అంతర్దాహం
---దోనేపూడి రాజారావు
విఠల్ గేటుదగ్గర నిలబడి బంగళావంక ఎగాదిగా చూస్తున్నాడు. ఆ బంగళాలో మనుషులెవరూ కనబడలేదు. ఆ బంగళా నలువైపులా ఘెరావ్ చేసినట్లుగా పెద్ద గార్డెన్ చూడముచ్చటగా వుంది. పిల్లప్రేవుల్లా వంకరటింకరగా ఆ గార్డెన్ నుంచి బంగళాకి అనేకి దార్లున్నాయి. ఆ బంగళావంక చూస్తూనే పదినిముషాలుస గడిచిపోయింది విఠల్ కి.
ఇంతలో గేట్ కీపర్ కాకీదుస్తుల్లో, చేత కర్ర ఒకటి పట్టుకొని, అతను నేపాలీవాడనుకుంటాను తెల్లగా పాలిపోయిన వాడిలా వున్నాడు, వచ్చి లోపల గేటుదగ్గర నిలబడ్డాడు. అతను విఠల్ని ఎగాదిగా చూశాడు 'ఎప్పుడూ రాలేదే! ఎవరా ఇతను' అని.
'నేను బాబాయిగార్ని కలుసుకోవాలి.' గేటు తియ్యిమన్నట్టుగా అడిగాడు విఠల్.
'బాబాయిగారా?' అర్దంకాని దృష్టితో మళ్లీ అడుగుతున్నట్టుగా విఠల్ వంక చూశాడు గేటుకీపర్.
'ఇంతకూ బాబాయిగారు లోపల లేరా?' మళ్ళీ ఆతృతగా అడిగాడు విఠల్.
'బాబాయిగారా? బాబాయిగారంటూ ఇక్కడ ఎవరూలేరు!' విసుక్కొన్నట్లుగా విఠల్ వంక చూచి వెనక్కు తిరిగాడు గేట్ కీపర్.
'అదే! శివరాంప్రసాద్ జమిందార్ గారు!' అంటూ గట్టిగా అన్నాడు విఠల్.
ఆ మాట వినగానే గేట్ కీపర్ సంతోషంతో ముఖం ఇంత చేసుకొని తిరిగొచ్చి గేటు తాళం తీశాడు విఠల్ చేతిలోవున్స సూట్ కేస్, టిఫిన్ క్యారియర్ తాను తీసుకున్నాడు.
ఇంతలో గేటుతీస్తున్న చప్పుడువిని బంగళానుంచి ఓ నౌకరు హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు. గేట్ కీపర్ ఆ సామానులు అతని చేతికి ఇచ్చాడు. అతను విఠల్ ను శివ రాంప్రసాద్ వద్దకు తీసికెళ్లడు.
శివరామప్రసాద్ ఆ గార్డెన్లో ఓ మూల గార్డెన్ చైర్ లో పడుకొని ఏదో ఇంగ్లీషుపుస్తకం చేత పట్టుకొని ఆకాశం కేసి చూస్తూ పరధ్యానంలో వున్నాడు. ఉండుండి సిగరెట్ దమ్ము వేసుకొంటున్నాడు.
'సార్! సార్! సార్!' అంటూ నౌకర్ శివరామ ప్రసాద్ ని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు.
అటు తిరిగి వున్న శివరామప్రసాద్ నెమ్మదిగా ఇటు తిరిగి విఠల్ వంక తదేకంగా చూశాడు. అతణ్ణి తానెప్పుడూ చూడలేదు. కాకీపాంటు వేసుకొని వైట్ లాంక్లాత్ చొక్కా తొడుక్కొని వున్నాడు. కాళ్ళకు మామూలు చెప్పులు వున్నాయి. చొక్కా నలిగుంది. వచ్చీరాని మీసం, గడ్డం, ఓ పద్దెనిమిదేళ్లు వుంటాయి. పేదవాడుగా కన్పిస్తున్నా ముక్కూ, ముఖంలో జమిందారు పోలికలు కనిపించాయి శివరామప్రసాద్ కి. అలాగే క్షణాలు తీవ్రంగా చూశాడు విఠల్ ని.
విఠల్ ఆ చూపు భరించలేక పోయాడు. భయపడ్డాడు. అయినా తానూ తదేకంగా చూశాడు శివరామ్ ప్రసాద్ ను. శివరాంప్రసాద్ మిరపకాయల్లాంటి మీసాలు, పెసరకాయల్లాంటి పెదవులు, కందికాయల్లాంటి కనుబొమలు, ఆ బోడి తలకు చుట్టూ కట్టకట్టిన నలుపూ తెలుపూ కలిసున్న అతని వెంట్రుకలు - ఇవన్నీ కలుపుకొని మొత్తంగా చూస్తే యస్వీ రంగారావులా కన్పించాడు విఠల్ కి. అంత బొద్దుగా, దబ్బపండులా వున్న శివరామ్ ప్రసాద్ ని చూడగానే గౌరవభావం ఏర్పడింది విఠల్ కి ఆ చూపుల పోటీలో విఠల్ నిలవలేక పోయాడు. తలదించేసుకుని పక్కకు చూశాడు.
విఠల్ అలా ప్రక్కకు చూడ్డంచూసి శివరాంప్రసాద్ పిచ్చివాడిలా పకపకా నవ్వాడు, ఆ నవ్వు చూసి మళ్లీ భయపడ్డాడు విఠల్ చేతిలోవున్న సిగరెట్ ని యాష్ ట్రే మీద పెట్టాడు. రెండో చేతిలోవున్న పుస్తకాన్ని మూసివేశాడు శిరాంప్రసాద్.
'సిడౌన్! సిడౌన్!' అంటూ పక్కనున్న కుర్చీ చూపించాడు విఠల్ కి. తానూ లేచి సరిగా కూర్చున్నాడు.
విఠల్ కి శివరాంప్రసాద్ ఆజ్ఞను శిరసావహించాడు. అదిచూసి నౌకర్ సూట్ కేసు. టిఫిన్ క్యారియర్ విఠల్ కు ప్రక్కగా పెట్టి వెళ్లిపోయాడు.
'ఎవరు బాబూ నువ్వు? నిన్నెక్కడ చూసినట్లు లేదే? ఇందాక అందుకే అంతసేపు చూశాను అడక్కుండానే తెలుసుకుందామని! కానీ అంతుపట్టలేదు!' అంటూ మరొకసారి నవ్వాడు.
'నేను విఠల్ని! విశ్వేశ్వర్రావుగారి అబ్బాయిని! సీతాదేవిగారి మనవడ్ని! కాకినాడనుంచి వచ్చాను!'
'నువ్వు విశ్వేశ్వరరావు కొడుకువా? సీతాదేవి మనవడివా? నిజమేనా? అంటూ హడావుడిగా కుర్చీలోంచి లేచొచ్చి వణికిపోతూ విఠల్ భుజాలమీద గట్టిగా చేతులు వాల్చాడు! కళ్లల్లోకి మళ్లీ మళ్లీ తదేకంగా చూశాడు. విఠల్ ఏదో అబద్దం చెప్తున్నట్లుగా అనుమానించాడు.
'బాబాయిగారూ! నేను అబద్దం ఆడటంలేదు!' అంటూ విఠల్ గబాల్న లేచాడు.
'సిడౌన్ మేన్? సిడౌన్! నువ్వు నన్ను బాబాయని పిలుస్తున్నావా? ఇప్పటికి ఇరవైనాలుగేళ్లనాటి పిలుపది! మళ్ళీ ఈనాడు నీ నోట విన్నాను!' ఆనందంతో అతని ఒళ్ళు ఒకటికి నాలుగుసార్లు పులకించ విఠల్ని దగ్గరకు తీసుకొని గట్టిగా కౌగలించుకొన్నాడు. బొటాబొటా కన్నీళ్ళు కారుస్తూ వెళ్లి తన గార్డెన్ చైర్లో జారిగిలబడ్డాడు.
'మీ నాన్నా నన్ను బాబాయనే పిల్చేవాడు!' అంటూ పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు.
విఠల్ కి ఆయన్నిచూసి జాలివేసింది. తానూ ఆయనకి దగ్గరగా కుర్చీలో కూర్చున్నాడు.
కొద్దిక్షణాలకి తిరిగి స్వీయధ్యానం లోకి వచ్చేశాడు శివరాంప్రసాద్.
'పోతురాజూ! పోతురాజూ!' అంటూ నౌకర్ని గట్టిగా పిలిచాడు శివరాంప్రసాద్. వాడు రెప్పపాటులో వచ్చి నిలబడ్డాడు.
'ఈ సామాను తీసికెళ్లి నా గదిలో పెట్టు! ఇదిగో నా మంచం ప్రక్కన ఈయనక్కూడా మంచం వేయి. అక్కడే పడుకొంటాడు! ముందు వేణ్ణీళ్ళు పెట్టు! స్నానం చేస్తాడు!'
ఆ మాటలు వినీ వినడంతోనే పోతురాజు సామాను తీసుకువెళ్లాడు. శివరాంప్రసాద్ తన కుర్చీని విఠల్ కుర్చీకి దగ్గరగా లాక్కొని విఠల్ చెయ్యి తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసికొన్నాడు. శివరాంప్రసాద్ చేతుల స్పర్శ తగిలి విఠల్ ఆత్మీయంగా ఫీలయ్యాడు.
'నువ్విలా సన్నగా వున్నావేమిటి? ఈ వయసులో మీనాన్న దుత్తలా గట్టిగా వుండేవాడు. ఇప్పుడు నీకెన్నేళ్లు బాబూ!'
'పందొమ్మిదో సంవత్సరం జరుగుతోంది!'
'అయితే నువ్వింకా కుర్రవాడివే! అలా సిగ్గుపడుతా వెందుకు? భయమెందుకు? మీనాన్న ఎంత ధైర్యస్థుడని! మీరు బ్రదర్సెందుకు బాబూ? అంటూ ఒకదాని తర్వాతొకటి అంతులేకుండా అడిగాడు శివరాంప్రసాద్.
'మా నాన్నకు నేనొక్కడ్నే!'
'అలాగా! మీనాన్న ఒక్కడే! ఆయనేం చేస్తున్నాడిప్పుడు?ఎంతో దాహంతో అడిగాడు శివరాంప్రసాద్.
'ఆయన లేడు సార్! నా అయిదో ఏటే చనిపోయాడు! మా మదర్ కూడా లాస్టియర్ చనిపోయింది. ఇక నాకు మిగిలింది మా నాయనమ్మ సీతాదేవి వొక్కతే?'
'అబ్బ! ఏం చావుకబుర్లు చెబుతున్నావయ్యా!' అంటూ బాధపడ్డాడు. గుండె బరువెక్కింది. అమితంగా ఆయాసపడ్డాడు, కుర్చీకి అంటుకుపోయాడు. అదిచూసి విఠల్ భయపడ్డాడు. ఆయన భుజం పట్టుకొని కదిలించి చూశాడు. 'బాబాయ్! బాబాయ్! ఏమిటలా అయిపోయారు!'
