"ఏమీ సమస్యలు లేకపోవడమే పెద్ద సమస్య. సమస్య వున్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఏదో ఒకటి చేస్తాం. కానీ సమస్యే లేనప్పుడు దాన్ని ఎలా పరిష్కరించడం? అందుకే అది పెద్ద సమస్య"
"ఇందులోనూ నిజం లేకపోలేదని అంగీకరిస్తానుగానీ మాలాంటి కుటుంబాలు నిత్యం ఎంతగా కుమిలిపోతుంటాయో అనుభవిస్తేగానీ తెలియదు. ముఖ్యంగా పల్లెటూళ్ళలో వ్యవసాయం తప్ప మరే ఆదాయం వుండదు. బొటాబొటిగా ఆదాయం అదీ సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడో వచ్చే ఆ కాసింత ఆదాయాన్ని నమ్ముకుని సంవత్సరమంతా అప్పులు.
తీరా పంట చేతికి అందినప్పుడు ధరపలకదు. అవతల అప్పులవాళ్ళు యమదూతల్లా ఇంటి చూరు పట్టుకుని వేలాడుతుంటారు.
యమభటుల చేతుల్లో కత్తులూ కఠార్లూ వుంటే వీళ్ల దగ్గర బాండు పత్రాలుంటాయి.
అందుకే వచ్చిన ధరకే పంటనంతా అమ్ముకోవాల్సి వస్తుంది. మళ్ళీ అప్పులు అప్పు అంటే ఎప్పటికీ మమ్మల్ని వదిలిపోని గజ్జి, గోక్కుంటూ వుంటే మరింతగా చర్మము చిట్లడము తప్ప దురదపోదు.
పల్లెటూరులో వున్నా నీ కుంటుంబంలాంటి కుటుంబాల కథ వేరు. మీరు భూస్వాములు కాబట్టి సంవత్శరానికి వచ్చినా లక్షల్లో ఆదాయం వుంటుంది ఎకరా, రెండెకరాలు వున్నవాళ్ళ బతుకులే పరమనీచం"
"నిజమే కానీ డబ్బులున్నా, దాన్ని ఎంజాయ్ చేయలేనివారున్నారు నాలాగా. బాధలేకపోవడమే ఆనందం అనుకుంటే నేను చాలా ఆనందంగా వుండాలి కానీ అది నిజం కాదు. ఆనందం అనేది వేరే వుంది. ఈ సత్యం తెలిసిపోవడమే నా సమస్య."
"బాధల్లోంచి ఆనందము వెతుక్కోవడమే మాకు చేతనైంది. పల్లెటూళ్ళో జరిగే కొన్ని సంఘటనలు వినడంతోటే ఎంతో నవ్వొస్తుందో! కానీ వాటిని తరచి చూస్తే పేదరికం విశ్వరూపం కనిపిస్తుంది. ఈ మధ్య మా వూర్లో ఇలాంటిదే జరిగింది"
"ఏం జరిగింది?" సూర్యాదేవి కాస్తంత ముందుకి వంగి అడిగింది. పూలబరువుకి వంగిన లతలా వుంది ఆమె ఆ మసక వెలుతురులో.
మహిత చెబుతుంటే ఇంట్రస్టింగ్ గా వింటోంది.
"మా వూర్లో శశిరేఖ అనే అమ్మాయి ఉంది. సన్నగా ఉండడానికీ, నాజూగ్గా ఉండడానికి చాలా భేదం వుంది. చాలామంది అమ్మాయిలకు యిది తెలియక సన్నగా ఉండడానికి డైటింగ్ పేరుతో బక్కగా తయారవుతారు. కానీ శశిరేఖ నిజంగానే చాలా నాజూకుగా వుండేది. మల్లెతీగకు సృష్టివైపరీత్యము వల్ల బత్తాయిపళ్ళు కాసినట్లు యెదమాత్రము యెత్తుగా వుండేది. సాయంకాలం ఆరుపైన ఆమె నడుము కనిపించేది కాదు - అంత సన్నగా వుండేది నడుము.
కాళ్ళకు వెంట్రుకలు కాస్తంత ఎక్కువగా వుండేవి. అలా వుంటే స్త్రీలకు కోరిక ఎక్కువ అని చాలామంది మూర్ఖులు నమ్ముతారు.
అందుకే పెళ్ళికాని శశిరేఖ కోసం చాలామంది అబ్బాయిలు గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించారు.
వాళ్ళల్లో దీపక్ ఒకడు. ఆమె యెదురిల్లే అతనిది. కాస్త కలిగిన కుటుంబం. పదెకరాల మాగాణి వుండేది. శశిరేఖది పేద కుటుంబం. తల్లీ తండ్రీ, అన్నా వదినా ఉన్నారు. సొంతంగా భూమి అనేది లేదు వాళ్ళకి ఆమె అన్న పాల వ్యాపారం చేసేవాడు. ఊర్లో పాలుపట్టి టౌన్ కి తీసుకెళ్ళి హోటళ్ళకు పోసేవాడు. ఆ ఆదాయంతోనే ఇల్లు గడిచేది.
దీపక్ శశిరేఖ మీద ఎంత కోరిక వున్నా, ధైర్యం, చొరవా లేవు కాబట్టి ముందుకు పోలేకపోయాడు. ఏదో బిడియం, జంకూ అతన్ని వెనక్కి లాగేవి.
శశిరేఖ ఎప్పుడోగానీ ఇంట్లోంచి బయటికిరాదు. సాయంకాలం బావి దగ్గరికి నీళ్ళకు వచ్చేది. ఆ టైమ్ లో మాత్రం దీపక్ తన ఇంటి తిన్నె మీద కూర్చునేవాడు ఆమెను చూస్తూ గుటకలు మింగేవాడు.
అంతలో శశిరేఖకి పెళ్ళి సంబంధం కుదిరింది. పెళ్ళికొడుకు తన స్వంత ఊరిలో టీ కొట్టు నడుపుకుంటున్నాడు. కట్నం ఏమీ అడగలేకపోవడంతో మరో ఆలోచన లేకుండా శశికి పెళ్ళి చేసేశారు.
ఆమెకి పెళ్ళి అయినా దీపక్ మాత్రం తన ఇష్టాన్నిచంపుకోలేదు ఆమెతో గడపాలన్న కోరిక తప్ప పెళ్ళి చేసుకునే ఉద్దేశం అతనికి లేదు. అందువల్లే ననుకుంటా అతను తన మోహాన్ని చంపుకోలేదు.
పెళ్ళయి సంవత్సరం అయిపోయింది. వేసవికాలంలో పర్మినెంట్ గా శశి పుట్టింటికి వచ్చేసింది. అక్కడ టీ అంగడి బాగా జరక్కపోవడంతో ఇక్కడికి వచ్చేశారన్నమాట. శశిభర్త బస్టాండ్ లో టీ అంగడి ఓపెన్ చేశాడు. పల్లెటూరిలో డబ్బులిచ్చి టీ తాగేవాళ్ళెవరు? ఏదో దానికి దానికి సరిపోయేటట్లు జరిగేది.
మూడు కుటుంబాల మధ్య మనస్పర్ధలు బయల్దేరాయి. ఒకే లోగిలిని మూడు భాగాలుగా చేశారు. శశీవాళ్ళు, శశీవదిన అన్నయ్యవాళ్ళు విడివిడిగా రెండు గుడిసెలు వేసుకున్నారు. పాత ఇంటిని ముసలివాళ్ళ కిచ్చేశారు. ఎవరి బాధలు వాళ్ళు పడుతున్నారు. పూట గడవడమే కష్టంగా తయారైంది మూడు కుటుంబాలకు.
దీపక్ టీ అంగడికెళ్ళి, శశి కుటుంబం ఎంత కష్టాల్లో వుందీ పసికట్టాడు. ఇదే మంచి సమయమని అనుకున్నాడు. ఓ రోజు దాహిర్యం చేశాడు.
సాయంకాలం సంజెచీకట్లు ముసురుకాగానే ఓ నోటు బుక్కు కాగితం, పెన్సిలూ సంపాదించాడు.
"శశీ! నీవు నాతో పర్మినెంటుగా స్నేహం చేస్తానంటే సంవత్సరానికి ఇరవైమూతల వడ్లు ఇస్తాను" అని రాసి, కింద తన పేరు రాశాడు.
ఓ చిన్నపిల్లని పిలిచి - "రంగమ్మా! దీన్ని తీసుకెళ్ళి అదిగో అక్కడ పెరట్లో గిన్నెలు తోముతూ వుండే శశిరేఖ- ఆవిడకి ఇచ్చెయ్" అని చెప్పాడు.
ఆ పిల్ల ఉత్తరం తీసుకుని వెళ్ళింది.
పెరట్లో దూరి శశికి ఇచ్చింది.
ఆమె దాన్ని చదివింది. విషయం అర్ధమైంది.
"ఇంట్లో టేబుల్ మీద పెన్సిల్ వుంది తీసుకురా" అంది.
ఆ పిల్ల పెన్సిల్ తీఉస్కురాగానే, "నేను రెడీ" అని రాసి, కింద తన సంతకం లేకుండా మడతపెట్టి-
"ఇది ఇచ్చేయ్" అని తిరిగి అదే ఉత్తరాన్ని ఇచ్చి తన పనిలో పడింది.
రంగమ్మ దాన్ని తీఉస్కుని ముందుకు కదిలింది. ఇదంతా తన యింట్లో, కూర్చుని గమనించిన శశి వదిన కాంచన ఆ పిల్లని లోపలికి పిలిచింది.
"ఏదీ! అదిటివ్వు!" అడిగింది రహస్యంగా.
"దీపక్ దీన్ని ఎవరికీ ఇవ్వద్దన్నాడు"
"ఫరవాలేదులే! ఇటివ్వు" అని లాక్కుంది.
కిరసనాయిలు దీపం వత్తి ఎక్కించి మొత్తం చదివింది. ఏం జరిగిందో తెలిసింది. తను చేయాల్సిందేమిటో కూడా వెంటనే తట్టింది. చాకలి పద్దులు రాయడానికి వుంచిన పెన్సిల్ ను తీసుకుని, "నేను కూడా రెడీ- పది మూటలు వడ్లు ఇవ్వు చాలు" అని రాసి, తన సంతకం చేసి ఇచ్చింది.
ఏం జరుగుతూ వుందో తెలియని రంగమ్మ ఉత్తరాన్ని తీసుకుని బయటికి నడిచింది.
ఇంకెవరయినా ఉత్తరం తీసుకుని చదువుతారనే భయంతో రెండు చేతుల్నీ వెనక్కి పట్టుకుని నడవడం ప్రారంభించింది. ఇక వీధిలోకి అడుగువేసేటంతలో శశితల్లి లోపలికి వచ్చింది. వెనక్కి చేతులు పట్టుకుని, భయం భయంగా చూస్తున్న రంగమ్మను పరిశీలించి అనుమానం వేసింది.
