవించడానికి వెళుతున్నాం.
     అందువల్ల ఈ సభలో ఏ విషయం మీద పూర్తిగా మీమాంస జరిగిపోయినా నష్టం లేదు. సత్యాంశ కొద్దో, గొప్పో లబిస్తే చాలు; పని గడిచిపోతుంది. సత్య క్షేత్రంలో లోతుగా దున్నకుండా వానిమీద తేలికగా అడుగులు వేస్తూ వెళ్లడమే మా ఉద్దేశ్యం.
    ఇంకా, మరోవేపు నుంచి వేరొక ఉదాహరణ తీసుకుని కూడా ఈ విషయం స్పష్టం చేయదలచాను. రోగికి డాక్టరు మందు బాగా ఉపకారం చేస్తుంది. కాని స్వజనులు చేసే సేవ వల్ల రోగికి విశ్రాంతి చేకూరుతుంది. జర్మన్ విద్వాంసుల గ్రంథాలలో తత్వజ్ఞానం, చరమ సిద్దాంతాలు వున్నాయి. అవి ఔషధ మాత్రలు లాంటివి. కాని వాటిల్లో మానసిక శుశ్రూష ఏ మాత్రమూలేదు.పాంచభౌతిక సభలో మేము సమాలోచన చేసే సత్యం రోగ చికిత్స కాదు, రోగికి శుశ్రూష.
     ఇపుడు ఇంకా అధికంగా ఉపమానాలు చెప్పవలసిన అవసరం లేదు. మేము  నలుగురు విజ్ఞానులం కలసి హాస్యాన్ని గురించి వాదించుకున్న రోజున సర్వం ముగియలేదు. ముగింపు కోసం యత్నించే మా కథోపకథ సిద్దాంత ఉల్లంఘన కథోపకధనం సభయొక్క ముఖ్య నియమం. సహజంగా, వేగంగా అగ్రసరుల కావడం అంటే మానసికంగా దౌడు తీయడం. మా పాదాలకు తాళాలు లేవు. పిల్లలకు లాగా మా రెండు  పాదాలు మొనతేలి వుంటే మట్టిలో లోతుగా గుచ్చుకుని ఒక అడుగయినా ముందుకు వేయలేక పోయేవాళ్లం. కధోపకథన సభలో మేము ప్రత్యేక విషయాలను లోతుగా పరిశీలించసాగితే  ఒక చోటనే వివశులమయి ఆగిపోవలసి వచ్చేది. నడుస్తూ, నడుస్తూ మేము అడుగులోకి జారిపడే అవస్థ అపుడపుడూ తటస్థిస్తూంటుంది. అక్కడ అడుగు అపసవ్యముగా వేస్తే  జారిపోతాం. నడవడం కష్టమవుతుంది. అనేక విషయాలలో ఇలాగే జరుగుతూంటుంది. ఈ విషయం ఆలోచించే సమయంలో ప్రతిక్షణం పాదం భద్రంగా వేయాలి. కథోపకధన సమయంలో అటువంటి అనిశ్చిత సందేహ విషయాలలో అడుగు పెట్టక పోవడం మంచిది. ఈ ప్రదేశం పర్యటించే సభ్య జనులకు ఉపయోగించదు. వ్యవసాయదారులకు ఉపయుక్తమయినది.
     ఏమయినప్పటికీ యదార్దానికి ఆ రోజు ప్రశ్నకు సమాధానం ఇది: దుఃఖానికి ఏడుపులాంటిదే సుఖానికి హాసం. కాని మధ్యలో కౌతుక హాసం యెక్కడి నించి వచ్చిందో? కౌతుకం రహస్య పూర్ణ వస్తువు. జంతువులు కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి. అలంకార శాస్త్రంలో చర్చించిన రసాలన్నీ జంతువుల అపరిణిత, అపిరష్కృత సాహిత్యంలో లభిస్తాయి. కేవలం హాస్యరంస మాత్రమే లబించదు. కోతుల స్వభావంలో ఈ రసాభాస కొద్దికొద్దిగా కనిపిస్తుంది. వానరులకూ, నరులకూ అనేక విషయాలలో సామ్యం వుంది.
     అసంగత ప్రవర్తన వల్ల మనుష్యులకు దుఃఖం ప్రాప్తిస్తుంది. అందులో నవ్వే అవసరం లేదు. వెనక కుర్చీ లేనపుడు కుర్చీమీద కూర్చోబోయి నేలమీద పడిపోతే చూచేవారికి సుఖం లభించే యుక్తి యుక్త కారణం కనిపించదు. ఇందులో ఏమీ అత్యుక్తి లేదు. కౌతుక పరిణామంలోనే అటువంటి దుఃఖం వుంటుంది. మనుష్యునికి సుఖం లేక పోతే దుఃఖం లభిస్తుంది.
