c.v.v.
నమస్కారము
ప్రజ్ఞా ప్రభాకరము
శ్రీ నిరంత రానందని శ్రేయసార్ధ
సాధకము, సర్వకిల్బిషబాధకము, స
మగ్రవిజ్ఞానదము, మహామహిమఘనము
శరణ మగు మాకు సద్గురుచరణయుగము.
౧
ఉపక్రమము
సత్యజ్ఞానందాత్మకమగు పరతత్త్వము తత్ప్రుతి కూలగతితో అవివేకజీర్ణారణ్యమున జిక్కి చీకాకు పడుచున్న యనదును నన్ను త్రోవకు దెచ్చి కాపాడిన తీరును మిత్రగోష్టిలో విన్నవించుకొనుటకొఱ కే నా యీ గ్రంధ రచన ప్రయత్నము. దీని రచనమున నాకు పురుషోత్తముఁ డగు గాంధి స్వచరిత్ర రచనావిధానము దారిదివ్వె. గులాబి మొగ్గను గడుపునఁ బెట్టుకొని దాని గ్రంముకొని కఱకు నూగు తొడిమ ఱేకేతొలుత గాన వచ్చినట్టుగా ఉపక్రమమున నిందు ప్రభాకర నామకుఁడ నగు నేనే కానవత్తును గాని, నాలోని దివ్య తత్త్వపుఁ బూవు వికాసము చెందిన పిదప, నది సువాసనను సౌకుమార్యమును వన్నెలను వెలార్పఁ జొచ్చిన పిదప, దాని గొని యానందింపఁ గోరువారికి నేను తత్ప్రుదర్శకుడనుగానే, యంగుళీగ్రాహ్య మగు తొడిమను గానే యడుగునఁ బడి యుండి కానవత్తును. అప్పుడిది ప్రజ్ఞా చరిత్రమే కాని ప్రభాకర చరిత్రము గాదు. ప్రభాకరచరిత్ర మయినను ఆ ప్రభాకరుడు తొల్లింటి నేను గాక వేఱొకఁ డే.
పరుషము నిష్ప్రయోజన మబద్ధ మనార్యము చేరరాదు నా
విరచనలందు, డెందము పవిత్రముగా విలసిల్లి సత్యసుం
దరము పరార్ధ యుక్త మగుత త్త్వమునే వెలయింపఁ గావలె౬,
గురుచరణారవిందములకుం బ్రణమి ల్లెదా నేర్మికై.
౨
జనాదికము
సర్వజిన్మాఘ బహుళై కాదశీ మంగళవారమున ఉదయాది 19 గడియలకు జ్యేష్టా చతుర్ధ చరణమున -క్రీ. 1888ఫిబ్రవరి 7 తేదిని-కృష్ణాతీరమున పెదకళ్ళేపల్లి గ్రామమున నేను జన్మించితిని. నా జాతకచక్రము జన్మకాల ఘటి కాది వివేచనలో నా బాల్యమున మా నాయనగారు వ్రాసి యుంచినది కలదు గాని- నేను దని నెల్ల నిందుదాహరింప వల దనుకొంటిని. జ్యోస్యులకు దాని పరిశీలనపు టలజడి వల దని నా కోరిక.
మా యూరు పూర్వము వేదశాస్త్రాది విద్యావిదులగు విప్రులతో సర్వ వర్ణ ములవారితో విలసిల్లినది. నా పసితనము నాఁటికిఁ గూడ వేద శౌత సాహిత్య విశారదు లనేకులు మా గ్రామమం దుండిరి. శ్రీవత్స గోత్రులగు వెలనాటి వైదిక బ్రాహ్మణుల వంశము నాది. శేషమ్మ మా తల్లి గారి పేరు. సుందర శాస్త్రి మా తండ్రిగారి పేరు. ఆ పుణ్యదంపతులకు నలువురు పుత్రులు, నలువురు కుమారైలును కలిగిరి. నేఁ టికిని సోదరలము న్ల్వురము సుఖముగా నున్నాము. నాకు అక్కగారు అన్నగారు నిద్దఱగ్రాజులు. తర్వాతివా రవరజులు. మా తల్లి పరమసాధ్వి.
మా తండ్రిగారు కొంత కొంతగా స్మార్త వైదిక జ్యౌతిష శిల్ప సంస్క్రుత సాహిత్యముల నేర్చిన వారు. ఆంధ్రమున మంచి సాహిత్యమును కొంచెము కవితా పరిజ్ఞానమును గలవారు. వైద్య విద్యా విశారదులు. పారంపర్యముగా పురోహితత జీవిక యయినను మా తండ్రిగారు ప్రధానజీవిక వైద్యముగా వర్దిల్లిరి. మా తల్లిదండ్రులు ప్ర్రరస్పరము ప్రేమ మయులు. వివాహమయిన తర్వాత వారెన్నడు భిన్నస్ధలము లలో నెక్కువ నాళ్లు వసించి యెఱుగరట!