       మేము ఆ రోజున సంభాషణలో దీనికి కారణం నిర్దారించాం. కౌతుకహాసం, ఆమోద ప్రమోదహాసం ఒకే శ్రేణికి చెందినవి. రెండింటిలోను హాస్యం ప్రబలంగా వుంటుంది. అందువల్ల ఆమోద కౌతుకాలలో స్వాభావిక ఐక్యత కలదేమోనని నాకు సందేహం కలుగుతోంది. దానిని బహిరంగ పర్చడంవల్ల కౌతుక రహస్యాలను విభేదించవచ్చును.
     మామూలుగా దుఃఖానికీ ఆమోదానికి కొంత భేదం వుంది. నియమభంగంవల్ల కలిగే భాధోద్రేకం బాధగాదు.  దానిని ఆమోదం అనలేము. ఆమోదం నిత్యనైమిత్తిక సహజ నియమ సంగతం కాదు. అది ఒక్కొక్క రోజున వస్తూంటుంది. దాని ఉద్రేకం కోసం యత్నించవలసి వుంటుంది. ఆ బాధ, యత్నం సంఘర్షణ  పడడంవల్ల మనసులో ఒక విధమయిన ఉత్తేజన కలుగుతుంది. అదే ఆమోద మూల సాధన.
     కౌతుకంలో కూడా నియమభంగ జనిత బాధ వుందని మనం అంటుంటాం. ఆ బాధ అత్యధిక పరిమాణంలో లేకపోతే మన మనసులో, ఆకస్మిక ఉత్తేజంవల్ల నవ్వకుండా వుండలేం. సుసంగతమయిన వ్యవహారం సధా  విషయ సంగతమయి వుంటుంది కొద్దిగా నయినా దానికి నియమభంగ మవుతుంది. యధాసమయంలో యధా స్థానంలో సకల ఘటనలూ నియమానుసారం జరిగితే మనసులో ఏ విధమయిన ఉత్తేజనం కలగదు. కాని ఘటనలు ఆకస్మికమయిన వయినా, కాకపోయినా యింకోవిధంగా  ఆకస్మిక క్షణిక బాధవల్ల మనసుకు ఒకవిధమయిన చైతన్యానుభూతి కలుగుతుంది. ఈ కారణంగా మనం నవ్వుతాం. ఆరోజున మేము యింతవరకు సాగిపోయాం. కాని ముందుకు యింకా సాగిపోలేమని చెప్పలేము. ఇపుడు యింకా ఎంతో చెప్పగలం.
     శ్రీమతి ప్రకాశవతి "మన నలుగురు పండితుల సిద్దాంతం సత్య మయిందయితే నడుస్తుండటగా యెదురు దెబ్బ తగిలితే లేక కొంచెం దుర్వాసన తగిలితే నవ్వు వస్తుంది. ఉత్తేజజనిత సుఖం తప్పకుండా అనుభవించాలి గదా" అని అన్నది.
     ఈ ప్రశ్న ద్వారా మా మీమాంసను ఖండించలేదు. ఇంకా సీమాబద్దమయింది.భాధా పరిమాణం వల్లనే కౌతుక జనక ఉత్తేజం జనించదనీ ఈ ప్రశ్నవల్ల రుజువయింది. అందువల్ల కౌతుక పీడనకు ముఖ్య సాధన మేమిటో పరిశీలించాలి.
     జడప్రకృతిలో కరుణరసం లేనేలేదు. హాస్య రసం కూడాలేదు.ఒక పెద్దరాయి చిన్నరాయి మీద పడి చూర్ణం చేసినా కూడా మనకు దయ రాదు.  సమతలక్షేత్రంలో నడుస్తూ, నడుస్తూ మనం వికార పర్వత శృంగం చూస్తే నవ్వురాదు.
     నదీనదాలలో, పర్వతాలలో, సముద్రాలలో అపుడపుడు ఆకస్మికంగా అసామాంజస్యం గోచరిస్తుంది. ఈ బాధాజనక, పిడాజనక, విరక్తిజనకం కావచ్చుగాని కౌతుక జనకం కాదు. సచేతన పదార్ద సంబంధమయిన అసంగత ఘటనలో తప్ప కేవలం జడపదార్దాలవల్ల  మనకు నవ్వురాదు. నవ్వురాని కారణం చెప్పడం కష్టం. కాని ఆలోచించి చూడడంలో హాని యేముందు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS